- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
కారులో నలుగురు.. ఈసారి కారు డ్రైవర్ ఎవ్వరో...?

దిశ, మహేశ్వరం: సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలు ఏమిలేవని చెబుతున్నా మహేశ్వరం నియోజకవర్గంలోని టీఆర్ఎస్ పార్టీ నాయకులు ముందస్తు ఎన్నికలు జరగబోతున్నాయాన్న ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. మహేశ్వరం నియోజకవర్గంలో గత కొన్ని రోజుల నుంచి ఎన్నికల ప్రచారం లాగా భారీ ఎత్తున అధికార పార్టీ నాయకులు కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. కార్యకర్తలను పెద్ద ఎత్తున ఉండేలా చేస్తున్నారు. మహేశ్వరం నియోజకవర్గం అధికార పార్టీ కారులో నలుగురు ప్రయాణిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో కారు స్టీరింగ్ ఎవ్వరి చేతిలో ఉంటుందో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, జెడ్పీ చైర్ పర్సన్ తీగల అనితా రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు కొత్త మనోహర్ రెడ్డి.. ఈ నలుగురిలో కారు నడిపేది ఎవ్వరో అని నాయకులు గుసగుస లాడుతున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మహేశ్వరం నియోజకవర్గం నుంచి సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది. కొన్నాళ్లకే కారు పార్టీలో చేరారు. అప్పటి నుంచి కారు పార్టీలో కిరికిరులు మొదలయ్యాయి.
సబితా ఇంద్రారెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత మంత్రి పదవి రావడంతో తన అనుచరులకు, గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులకే ఎక్కువ ప్రీయార్టీ ఇస్తున్నారని, టీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన నాయకులకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని కూడా పలువురు నాయకులు మాట్లాడుకుంటున్నారు. ఇదే మహేశ్వరం మండలం నుంచి జెడ్పీటిసీగా మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కోడలు తీగల అనితా రెడ్డి గెలుపొందారు. జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా కొనసాగుతున్నారు. సబితా ఇంద్రారెడ్డి, అనితా రెడ్డి మధ్య అంతర్గతంగా గ్రూప్ రాజకీయాలు నడుస్తున్నాయని, అధికార పార్టీకి చెందిన నాయకులే గుసగుసలాడుతున్నారు. అభివృద్ధి కార్యక్రమాలకు ఇద్దరు కలిసి వచ్చినా అంతర్గతంగా పోరు నడుస్తోందాన్ని అధికార పార్టీకి చెందిన పలువురు నేతలు, కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారు. ఇటీవల కందుకూరు మండలం బేగరికంచ గ్రామంలో పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన కార్యక్రమానికి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి డీజే, బ్యాండ్ తో స్వాగతం తెలుపుతుండటంతో ఎన్నికల హడావుడి మొదలైందని నాయకులు మాట్లాడుకుంటున్నారు.
ఎవ్వరి వెంట నడవాలో నాయకులు తికమక
మంత్రి పదవిలో ఉన్న సబితా ఇంద్రారెడ్డి వెంట నడవాలా? జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పదవిలో ఉన్న అనితా రెడ్డి వెంట నడవాలా? అని పలు గ్రామాల సర్పంచ్ లు, ఎంపీటీసీలు, నాయకులు తికమకపడుతున్నారు. మరోవైపు పలు గ్రామాల సర్పంచ్ లు, ఎంపీటీసీలు తామ గ్రామాల అభివృద్ధి కోసం ఇద్దరికీ(సబితా ఇంద్రారెడ్డి, అనితారెడ్డి) సన్నిహితంగా ఉంటూ గ్రామాలకు కావాల్సిన అభివృద్ధి పనులు చేయించుకుంటున్నారు. మరికొంతమంది నాయకులు ఎవ్వరి వెంట వెళ్లాలో అర్ధం కాని పరిస్థితి ఉందని వారి సన్నిహితుల వద్ద వాపోతున్నారు.
నిరుత్సహంలో మాజీ ఎమ్మెల్యే...?
2018 ఎన్నికల్లో ఓటమి చెందిన మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి నిరుత్సాహంలో ఉన్నాడని, సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీ పదవి ఇవ్వకపోవడంతో నిరుత్సాహంతో ఉన్నాడని తన అనుచరులు మాట్లాడుకుంటున్నారు. మరోపక్క కోడలు జెడ్పీ చైర్ పర్సన్ హోదాలో ఉండటంతో తీగల కృష్ణారెడ్డి సైలెంట్ గా ఉన్నాడని టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుకుంటున్నారు.
కొత్త మనోహర్ రెడ్డి... టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు కొత్త మనోహర్ రెడ్డికి మంత్రి కేటీఆర్ 2018 ఎన్నికల సమయంలో ఎమ్మెల్సీ లేదా రాష్ట్రంలో ఏదైనా కార్పొరేషన్ పదవి ఇస్తానన్న హామీ నేటికీ నెరవేరలేదాన్ని తన సన్నిహితుల వద్ద వాపోతున్నారు. రాబోయే ఎన్నికల్లో కారు స్టీరింగ్ ఎవరి చేతిలో ఉంటుందో చూడాలి మరీ అంటూ నాయకులు మాట్లాడుకుంటున్నారు. సీనియర్లకు నామినేటెడ్ పదవులను, ప్రాధాన్యత ఇవ్వాలని, మండలానికి చెందిన ఓ నేత ఈ నెల 24న జరిగిన మహేశ్వరం నియోజకవర్గం కేంద్రంలో టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో వేదిక పైనే మాట్లాడారు.