అక్రమ బోరు వేస్తుంటే అడ్డుకున్నందుకేనా.. ఎమ్మార్వో ట్రాన్స్‌ఫర్..?

by S Gopi |
అక్రమ బోరు వేస్తుంటే అడ్డుకున్నందుకేనా.. ఎమ్మార్వో ట్రాన్స్‌ఫర్..?
X

దిశ, మణుగూరు: పినపాక నియోజకవర్గంలో ప్రభుత్వాధికారులు ఉద్యోగం చేయాలంటేనే భయపడిపోతున్నారు. స్థానిక అధికార పార్టీ నాయకులు ప్రభుత్వాధికారులకు తలనొప్పిగా మారారని కొందరు అధికారులు చెప్పుకొస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నామా.. లేక అధికారపార్టీకి కొమ్ము కాస్తున్నామా అనే అర్థంకాని పరిస్థితిలో ఉన్నామని అధికారులు మనోవేదనకు గురవుతున్నారు. ఏ.. పని చేయాలన్నా అధికారపార్టీ నాయకులు వచ్చి చెబితేనే ఆ పని చేయాల్సి వస్తుందని కొందరు అధికారులు చెప్పుకొస్తున్నారు. అధికార పార్టీ నాయకులను కాదని ఉద్యోగం చేస్తే ట్రాన్సఫర్లు చేపిస్తున్నారని వాపోతున్నారు. అసలు విషయంలోకి వెళ్ళితే... మండలంలోని విప్పల సింగారంలో ఓ బాధితుడు బోరు వేసుకునేందుకు మండలంలోని ఓ రిపోర్టర్ ను అడిగాడు. అయితే ఆ రిపోర్టర్ 'తాను రెండురోజుల క్రితమే బోర్ వేసుకున్నాను.. నీకు కూడా నేను బోర్ వేయిస్తా.. అన్ని నేను చూసుకుంటాలే' అని చెప్పి ఆ బాధితుడి దగ్గర నుంచి కొంత డబ్బులు వసూలు చేశాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఆ బాధితుడు ఆ రిపోర్టర్ మాటలు నమ్మి బోర్ వేయించుకుంటున్నాడు. ఈ క్రమంలో అటువైపుగా వెళ్తున్న మరో రిపోర్టర్ ఇది గమనించి స్థానిక తహశీల్దార్ చంద్రశేఖర్ కు సమాచారం అందించాడు. వెంటనే ఎమ్మార్వో బోర్ వేస్తున్న ప్రాంతానికి చేరుకుని అడ్డుకున్నారు. అనంతరం బోర్ వాహనాన్ని, సిబ్బందిని వీఆర్ఓ ద్వారా తహశీల్దార్ కార్యాలయానికి తరలించారు.

వెంటనే ఆ బాధితుడు ఆ రిపోర్టర్ కు ఫోన్ చేసి బోర్ వేస్తుంటే తహశీల్దార్ చంద్రశేఖర్ వచ్చి అడ్డుకున్నారని చెప్పుకొచ్చాడని సమాచారం. దీంతో ఆ రిపోర్టర్ స్థానిక అధికార పార్టీలో ఓ కీలక నాయుడుకి ఫోన్ చేసి విషయం చెప్పాడు. దీంతో ఆ అధికార పార్టీ నాయకుడు ఆ బాధితుడిని ఎమ్మెల్యే రేగా కాంతారావు దగ్గరకు వచ్చి చెప్పమను అని ఆ రిపోర్టర్ తో చెప్పాడని విశ్వసనీయ సమాచారం. వెంటనే ఆ బాధితుడు ఎమ్మెల్యే రేగా దగ్గరకు వచ్చి విషయం చెప్పి వాపోయాడు. ఆ తరువాత విషయం ఏంటో తెలుసుకుందామని తహశీల్దార్ చంద్రశేఖర్ కు ఎమ్మెల్యే రేగా కాంతారావు ఫోన్ చేశారని కొంత సమాచారం. అయితే, తహళీల్దార్ చంద్రశేఖర్

