తెలంగాణ సర్కార్‌కు రోజులు దగ్గర పడ్డాయ్: మంత్రి అన్నపూర్ణ దేవి

by Disha Web Desk 19 |
తెలంగాణ సర్కార్‌కు రోజులు దగ్గర పడ్డాయ్: మంత్రి అన్నపూర్ణ దేవి
X

దిశ, లక్షెట్టిపేట: తెలంగాణ ప్రజలు స్వచ్ఛమైన మనస్సు, ప్రేమను గలవారని, అలాంటి వారికి ఎన్నో మోసపూరిత వాగ్దానాలతో గద్దెనెక్కిన టీఆర్ఎస్ సర్కార్‌కు బుద్ధి చెప్పే రోజులు దగ్గరపడ్డాయని కేంద్ర విద్యా శాఖ సహాయ మంత్రి అన్నపూర్ణ దేవి అన్నారు. శుక్రవారం స్థానిక అశోక హోటల్ ఆవరణలో లక్షెట్టిపేట, దండేపల్లి మండలాల బీజేపీ శక్తి కేంద్ర ఇన్చార్జిలు, బూత్ కమిటీల అధ్యక్షులతో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వం ఏది చేసినా తన కుటుంబానికి మేలు చేసే విధంగానే ఉంటాయని చెప్పారు. దళితులకు మూడెకరాల భూమి కాదు కదా.. కనీసం గుంట భూమి కూడా ఇవ్వలేకపోయారని ఆమె ఎద్దేవా చేశారు. దళిత బంధు పేరిట దళితులను దగా చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం దేశ, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నదని గుర్తు చేశారు.

ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, కిసాన్ సమ్మన్ యోజన, ఉజ్వల యోజన, ఆయుష్మాన్ భారత్ లాంటి ఎన్నో సంక్షేమ పథకాలతో పేదలకు లబ్ధి చేకూరుస్తున్నదని తెలిపారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల్లో నమ్మకాన్ని కోల్పోయిందని, బీజేపీపై ప్రజల్లో క్రమేణ విశ్వాసం పెరిగిందన్నారు. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని జోస్యం చెప్పారు. దేశంలో, రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ బీజేపీ రావడం ద్వారా ప్రజలకు అన్ని విధాల లాభం జరుగుతుందని చెప్పారు. కేసీఆర్ సర్కార్ మాటలను తెలంగాణ ప్రజలు ఇక నమ్మే పరిస్థితి లేదని, రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో ఎగిరేది కాషాయ జెండాయేనన్నారు. ఈనెల 3న హైదరాబాద్ లో జరగనున్న పీఎం మోడీ బహిరంగ సభకు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. సభను విజయవంతం చేయడం ద్వారా బీజేపీ సత్తా ఏమిటో టీఆర్ఎస్ ప్రభుత్వానికి చూపించాలన్నారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ రావు, నాయకులు మున్నా రాజా, రజనీష్, కిషన్, హరి గోపాల్ రావు, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed