టీఆర్‌ఎస్‌లో హై టెన్షన్.. పార్టీ నేతల్లో ఆధిపత్య పోరు.. హైకమాండ్‌కు వార్నింగ్

by Sridhar Babu |   ( Updated:2021-09-20 01:15:12.0  )
trs-flag 1
X

దిశ, భద్రాచలం : భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని మండలాల్లో ఈసారి పార్టీ సంస్థాగత ఎన్నికలను టీఆర్ఎస్ కేడర్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. చివరికి తమకు పదవులు రాకపోయినా తమ వ్యతిరేకులకు దక్కకూడదనే పంతం, పట్టింపులతో నేతలు అడుగులు వేస్తున్నారు. ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీలను ఓడించడం కోసం ఇంతకాలం ఎత్తులకు పైఎత్తులు వేసిన టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇపుడు సొంత పార్టీలోని వైరి వర్గాలను చిత్తుచేయడం కోసం వ్యూహాలు రచిస్తున్నారు. ఈ వ్యూహ ప్రతివ్యూహాల్లో కీలక పదవులు దక్కించుకొని పార్టీలో హీరోలు అయ్యేదెవరు, చేజార్చుకొని జీరోలుగా మిగిలేదెవరనేది ఒకటి రెండు రోజుల్లో తేలనుంది.

అయితే పదవుల కోసం రెండు, మూడు గ్రూపులుగా విడిపోయిన నాయకులు తమ వర్గానికే పదవులు దక్కుతాయనే ఆశాభావంతో ఉన్నారు. సంస్థాగత ఎన్నికల చిచ్చు టీఆర్ఎస్ పార్టీలో రావణకాష్టంలా రగులుతోంది. నాయకులు సొంతపార్టీలో రసవత్తర రాజకీయాలకు తెరలేపడంతో పార్టీ పదవులు ఎవరికి లభిస్తాయనేది టీఆర్ఎస్ శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. తాము ఆశిస్తున్న పార్టీ పదవులు దక్కించుకోవడానికి నాయకులు పార్టీలోని ప్రజాప్రతినిధులను, గ్రామశాఖల సభ్యులను కూడగట్టి బలప్రదర్శనలు, పైరవీలు తీవ్రతరం చేశారు.

పార్టీలో ఆధిపత్యం కోసం అందివచ్చే ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకునే నాయకులు ప్రస్తుత పార్టీ సంస్థాగత ఎన్నికల సందర్భంగా కీలక పదవులు దక్కించుకోవడానికి లేదా తమ అనుచరులకు ఇప్పించుకోవడం కోసం శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. తమ రాజకీయ ఎదుగుదలకు పార్టీలో అడ్డువచ్చే నాయకులను అణగద్రొక్కి వారికి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయడం కోసం ముఖ్య నాయకులు తమ అణుచరగణంతో కలిసి వ్యూహాలు పన్నుతున్నారు.

ముదిరిన విభేదాలు లాభమా.. నష్టమా..?

ఇంతకాలం నాయకుల నడుమ నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు పార్టీ పదవుల పంపిణీ వేళ బట్టబయలయ్యాయి. టీఆర్ఎస్ పార్టీలోని గ్రూపుల నడుమ పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి కనిపిస్తోంది. కొందరు పైస్థాయిలో పైరవీలు చేస్తుంటే, మరికొందరు గ్రామాల్లోకి వెళ్ళి పార్టీ శ్రేణుల మద్దతు కూడగట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. పదవులు ఇప్పించండి.. మహాప్రభో అని మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్సీ, జడ్పీ చైర్మన్ల చెంతకు ఉరుకులు, పరుగులు తీస్తున్నారు.

పదవి దక్కకపోతే పలుకుబడి పోతుందన్నట్లుగా నాయకులు ప్రతిష్టాత్మకంగా పనిచేస్తున్నారు. అయితే పదవుల కోసం గ్రూపులుగా విడిపోయి నాయకులు రోడ్డునపడటంతో ఇది పార్టీకి లాభమా.? నష్టమా అనేది రాజకీయ శ్రేణుల్లో చర్చనీయాంశమైంది.‌ ఓసారి మనస్పర్దలు వచ్చాక విభేదాలతో నాయకులు మున్ముందు కలిసి పనిచేయడం కష్టమని, ఫలితంగా పార్టీకి మేలు కంటే కీడు ఎక్కువని పొలిటికల్ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

పాత కమిటీలే కొనసాగింపు.. కొత్తవాళ్ళకు బుజ్జగింపు

పదవుల‌ కోసం పార్టీ శ్రేణులు రెండు, మూడు గ్రూపులుగా విడిపోవడం అధినాయకత్వానికి తలనొప్పిగా తయారైంది. పదవుల విషయమై ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చిన అధిష్టాన పెద్దలు గ్రూపులను సమన్వయం చేసేపనిలో పడ్డారు. అందుకే మండల కమిటీల ప్రకటనకు రెండు, మూడు రోజులు పట్టవచ్చని తెలుస్తోంది. కమిటీలను డిస్ట్రబ్ చేస్తే మున్ముందు మరిన్ని సమస్యలు ఉత్పన్నమయ్యే ప్రమాదం లేకపోలేదని భావించిన అధినాయకత్వం సాధ్యమైనంత మేరకు పాత కమిటీలను కొనసాగిస్తూ, పదవులు ఆశించే కొత్తవాళ్ళను బుజ్జగించాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా విశ్వసనీయ సమాచారం. గొడవలు పడుతున్న నేతల నడుమ రాజీ కుదర్చడానికి ఇప్పటికే జిల్లానాయకులు రంగంలోకి దిగినట్లుగా తెలుస్తోంది. మండల కమిటీలో పదవులు ఆశిస్తున్న వారికి అవసరమైతే డివిజన్, జిల్లా కమిటీల్లో చోటు కల్పించి పార్టీలో అంతర్గత గొడవలు సద్దుమణిగేలా చేయడానికి ఎన్నికల అబ్జర్వర్లు పని ప్రారంభించినట్లు సమాచారం.

తాడోపేడో తేల్చుకుంటాం..

ఎంతో సర్దుకుపోతూ పార్టీ కోసం పనిచేస్తున్నా పదవులు లేకపోవడం వలన అవమానాలు అడుగడుగునా ఎదురవుతున్నాయని, చేసిన పనికి గుర్తింపు లేకుండా పోతోందని, వ్యతిరేక ఫలితాల పాపం తమకు అంటగడుతున్నారని అందుకే ఈసారి పదవుల కోసం గట్టిగా పట్టుపడుతున్నట్లు పలువురు టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. పార్టీలో తమ సత్తాచాటడం కోసమే పదవులు కావాలని డిమాండ్ చేస్తున్నట్లుగా తెలిపారు. పాత కమిటీ నాయకత్వ వైఫల్యాల మూలంగానే పార్టీ శ్రేయస్సు దృష్ట్యా కొత్తవారికి ఈసారి అవకాశం కల్పించాలని, పార్టీ కార్యకర్తలు, అభిమానుల అభీష్టం మేరకే‌ పనిచేసేవారికి పదవులు ఇవ్వాలని గట్టిగా కోరుతున్నట్లు చెప్పారు. పదవుల ప్రయత్నంలో ఇంతకాడికి వచ్చాక ఇక వెనుకడుగు వేసేదిలేదని, అవసరమైతే పార్టీ అధిష్టానంతో తాడోపేడో తేల్చుకోవడానికి కూడా సిద్ధమే అని కొందరు నాయకులు చెప్పడం గమనార్హం.



Next Story

Most Viewed