ఎమ్మెల్యే రేగా ఫోన్ లిఫ్ట్ చేయలేదని కొందరు చెప్పారు. అయితే అదే సమయానికి తహశీల్దార్ భోజనానికి వెళ్లాడని తెలిసింది. ఈలోపు భోజనం తరువాత జిల్లా కలెక్టర్ మీటింగ్ ఉందని, ఆ మీటింగ్ కు వెళ్లడానికి తహశీల్దార్ సిద్ధంగా ఉన్నాడని కొంత విశ్వసనీయ సమాచారం. ఈ క్రమంలో ఎమ్మెల్యే రేగా కాంతారావుకు పక్కనే ఉన్న ఓ నాయకుడు తహసీల్దార్ చంద్రశేఖర్ గురించి తప్పుడు మాటలు చెప్పి కార్యాలయానికి పిలిపించాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఈ లోపు కార్యాలయంలో ఆ నాయకుడు కొందరి విద్యార్థులతో తమకు కొన్ని సర్టిఫికెట్స్ తహశీల్దార్ ఇవ్వడం లేదని ఓ నాటకాన్ని క్రియేట్ చేశాడని కొంత సమాచారం. ఈలోగా ఎమ్మెల్యే రేగా కార్యాలయానికి వచ్చి ఆ విద్యారులను చూసి ఏంటని విద్యారులను అడిగారు. దీంతో విద్యార్థులు ఉన్న విషయం ఎమ్మెల్యేకు చెప్పారు. అయితే ఈ క్రమంలో ఎమ్మెల్యే రేగా తహశీల్దార్ లేని సమయంలో తహశీల్దార్ కార్యాలయంలో కూర్చొని తహశీల్దార్ చంద్రశేఖర్ కు ఫోన్ చేశారు. ఈలోపు జిల్లా కలెక్టర్ మీటింగ్ ఉందని బయలుదేరిన తహశీల్దార్ ఎమ్మెల్యే రేగా ఫోన్ రాగానే అశ్వాపురం మండలం దాటినా తహశీల్దార్ మళ్ళీ వెనుకకు తిరిగి కార్యాలయానికి వచ్చారు. దీంతో విద్యార్థుల విషయం, బోర్ వేసిన విషయం తదితర కొన్ని విషయాలు తహశీల్దార్ ని అడిగారని కొంత విశ్వసనీయ సమాచారం. అయితే ఎమ్మెల్యే అడిగిన ప్రశ్నలకు తహశీల్దార్ సమాధానం చెప్పుకుంటూ వచ్చారని అక్కడ ఉన్న స్థానికులే చెప్పుకొచ్చారు. ఈలోగా ఎమ్మెల్యే రేగా పక్కన ఉన్న ఓ నాయకుడు చెప్పిన మాటలు గుడ్డిగా నమ్మి తహశీల్దార్ చంద్రశేఖర్ పై ఎమ్మెల్యే రేగా తెలంగాణ రాష్ట్ర సీసీల్ కు, జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారని కొంత సమాచారం.

దీంతో స్థానిక ఎమ్మెల్యే రేగా మాట విన్న సీసీల్, జిల్లా కలెక్టర్ తహశీల్దార్ ను ట్రాన్స్ ఫర్ చేశారనే ఊహాగానాలు వినిపించాయి. అక్రమంగా బోర్ వేస్తే అడ్డుకున్నందుకా..? లేక.. అధికార పార్టీ నాయకుడి మాట విననందుకా..? లేక.. ఎమ్మెల్యే ఫోన్ ఎత్తనందుకా..? తహసీల్దార్ చంద్రశేఖర్ ట్రాన్స్ఫర్ అని ప్రతిపక్షనాయకులు ప్రశ్నిస్తున్నారు. తన అనుచరుడే ఎమ్మెల్యేకు తలనొప్పిగా మారాడడని, ఇలాంటి నాయకుల వల్లే ఎమ్మెల్యే రేగాకు చెడ్డ పేరు వస్తుందని ప్రజలు అంటున్నారు. ఇంత జరుగుతున్నా ఎమ్మెల్యే రేగా ఆ నాయకుడిని ఎందుకు పక్కన పెట్టుకున్నారన్నదే ప్రశ్నార్థకంగా మారింది. ఆ నాయకుడు చేసే కబ్జాలకు ప్రభుత్వాధికారులు అడ్డు వస్తే ఎమ్మెల్యే రేగాతో చెప్పి ఆ అధికారులను ట్రాన్స్ ఫర్ చేయిస్తున్నాడని ప్రజలు చెవులు కొరుక్కుంటున్నారు.

తహశీల్దార్ చంద్రశేఖర్ ను పంపించేందుకే అధికార పార్టీకి చెందిన ఆ నాయకుడు కుట్రకు తెరలేపాడని పలువురు అంటున్నారు. మొన్నటికి మొన్న మున్సిపాలిటీ కమిషనర్ నాగప్రసాద్, నేడు తహశీల్దార్ చంద్రశేఖర్ ట్రాన్స్ ఫర్ కావడానికి ఈ నాయకుడే కారణమని ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో ప్రభుత్వాధికారులు ఉద్యోగం చేయాలంటే అధికార పార్టీ నాయకుల వల్ల భయపడుతున్నామని కొందరు ఉద్యోగులు చెప్పుకొస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఈ విధంగా ఉందని నియోజకవర్గ ప్రజలు గుసగుసలాడుతున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర, జిల్లా ఉన్నతాధికారులు అధికారపార్టీ నాయకుల నుంచి ప్రభుత్వ ఉద్యోగులను కాపాడాలని ప్రతిపక్ష నాయకులు, పలు సంఘాల నాయకులు, ప్రజలు కోరుతున్నారు.



Next Story

Most Viewed