ఖమ్మంలో గులాబీ వికాసం.. ఎమ్మెల్సీగా తాతా మధు..

by Sridhar Babu |   ( Updated:2021-12-14 00:38:15.0  )
ఖమ్మంలో గులాబీ వికాసం.. ఎమ్మెల్సీగా తాతా మధు..
X

దిశ ప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం స్థానిక సంస్థల టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తాతా మధు విజయం సాధించారు. మంగళవారం జరిగిన ఓట్ల లెక్కింపులో విజయబావుటా ఎగురవేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక ఎమ్మెల్సీ అభ్యర్థులుగా టీఆర్ఎస్ నుంచి ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతా మధు, కాంగ్రెస్ నుంచి రాయల నాగేశ్వరరావు, ఎంపీటీసీల ఫోరమ్ నుంచి కొండపల్లి శ్రీనివాస్ రావు, స్వతంత్ర అభ్యర్థిగా కొండ్రు సుధ బరిలో నిలిచారు. అయితే కాంగ్రెస్ అభ్యర్థి నుంచి పోటీ ఉంటుందని అందరూ భావించారు. క్రాస్ ఓటింగ్ జరిగి తమకు అనుకూల ఫలితం వస్తుందని హస్తం పార్టీ ఆశలు పెట్టుకుంది. అయితే అదేం జరగనట్టు కనిపిస్తోంది. మొత్తంగా టీఆర్ఎస్ అభ్యర్థి తాతా మధు 480 ఓట్లతో విజయం సాధించారు.

వచ్చిన ఓట్లు ఇలా..

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో స్థానిక సంస్థల ఓటర్లు మొత్తం 769 కాగా.. పోలైన ఓట్లు 738. వీటిలో టీఆర్ఎస్ అభ్యర్థి తాతా మధుకి 480, కాంగ్రెస్ అభ్యర్థి రాయల నాగేశ్వరరావుకు 242, ఎంపీటీసీల ఫోరం తరఫున నిలబడ్డ కొండపల్లి శ్రీనివాస్ కు 4ఓట్లు పడ్డాయి. ఇక 12చెల్లనివిగా పరిగనించారు.

మొదటినుంచీ నమ్మిన బంటులా..

ఏళ్లుగా పార్టీనే నమ్ముకుని.. పార్టీ పట్ల విధేయతగా ఉంటూ అభివృద్ధి కోసం కృషిచేసిన తాతా మధు సాధారణ కార్యకర్త స్థాయినుంచి ఎమ్మెల్సీగా ఎదిగారు. ఇన్నేళ్లూ ఎలాంటి పదవి లేకున్నా నమ్మిన బంటులాగా ఉన్నందుకు పార్టీ పెద్దలు ఆయనకు, సీనియర్లను కాదని అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చారు. స్థానిక సంస్థల కోటాలో సీనియర్లను కాదని ఉమ్మడి ఖమ్మం జిల్లా అభ్యర్థిగా టీఆర్ఎస్ పార్టీ కార్యదర్శి ఉన్న మధు పేరును పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. తాతామధు గెలుపు బాధ్యతను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సీరియస్ గా తీసుకున్నారు. మొదటి నుంచి అన్నీ తానై దగ్గరుండి వ్వవహరించారు.

రాజకీయ నేపథ్యం..

వామపక్ష కుటుంబంలో జన్మించిన తాతా మధు విద్యార్థి దశ నుంచే చురుకుగా అనేక పోరాటాలలో పాల్గొని నాయకత్వం వహించారు. 1986 – 1996 వరకు సీపీఎం పార్టీలో పూర్తికాలం పని చేశారు. 1998 – 2014 మధ్య కాలంలో అమెరికా లోని తెలుగు సంఘాలైనా అట్లాంటా తెలుగు సంఘం అధ్యక్షునిగా, ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA)కు కార్యదర్శిగా పనిచేశారు. ఇదే సమయంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో కేసీఆర్ పిలుపును అందుకొని ఆయన మార్గదర్శకత్వంలో అమెరికాలో అనేక కార్యక్రమాలు నిర్వహించారు.

టీఆర్ఎస్ లో ఎన్నో బాధ్యతలు

కేసీఆర్ పిలుపు మేరకు 2014 న సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర సమితి లో చేరారు. 2017 నుంచి నేటి వరకు తెరాస పార్టీ, రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర కార్యదర్శిగా పార్టీ అప్పజెప్పిన అనేక బాధ్యతలను విజయవంతంగా నిర్వహించారు. 2014లో నల్గొండ పార్లమెంట్ ఎలక్షన్ బాధ్యతలు, 2015లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ – ఉమ్మడి ఖమ్మం జిల్లా బాధ్యతలు, 2015లో పాలేరు ఉప ఎన్నికల బాధ్యతలు, 2015లో ఖమ్మం ప్లీనరీ బాధ్యతలు, 2017లో సింగరేణి కార్మిక సంఘం ఎన్నికలలో ఇల్లందు బాధ్యతలు చేపట్టారు. 2018లో శాసన సభ ఎన్నికలలో ఇల్లందు నియోజక వర్గ బాధ్యతలు నిర్వర్తించారు. 2019 లో ఖమ్మం పార్లమెంట్ ఎన్నికల బాధ్యతలు, 2021లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉమ్మడి ఖమ్మం జిల్లా బాధ్యతలు.. ఇలా పార్టీ అధిష్టానం ఏబాధ్యత అప్పగించినా విజయవంతంగా నిర్వహించారు.



Next Story

Most Viewed