ప్రతీ మహిళను గౌరవించటం మన సంస్కృతి : కొణిదెల నాగబాబు

by Dishanational1 |
ప్రతీ మహిళను గౌరవించటం మన సంస్కృతి : కొణిదెల నాగబాబు
X

దిశ, ఏపీ బ్యూరో : చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరిగినప్పుడే మహిళా సాధికారత సాధ్యం అవుతుందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు కొణిదెల నాగబాబు వ్యాఖ్యానించారు. మహిళలకు రాజకీయ వ్యవహారాల్లో అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నదే తమ పార్టీ అభిమతమని చెప్పుకొచ్చారు. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో శనివారం జనసేన క్రియాశీలక వీరమహిళల రాజకీయ అవగాహన , పునశ్చరణ తరగతులు కార్యక్రమాన్ని నాగబాబు ప్రారంభించారు. వీర మహిళలతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. తొలి విడతగా కృష్ణా , గుంటూరు జిల్లాలో 5 నియోజక వర్గాలు, విజయవాడ నగర పరిధిలోని మహిళ క్రియాశీలక సభ్యులు ఈ శిక్షణ తరగతుల్లో పాల్గొంటారు.

శిక్షణా తరగతుల ప్రారంభోత్సవం అనంతరం నాగబాబు మీడియాతో మాట్లాడారు. మహిళలకు రాజకీయ వ్యవహారాల్లో గౌరవప్రదమైన స్థానం అందించాలని ఆకాంక్షించే జనసేన అధినేత పవన్ కల్యాణ్.. మహిళల కోసం ప్రత్యేకంగా వీర మహిళ విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పుకొచ్చారు. వీర మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని నాగబాబు సూచించారు. ఇటీవల కాలంలో అన్ని రాజకీయ పార్టీలు మహిళా సాధికారత గురించి గొప్పలుగా చెప్తున్నాయని కానీ దానిని ఆచరణలో చేసి చూపే దాఖలాలు ఉండవన్నారు. సంప్రదాయ రాజకీయ పార్టీల్లో మహిళలను ప్రచారాల కోసం ఉపయోగించుకునే వారు ఎక్కువైపోయారే తప్ప వారికి సముచిత స్థానం కల్పింద్దామనే యోచన ప్రస్తుత రాజకీయాల్లో లేకపోవడడం దురదృష్టకరమని నాగబాబు అన్నారు.

మహిళలకు గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిదీ

'జనసేన పార్టీలో ప్రతీ మహిళను వీరమహిళ అనే పేరుతో గౌరవించుకునే సంస్కృతి ఉంది. మనకు ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు ఉన్నా అమ్మ మొహం చూడగానే అన్నీ మరచిపోతాం. మనకు తోబుట్టువులు లాంటి మహిళలు ఓదార్పునిస్తారు. అమరావతి ఉద్యమంలో కీలక భూమిక పోషించిన గౌరవం మహిళలకు దక్కుతుంది. మహిళల వస్త్రధారణ మీద కామెంట్ చేయడం చాలా మందికి ఫ్యాషన్ అయింది . చూసే కళ్ళను బట్టి ఆలోచన ఉంటుంది. మహిళలకు గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరికీ ఉంది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాజకీయ కార్యదర్శి పి.హరిప్రసాద్, పార్టీ కోశాధికారి ఏవీ రత్నం, పార్టీ అధికార ప్రతినిధి శ్రీ త్రినాద్ , తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేశ్ , సీనియర్ జర్నలిస్ట్ శ్యాం సుందర్ , విజయవాడ నగర అధ్యక్షుడు పోతిన వెంకట మహేష్ , పార్టీ లీగల్ సెల్ చైర్మన్ ఇవన సాంబశివ ప్రతాప్ , పార్టీ అధికార ప్రతినిధి కోటంరాజు శరత్ కుమార్ వివిధ అంశాలపై వీర మహిళలకు అవగాహన కల్పించారు.


Next Story