- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
నిమ్జ్పై నీలినీడలు.. సీఎం నోట కోట్ల మాట

దిశ, జహీరాబాద్: రీజినల్ రింగ్ రోడ్ ప్రాంతంలోని వాసాలమర్రి ప్రాంతంలో ఎకరం భూమి ధర రూ.1కోటి పలుకుతుందని అసెంబ్లీ, విలేకరుల సమావేశాలతో పాటు అనేక సందర్భాల్లో స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. కానీ నిమ్జ్ ప్రాజెక్ట్కు భూములు త్యాగం చేస్తున్న రైతులకి ఇవేవి వర్తిచడంలేదు. సరైన పరిహారం కోసం రైతులు పోరాటం చేస్తున్నారు. కొందరైతే భూములిచ్చేందుకు ససేమిరా అంటున్నారు. దీంతో ప్రాజెక్ట్పై నీలినీడలు కమ్ముకున్నాయి.
ముఖ్యమంత్రి కేసీఆర్ పలు సందర్బాల్లో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో సైతం భూముల ధరలు భారీగా పెరిగాయని , ఎక్కడ కూడా ఎకరం భూమి ధర రూ.25 నుంచి 30 లక్షలకు తక్కువ లేదని అన్నారు. ఒకప్పుడు పురుగుల మందు తాగి చనిపోయిన రైతులకు, ఇప్పుడు మూడు ఎకరాలుంటే కోటేశ్వరులే అన్నారు. రాష్ట్రంలో భూముల ధరలు కోట్లలో పలకనున్నాయని అన్నారు. కానీ దేశానికే తలమానికంగా మారనున్న నిమ్జ్కు భూములిస్తున్న తమపై ఎందుకు వివక్ష చూపుతున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ ప్రాంతంలో ఎకరం భూమి మార్కెట్ ధర రూ.60 లక్షలుండగా ప్రభుత్వం ఇచ్చింది కేవలం రూ.5 లక్షలు మాత్రమేనని అంటున్నారు. రూ.9లక్షల వరకు పరిహారం పెంచినట్లు చేస్తున్న ప్రకటనలపై రైతులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పరిహారంతో ఇంటి జాగ రాదని బాహాటంగా విమర్శలు చేస్తున్నారు. దీంతో రైతులు తమ భూములను నిమ్స్ ప్రాజెక్టుకు ఇచ్చేందుకు రైతులు ససేమిరా అంటున్నారు.
వేలాది ఎకరాలు, భారీ పెట్టుబడులు, పెద్ద కంపెనీల ఏర్పాటుతో లక్షలాది మందికి ఉపాధి కల్పించే లక్ష్యంతో జహీరాబాద్ ప్రాంతంలో అడుగుపెట్టిన నిమ్జ్ (నేషనల్ ఇన్వెస్ట్ మెంట్ అండ్ మ్యాన్యుఫ్యాక్చర్ జోన్) ప్రాజెక్టు లక్ష్య సాధనలో కునారిల్లుతోంది. అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులను సాధించే ప్రాజెక్ట్ ఏర్పాటులో ప్రభుత్వ పెద్దలు, అధికారుల చిత్తశుద్ధి పూర్తిగా కోరడమే ఇందుకు ప్రధాన కారణం అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అనువైన వాతావరణం కారణంగా రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే అతిపెద్ద జాతీయ పెట్టుబడులు, ఉత్పత్తి సంస్థ( నిమ్జ్)ను జహీరాబాద్లో ఏర్పాటుకు ప్రభుత్వాలు పూనుకున్నారు. ఈ ప్రాంతంలో 3 లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వాలు 2012 వ సంవత్సరంలో రూ.31వేల కోట్ల పెట్టుబడులతో ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టాయి.
