- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ముష్టి గింజల గోల్ మాల్ వెనక మిగతా పాత్రధారులు ఎవరు..?

దిశ, భద్రాచలం: గిరిజన కార్పొరేషన్ సొసైటీ భద్రాచలం డివిజన్ పరిధిలో భారీ కుంభకోణం చోటు చేసుకుంది. జీసీసీ సొసైటీలు సేకరించిన ముష్టి గింజలు మాయమయ్యాయి. వీటి విలువ రూ.72 లక్షల పైగానే ఉంటుందని జీసీసీ అధికారులు అంటున్నారు. ముష్టి గింజలు మాయమైన ఘటనలో... జీసీసీ ఉద్యోగిపై ఇప్పటికే వేటు పడగా, పోలీస్ కేసు కూడా నమోదైంది. సదరు వ్యక్తి పరారీలో ఉన్నట్లు సమాచారం. అయితే ఈ భారీ కుంభకోణంలో ఉద్యోగి ఒక్కరే ఉన్నారా..? మరి ఎవరైనా పాత్రధారులు ఉన్నారా..? అన్నది తేలాల్సి ఉంది. నిష్పక్షపాతంగా సమగ్ర విచారణ జరిపితే ఈ విషయం తేటతెల్లం అవుతోందని తెలుస్తోంది.
గోడౌన్ లో ముష్టి గింజలు మాయం..
గిరిజన సహకార సంస్థ లిమిటెడ్ భద్రాచలం డివిజన్ పరిధిలో పాల్వంచ జీసీసీ గోడౌన్ లో 220 క్వింటాళ్లు, అశ్వారావుపేట మండలం వినాయకపురం జీసీసీ గోడౌన్ లో 890 క్వింటాళ్ల ముష్టి గింజలు మాయమయ్యాయి. వీటి విలువ రూ.72 లక్షలకు పైగానే ఉంటుందని భద్రాచలం జీసీసీ డీఎం కె.వాణి 'దిశ' కు తెలిపారు. 2020 -21 సంవత్సరానికి గాను ఇల్లెందు, మణుగూరు, దమ్మపేట, పాల్వంచ, భద్రాచలం సొసైటీల ద్వారా ముష్టి గింజలను కొనుగోలు చేశారు. వీటిని జిల్లాలోని పలు గోడౌన్ లో భద్రపరచగా...పాల్వంచ, వినాయకపురం గోడౌన్ లో దాచిపెట్టిన ముష్టి గింజలు మాయమవడం గమనార్హం. ఈ ముష్టి గింజలను కొనుగోలు చేసిన తునికికి చెందిన టెండర్ దారుడికి వీటిని అప్పగించే సందర్భంలో రికార్డు పరంగా తేడా కనిపించడంతో ఈ విషయం వెలుగు చూసింది. గోడౌన్ క్లర్క్ కృష్ణయ్యను ఇందుకు బాధ్యులుగా చేస్తూ.. ఇప్పటికే సస్పెండ్ చేయడం జరిగింది. పోలీస్ స్టేషన్ లో ఇందుకు సంబంధించి కేసు కూడా నమోదు కాగా... శాఖాపరమైన విచారణ సాగుతోంది. అయితే సంబంధిత జీసీసీ ఉద్యోగి గత నెల రోజులుగా కానరాకుండా పోయినట్లు తెలిసింది.
మిగతా పాత్రధారులు ఎవరు..?
గిరిజన సహకార సంస్థ లిమిటెడ్ భద్రాచలం డివిజన్ ద్వారా కొనుగోలు చేసిన ముష్టి గింజల వ్యవహారంలో భారీ కుంభకోణం జరగటం తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ వ్యవహారంలో ఓ ఉద్యోగినిని సస్పెండ్ చేసినప్పటికీ.. రూ.72 లక్షల విలువచేసే ముష్టి గింజల గోల్ మాల్ కథ వెనుక మరెవరి పాత్ర ఉందన్నది మిస్టరీగా మారింది. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా వెయ్యి క్వింటాళ్లకు పైగానే ముష్టి గింజలు పక్కదారి పట్టిన ఘటనపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ఇందులో ఎవరెవరి హస్తం ఉందన్నది తేలాల్సి ఉంది. సమగ్ర విచారణ జరిపితేశఈ విషయం తేలటం ఖాయమని తెలుస్తోంది.