'కేసీఆర్‌కు డబ్బులు సంపాదించడంపైనే శ్రద్ధ': టీజేఎస్‌పీ

by Javid Pasha |
కేసీఆర్‌కు డబ్బులు సంపాదించడంపైనే శ్రద్ధ: టీజేఎస్‌పీ
X

దిశ, సూర్యాపేట : ఈ ప్రభుత్వం పెద్దలకు ఎన్నికల్లో వేదజల్లిన డబ్బులను సంపాదించడంలో ఉన్న శ్రద్ధ ప్రజల సంక్షేమంపై లేదని తెలంగాణ జన సమితి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం విమర్శించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో బుధవారం నిర్వహించిన జిల్లా పార్టీ కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై పార్టీ బలోపేతం కోసం కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. రానున్న ఎన్నికల కోసం ముందస్తుగా అభ్యర్థులను ప్రకటించారు. జిల్లాలోని సూర్యాపేటకు కుంట్ల ధర్మార్జున్ రెడ్డి, హుజూర్ నగర్‌కు దొంతిరెడ్డి శ్రీనివాస్ రెడ్డిల పేర్లను ప్రకటించారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ అవివేకంతో అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేస్తోందని, అందువల్ల ప్రజలపై అధిక విద్యుత్ చార్జీల భారం పడుతుందని విమర్శించారు. ప్రభుత్వం డిస్కంలకు చెల్లించాల్సిన బకాయిలు కడితే డిస్కంలకు నష్టాలుండవని అన్నారు. ప్రభుత్వ అసమర్థ పాలనకు పెంచిన విద్యుత్ ఛార్జీలే నిదర్శనమని దుయ్యబట్టారు. యాసంగి ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రానికి సమస్యను సమర్థవంతంగా వివరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.

రాష్ట్రంలో అసమర్థ పాలన రాజ్యమేలుతుందని, ప్రజలకు ఎంగిలి మెతుకులు వెదజల్లి అధికారంలోకి వచ్చిన పాలకులు కోట్లు దండుకుంటున్నారని ఆరోపించారు. ప్రజల సంక్షేమం పట్టని రాజకీయాలను తిరస్కరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అన్ని కోణాల్లో విఫలమై, ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చని ఈ ప్రభుత్వం మారాల్సిందేనన్నారు. ప్రజల కేంద్రంగా నడిచే రాజకీయ పాలన కోసం, రాజకీయాల్లో మార్పు కోసం వస్తున్న తెలంగాణ జన సమితి పార్టీని ఆదరించాలని ప్రజలను కోరారు.



Next Story

Most Viewed