ఒకరిని కాపాడబోయి ఒకరు.. చెరువులో మునిగి ముగ్గురు మృతి

by Disha Web Desk 13 |
ఒకరిని కాపాడబోయి ఒకరు.. చెరువులో మునిగి ముగ్గురు మృతి
X

దిశ, దుగ్గొండి: వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం లో విషాదం చోటుచేసుకుంది. నర్సంపేట మండలంలోని చిన్న గురిజాల గ్రామానికి చెందిన ఓ కుటుంబంలో మూడు తరాలను చెరువు కబళించింది. ప్రమాదవశాత్తు దుగ్గొండి మండలంలోని అడవి రంగాపురం శివారులోని రాళ్ళకుంటా చెరువులో పడి ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. నర్సంపేట రూరల్ మండలం చిన్న గురజాల గ్రామానికి చెందిన వెంగలదాసు కృష్ణ మూర్తి (55) కుటుంబంతో సహా భార్య, కుమారుడు, కోడలు, ఆదివారం సెలవు దినం కావడంతో మనుమండ్ల ను తీసుకొని దుగ్గొండి మండలం రంగపురం గ్రామ శివారులో ఉన్న వ్యవసాయ భూమి వద్దకు వెళ్లారు. పనులు ముగించుకుని పక్కనే ఉన్న చెరువులో మృతుడు కృష్ణ మూర్తి, కుమారుడు నాగరాజు (34), మనవడు దీపక్ (11), లు చేతులు కడుక్కోవడానికి రాళ్ల కుంట చెరువుకు వెళ్లడంతో ప్రమాదవశాత్తు చెరువులో పడి ఒకరినొకరు రక్షించబోయి ముగ్గురు మృత్యువాత పడ్డారు.


ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రమాదవశాత్తు మృత్యువాత పడటంతో చిన్న గురజాల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటన విషయం తెలుసుకున్న నర్సంపేట శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకొని, మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఇట్టి విషయంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు దుగ్గొండి సర్కిల్ ఇన్స్పెక్టర్ సూర్య ప్రసాద్, సబ్ ఇన్స్పెక్టర్ వి. నవీన్ కుమార్ లు తెలిపారు.





Next Story