అదేవిధంగా 2022వ సంవత్సరం నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ కారణాలు ఏమైనప్పటికీ లక్ష్యానికి ఆమడ దూరంలో ప్రాజెక్టు ఏర్పాటు ప్రక్రియ ఉందని స్పష్టంగా తెలుస్తుంది . నిమ్జ్ ప్రాజెక్టు ఏర్పాటుకు అవసరమైన 12,635 ఎకరాల భూమిలో గత పది సంవత్సరాలలో కేవలం 3501 వేల ఎకరాలు మాత్రమే సేకరించారు. మిగతా భూమి ఎప్పటి వరకు సేకరిస్తారో, ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందో చెప్పడం ఎవరికైనా కష్ట సాధ్యమే. కంపెనీలు ఏర్పాటు కోసం బలవంతంగా భూములు సేకరించాలని చూస్తున్న ప్రభుత్వానికి రైతు ఐక్య పోరాటం, న్యాయస్థానాల అండదండలు వారిని కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
3501 ఎకరాలు మాత్రమే సేకరించారు
నిమ్జ్ ప్రాజెక్టు అభివృద్ధి కోసం 17 గ్రామాలకు చెందిన భూములను ప్రభుత్వం గుర్తించింది. ఇందులో 3 ఝరాసంగం మండలానికి చెందిన గ్రామాలు ఉండగా న్యాల్కల్ మండలానికి చెందినవి 14 గ్రామాలున్నాయి. ఆ రెండు మండలాలకు చెందిన గ్రామాల్లో ఇప్పటివరకు కేవలం 3501 ఎకరాలు మాత్రమే సేకరించినట్లు అధికారులు చెప్పారు. మిగతా భూసేకరణకు సంబంధించి అధికారులు అన్ని గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహించారు. తొలి విడతలో ప్రాజెక్టు కోసం సేకరించిన భూములకు రూ. 3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు పరిహారంగా చెల్లించారు.
ప్రాజెక్టుకు అనువైన ప్రాంతం
జాతీయ రహదారికి సమీపంలో కర్ణాటక, తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో చూడచక్కని విశాలమైన ప్రదేశంలో కంపెనీల ఏర్పాటుకు అనువైన ప్రాంతాన్ని ప్రభుత్వం ఎంపిక చేసింది. దీంతో ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున కంపెనీలు వస్తాయని ఉపాధి ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయని అధికారులు పేర్కొంటున్నారు . అందుకు అనుగుణంగా పరిహారం చెల్లింపు విషయంలో కూడా ప్రభుత్వం సానుకూలత దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మొదటి దశలో ఎకరం భూమి ధర రూ. 3 లక్షల నుంచి 5 లక్షల వరకు పరిహారం చెల్లించారు.
అందుకు రైతులు విముఖత చూపడంతో ప్రస్తుత ధరను రూ.9 లక్షలకు పెంచినట్లు తెలుస్తోంది. కానీ ప్రభుత్వం ప్రకటించిన ధర ప్రకారం ఎకరం భూమి అమ్ముకుంటే వచ్చే నష్ట పరిహారంతో చిన్న ప్లాట్ని కూడా కొనలేమని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు . కనీసం ఎకరాకు రూ. 70 లక్షల వరకు పరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ప్రాంతంలో అమెరికాకు చెందిన కంపెనీతో పాటు మరో రెండు భారీ పెట్టుబడులు పెట్టే కంపెనీలతో ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకుంది. అదే మార్గంలో మరి ఇన్ని కంపెనీలు ఉన్నట్లు సమాచారం. దీంతో ఇప్పటికే ఈ ప్రాంతంలో భూముల ధరలు ఆకాశాన్నంటాయి.
ఎకరం భూమి ధర రూ. 50 వేల నుంచి 70 లక్షల వరకు పలుకుతోంది. ఈ నేపథ్యంలో కంపెనీల ఏర్పాటుకు అవసరమైన 12 వేలకు పైగా ఎకరాల భూమిని సేకరించడం కష్ట సాధ్యమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రైతులు స్వచ్ఛందంగా కంపెనీల ఏర్పాటుకు ముందుకు వచ్చి, తమ భూములను ప్రభుత్వానికి ఇచ్చేలా సంబంధిత అధికారులు వారిలో అవగాహన కల్పించి, వారి భావి జీవితం, భవిష్యత్తుకు భరోసా ఇవ్వలేకపోతున్నారు. దీంతో భూములు పోతే తమ పరిస్థితి,
జీవనోపాధి, బతుకు తెరువు ఏమిటన్న ఆందోళన రైతులను వెంటాడుతోంది. దీంతో కంపెనీలకు భూములు ఇచ్చేందుకు విముఖత చూపుతున్నారు. భూసేకరణలో ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలతో భయభ్రాంతులకు గురై న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. 2013వ చట్టప్రకారం రావాల్సిన పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం 123 జిఓ ప్రకారం పరిహారం వద్దని కరాఖండిగా తేల్చి చెబుతున్నారు.
