ఫోర్డ్ తయారీ ప్లాంటును సొంత చేసుకునే ప్రయత్నంలో టాటా మోటార్స్!

by Disha Web Desk 17 |
ఫోర్డ్ తయారీ ప్లాంటును సొంత చేసుకునే ప్రయత్నంలో టాటా మోటార్స్!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ లగ్జరీ వాహన తయారీ సంస్థ ఫోర్డ్ ఇండియా గతేడాది సెప్టెంబర్‌లో భారత వాహన మార్కెట్ నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫోర్డ్ ఇండియాకు చెందిన వాహన తయారీ ప్లాంట్‌ను దేశీయ అతిపెద్ద వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ స్వాధీనం చేసుకునేందుకు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఫోర్డ్ కంపెనీకి దేశీయంగా రెండు తయారీ ఫ్యాక్టరీలు ఉన్నాయి. వీటిలో ఒకదాన్ని సొంతం చేసుకోవాలని టాటా మోటార్స్ భావిస్తోంది. ఇదే ప్లాంట్ కోసం ఎంజీ మోటార్, ఓలా కంపెనీలు సైతం ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే, టాటా మోటార్స్, ఫోర్డ్ ఇండియా సంయుక్తంగా గుజరాత్‌లోని సనంద్ ప్లాంటుకు సంబంధించి స్థానిక కార్యాలయాన్ని సంప్రదించినట్టు సమాచారం. దీంతో ఈ ప్లాంటు టాటా మోటార్స్‌కు దక్కనుందని స్పష్టమైంది.

ప్రస్తుతం టాటా మోటార్స్ సంస్థ దేశంలోని తన సొంత ప్లాంట్లలో 85 శాతం సామర్థ్యంతో పనిచేస్తోంది. ఈ క్రమంలో వచ్చే ఏడాది నాటికి తన ఉత్పత్తి సామర్థ్యాన్ని 5 లక్షల నుంచి 6 లక్షలకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రణాళికలో భాగంగానే ఫోర్డ్‌కు చెందిన ప్లాంటును కొనుగోలు చేయడానికి సిద్ధమవుతోందని, ఇది అందుబాటులోకి వస్తే ఉత్పత్తిని మరింత ఎక్కువ సంఖ్యలో నిర్వహించవచ్చని కంపెనీ భావిస్తోంది. టాటా మోటార్స్ సంస్థ ఇప్పటికే అమ్మకాల పరంగా మూడో స్థానంలో ఉంది. రెండో స్థానంలో ఉన్న హ్యూండాయ్ మోటార్ ఇండియాకు గట్టి పోటీనిస్తోంది. ఫోర్డ్ ఇండియా ప్లాంట్ దక్కితే ఉత్పత్తితో పాటు విక్రయాల పరంగా వినియోగదారులకు తక్కువ సమయంలో డెలివరీలను అందజేయాలని టాటా మోటార్స్ లక్ష్యంగా పెట్టుకుంది.


Next Story

Most Viewed