మంత్రివర్గం కూర్పుపై ఆసక్తికర చర్చ.. కొత్త మంత్రులు 15 మందే?

by Disha Web Desk 2 |
మంత్రివర్గం కూర్పుపై ఆసక్తికర చర్చ.. కొత్త మంత్రులు 15 మందే?
X

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో మంత్రివర్గం కూర్పుపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన కేబినెట్‌ను రద్దు చేసిన సంగతి తెలిసిందే. కొత్త మంత్రులతో ఈ నెల 11న ప్రమాణ స్వీకారం చేయించేందుకు సిద్ధం అయ్యింది. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేబినెట్ కూర్పు ఉంటుందని అంతా భావిస్తున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సామాజిక వర్గాలను ఆకట్టుకునే విధంగా కూర్పును రూపొందిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నది. 2019 కేబినెట్‌లో కూర్పుకు పూర్తి భిన్నంగా తాజా కూర్పు ఉండబోతుందని ఇప్పటికే వైసీపీ వర్గాలు లీకులు ఇచ్చిన సంగతి తెలిసిందే. కొత్త కేబినెట్‌లో కొందరూ మంత్రులు కొనసాగే అవకాశం ఉంటుందని సాక్షాత్తూ సీఎం జగన్ ప్రకటించారు. ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతున్నది.

కొందరు మంత్రుల కొనసాగింపు

ఈసారి కేబినెట్‌లో ఎవరిని తీసుకుంటారు..? కొత్తగా ఎవరికి చోటు కల్పిస్తారనే అంశంపై పొలిటికల్ సర్కిల్‌లోనే కాదు సామాన్యుడు సైతం చర్చించుకుంటున్నారు. కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారానికి ముహూర్తం సమీపిస్తుండటంతో ఎంత మందికి చోటు దక్కబోతుంది. పాత మంత్రులు ఎంతమంది కొనసాగుతారు అనే అంశంపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. తొలుత ముఖ్యమంత్రి 100శాతం మంది మంత్రులను మారుస్తారంటూ ప్రచారం జరిగింది. ఆ తర్వాత 90శాతం మంది మంత్రులను మారుస్తారంటూ వార్తలు హల్‌చల్ చేశాయి. వైసీపీ శాసన సభాపక్ష సమావేశంలోనూ.. మంత్రులు రాజీనామాలు చేసిన సందర్భంలోనూ కొంతమంది తనతోపాటే కొనసాగుతారంటూ జగన్ క్లారిటీ ఇచ్చారు. ఎంతమంది కొనసాగుతారు అనేదానిపై క్లారిటీ ఇవ్వలేదు.

సీనియర్ మంత్రుల అలక

మంత్రి పదవులకు రాజీనామా చేసిన అనంతరం పలువురు మంత్రులు మీడియాతో మాట్లాడారు. కొడాలి నాని మాట్లాడుతూ.. మంత్రి మండలిలో ఉన్న 24 మంది రాజీనామాలు చేసినట్లు తెలిపారు. కొందరు సీనియర్లు తనతోపాటు కొనసాగుతారని జగన్ చెప్పారని నాని పేర్కొన్నారు. అనుభవం రీత్యా, కుల సమీకరణాల నేపథ్యంలో ఐదుగురు మంత్రులు కేబినెట్‌లో కొనసాగే అవకాశం ఉందని.. అయితే తనకు అవకాశం లేకపోవచ్చని కొడాలి చెప్పారు. కొంతమంది సమర్థవంతమైన నేతలు కావాలని ఈ నేపథ్యంలో సామాజిక సమీకరణాల నేపథ్యంలో మంత్రివర్గం కూర్పు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. మంత్రి పదవులు కోల్పోయిన వారికి పార్టీ బాధ్యతలు అప్పగిస్తానని సీఎం వెల్లడించినట్లు నాని పేర్కొన్నారు. పార్టీలో ఎవరిని ఎలా ఉపయోగించుకోవాలో జగన్‌కు మాత్రమే తెలుసునని.. ఈ నెల 11న స్పష్టమవుతుందన్నారు. అనంతరం మాజీమంత్రి బొత్స సత్యనారాయణ సైతం దేవుడి దయ ఉంటే మంత్రివర్గంలో తిరిగి కొనసాగుతానంటూ అన్నారు. కొందరు మంత్రులు మాత్రం మీడియాతో మాట్లాడేందుకు విముఖత వ్యక్తం చేశారు. ఇలా మంత్రి పదవులకు రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేలలో కొందరూ సీనియర్లు సీఎం జగన్‌పై అలకబూనినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాము కష్టపడి పని చేశామని.. విపక్షాలను ధీటుగా ఎదుర్కొన్నామంటూ పలువురు మాజీ మంత్రులు వాపోయారట. ఈ విషయం సీఎం దృష్టికి వెళ్లినట్లు తెలుస్తోంది.

ఈక్వేషన్స్‌లో ఎలాంటి మార్పు లేదు

2024 ఎన్నికలే లక్ష్యంగా కేబినెట్ కూర్పుపై కసరత్తు చేస్తున్న సీఎం జగన్ సీనియర్లకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నారట. సీనియర్లు అలకబూనితే పార్టీకి ఇబ్బందులు తలెత్తే అవకాశం లేకపోలేదని వైసీపీ అధిష్టానం భావిస్తున్నట్లు భోగట్టా. జగన్ ఈక్వేషన్స్ ప్రకారం ఈసారి కేబినెట్‌లో బీసీ-9, ఎస్సీ సామాజిక వర్గం-6, ఎస్టీ-2, మైనారిటీ-1, రెడ్డి-3, కమ్మ-1, ఇతరులు-3 చోటు కల్పించాలని సీఎం భావించారు. ఈ ఈక్వేషన్స్‌ ఏ మాత్రం మార్చకుండా మంత్రివర్గం కూర్పు జరగనుందని సమాచారం. గత కేబినెట్‌లో పని చేసిన వారిలో 7 నుంచి 11 మందికి చోటు కల్పిస్తారని, దీంతో కొత్తగా 14 నుంచి 17 మందికి కొత్తగా కేబినెట్‌లో చోటు దక్కే అవకాశాలు ఉంటాయని సమాచారం. సామాజిక సమీకరణాలు, జిల్లా అవసరాల దృష్ట్యా కొత్త మంత్రులు ఉండే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ శనివారం లేదా ఆదివారం మంత్రివర్గం కూర్పు ఓ కొలిక్కి వచ్చే ఛాన్స్ ఉన్నట్లు వైసీపీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది.


Next Story

Most Viewed