60 శాతానికిపైగా పంటలు పండే భూములు
వ్యవసాయానికి పనికిరాని భూములు మాత్రమే కంపెనీ ఏర్పాటుకు సేకరించాలని రైతులు పేర్కొంటున్నారు. కానీ ఈ ప్రాంతంలో 60 శాతానికి పైగా పంట పండే భూములను ఎంపిక చేశారన్నారు . ఇదిలా ఉండగా పర్యావరణ పరంగా కూడా అంతా అనుకూలమైంది కాదని పర్యావరణ వేత్తలు పేర్కొంటున్నారు. కంపెనీల ఏర్పాటుకు ప్రతిపాదించిన ఈ ప్రాంతంలో కనీసం 13 శాతం అడవులు ఉండాలి . కానీ ఒక శాతం కూడా లేవంటున్నారు.
ఇదిలా ఉండగా భూములకు సరైన ధర ప్రకటించకపోవడంతోపాటు స్థానికత ఆధారంగా కంపెనీల్లో ఉద్యోగాలపై కూడా సరైన ప్రకటన లేదు. ఈ విషయంలో అస్పష్టత కారణంగానే రైతుల భూములు ఇవ్వలేక పోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్థానికంగా రైతులతో చర్చించి, వారి సమస్యలను పూర్తిస్థాయిలో విచారించి , ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి సమస్య పరిష్కరిస్తే భూ సేకరణ కార్యక్రమం ఓ కొలిక్కి వచ్చే అవకాశాలు పలువురు అభిప్రాయపడుతున్నారు . లేనిపక్షంలో నిమ్జ్ ఏర్పాటుకు అవసరమైన భూసేకరణ కార్యక్రమమే దశాబ్దాల తరబడి సాగితే నిర్మాణాలకు మరెంత సమయం పడుతుందో చెప్పడం కష్టం.
కంపెనీలపై, పరిహారంపై, ఉపాధి ఉద్యోగాలపై, కాలుష్యంపై, భూ పరిహారంపై రైతుల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితేనే నిమ్జ్ ఏర్పాటు పనులు వేగవంతం అయ్యే అవకాశం ఉంది. ఆయా అంశాలపై రైతుల్లో అవగాహన పెంచడంతో పాటు లిఖిత పూర్వక హామీని వారు కోరుతున్నట్లు సమాచారం.
పోలీసులుతో అడ్డుకున్నారు
గత సంవత్సరం ఈ ప్రాంతంలో చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణ మొదలుకొని సీఎం పర్యటన ఇతర సందర్భాల్లో కూడా తాము రాకుండా పోలీసులతో అడ్డుకున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. దీంతో ఆయా కార్యక్రమాలకు రైతులు రాకుండా అడ్డుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా ఎలాగోలా చేరుకొని తమ అభిప్రాయాలు చెప్పాలనుకున్న రైతులకు కూడా బలవంతంగా బయటకు పంపించి వారి గొంతునొక్కారన్న ఆరోపణలున్నాయి.
ఇదిలా ఉండగా నిమ్స్ ఏర్పాటు కోసం గుర్తించిన 12,635 ఎకరాల పరిధిలోని భూమిని ఇతరులు కొనేందుకు సాహసం చేయడం లేదు. దీంతో రైతులు తమ అవసరాల నిమిత్తం ఇష్టం వచ్చిన కాడికి తెగనమ్ముకుంటున్నారు. ఒక్క ఎకరం భూమిని రూ. 14 లక్షల కాడికి అమ్ముకొని లక్షల రూపాయల నష్టాన్ని చవిచూస్తున్నారు. కావున ప్రభుత్వం నిమ్జ్ భూముల సేకరణపై సాధ్యమైనంత త్వరలో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ వినిపిస్తోంది.