- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
లింగరాజు హత్యకేసు మిస్టరీలో ట్విస్ట్.. ఆ రాత్రి ఏం జరిగిందంటే..?

దిశ, దామరచర్ల: నల్గొండలో కలకలం సృష్టించిన వంట మాస్టర్ హత్య కేసు మిస్టరీ వీడుతోంది. భార్య, బావమరిదే అతడిని ఓ పథకం ప్రకారం హత్య చేశారని తెలుస్తోంది. మద్యం తాగివచ్చి హింసించడమే కారణమని పోలీసులు చెబుతున్నారు. దామరచర్ల మండల కేంద్రానికి చెందిన కుర్ర లింగరాజు(38) ఈనెల 12న రాత్రి మండల కేంద్రంలోని రైల్వే ట్రాక్ పక్కన దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. విశ్వసనీయ సమాచారం మేరకు దామరచర్లకు చెందిన లింగరాజుకు అదే ప్రాంతానికి చెందిన మల్లీశ్వరీతో 12 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడు ఉన్నారు. లింగరాజు మండల కేంద్రంలోని గిరిజన గురుకుల పాఠశాలలో కోంతకాలం వాచ్ మెన్ గా, కాంట్రాక్టు పద్ధతిలో కుకింగ్ మాస్టర్ గా పని చేస్తున్నాడు. కాగా.. లింగరాజు మద్యానికి బానిసగా మారి అనుమానంతో మల్లీశ్వరీని వేధిస్తుండేవాడు. అతడి ప్రవర్తనతో విసుగు చెందిన మల్లేశ్వరీ, తన సోదరుడు వెంకటేష్ తో కలిసి హత్య చేయాలని నిర్ణయించుకున్నారు. లింగరాజు అడ్డు తొలిగితే వచ్చే ఆస్తి, ఉద్యోగంతో సుఖంగా జీవించాలన్న ఉద్దేశంతో అతడి భార్య మల్లేశ్వరీ, ఆమె సోదరుడు వెంకటేష్ పథకం ప్రకారమే మరో ఇద్దరి సహకారంతో ఘాతుకానికి తెగబడినట్లు తెలుస్తోంది.
అసలు ఆ రాత్రి ఏం జరిగింది?
లింగరాజు రోజు మాదిరిగానే 12న రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో గురుకుల పాఠశాలలో విద్యార్థులకు వంట వండి ఇంటికి చేరుకున్నాడు. అప్పటికే మద్యం తాగి ఉన్న లింగరాజు ఇంటికి వచ్చాక మల్లీశ్వరీతో గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య కుటుంబ వ్యవహారాలపై తీవ్ర వాగ్వాదం, ఘర్షణ చోటు చేసుకుంది. ఆ తర్వాత లింగరాజు తొమ్మిది గంటల ప్రాంతంలో మళ్లీ మద్యం తాగేందుకు బయటకు వెళ్లినట్లు తెలిసింది.
ఆత్మహత్యగా చిత్రీకరించాలని ప్లాన్ వేశారు...
అయితే, ఇదే క్రమంలో లింగరాజు భార్య మల్లేశ్వరీ ఇంట్లో గొడవ గురించి సోదరుడు వెంకటేష్ కు ఫోన్ చేసి వివరించినట్లు తెలుస్తోంది. ఇద్దరు కలిసి లింగరాజును హత్య చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అదే ప్రాంతానికి చెందిన మల్లీశ్వరీ, సోదరుడు వెంకటేష్, మరో ఇద్దరితో కలిసి లింగరాజు వద్దకు చేరుకున్నారు. ఆ తర్వాత ఇంటి సమీపంలోనే రైల్వే ట్రాక్ పక్కన మల్లేశ్వరీ, లింగరాజు, వెంకటేష్ వెంట వచ్చిన రాజగట్టుకు చెందిన డ్రైవర్, హాస్టల్ లో పనిచేసే మరో వ్యక్తితో సమావేశమయ్యారు. అక్కడే మద్యం తాగుతూ గొడవలు పడితే పరువు పోతుందని లింగరాజును నచ్చజేప్పే ప్రయత్నం చేశారు. అప్పటికే హత్య చేయాలని నిర్ణయించుకున్న వెంకటేష్ ఈ క్రమంలోనే తన వెంట తెచ్చుకున్న పదునైన కత్తితో లింగరాజు గొంతుకోశాడు. ఆ తర్వాత అతడి మృతదేహాన్ని రైలు పట్టాలపై వేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని పథకం రచించారు. అయితే అర్ధరాత్రి దాటిన సమయంలో సమీప కాలనీవాసులు, ఇసుక ట్రాక్టర్లు తిరుగుతుండడంతో మృతదేహాన్ని అక్కడే వదిలేసి పారిపోయినట్లు తెలుస్తోంది.
పోలీస్ జాగిలాలు కూడా అక్కడి వరకే వెళ్లి ఆగిపోయాయి…
హత్యోదంతం వెలుగుచూడటంతో పోలీస్ జాగిలాల్ని రప్పించారు. మృతదేహం పడి ఉన్న కొద్ది దూరంలో ఉన్న నల్లా వద్దకు వెళ్లి జాగిలం ఆగిపోయింది. అక్కడే రెండు మద్యం బాటిళ్ళు కూడా పోలీసులకు దొరికాయి. మద్యం తాగిన తర్వాత లింగరాజును హత్య చేసి ఉంటారని, అందుకు ఉపయోగించిన పదునైన ఆయుధాన్ని అక్కడే నల్లా దగ్గర శుభ్రం చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.
మరింత లోతుగా పోలీసుల విచారణ…
లింగరాజు అతడి భార్య, బావమరిది హత్య చేశారని ఆరోపిస్తూ అతడి సోదరుడు చంద్రయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ దిశగానే పోలీసులు లింగరాజు భార్య మల్లేశ్వరీ, ఆమె సోదరుడు వెంకటేశం అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది. వారు ఇచ్చిన సమాచారం మేరకు మరో వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే.. లింగరాజును హత్య చేయడానికి గల బలమైన కారణాలు ఏమిటి? హత్యోదంతంలో సూత్ర సూత్రధారులు వెంకటేష్, మల్లీశ్వరేనా? అతడి వెంట వెళ్లిన మరో ఇద్దరు కూడా పాత్రధారులేనా? ఈ మొత్తం వ్యవహారంలో లింగరాజు భార్య మల్లేశ్వరి పాత్ర ఎంతో మేరకు ఉంది? ఇలా పోలీసులు మరింత లోతుగా విచారణ చేస్తున్నట్లు సమాచారం.అయితే, పోలీసులు ఒకటి రెండు రోజుల్లో హత్యోదంతం కేసు చిక్కుముడి విప్పి నిందితులను మీడియా ఎదుట ప్రవేశపెట్టి కోర్టులో హాజరు కానున్నట్లు తెలుస్తోంది.