ప్రణయ్ హత్యకేసు నిందితుడికి గుండెపోటు.. గోప్యంగా ఉంచిన అధికారులు..

by Disha Web Desk 12 |
ప్రణయ్ హత్యకేసు నిందితుడికి గుండెపోటు.. గోప్యంగా ఉంచిన అధికారులు..
X

దిశ, నల్లగొండ : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులోని ఓ నిందితుడు అబ్దుల్ బారీకి గుండెపోటు రావడంతో జైలు అధికారులు హుటాహుటిన హైదరాబాద్ తరలించారు. 15 రోజుల ముందే ఈ ఘటన చోటుచేసుకున్నా.. సోషల్ మీడియా ద్వారా ఆలస్యంగా శనివారం ఉదయం వెలుగులోకి వచ్చింది. నిమ్న కులానికి చెందిన యువకుడు ప్రణయ్, అగ్రవర్ణ యువతి అమృత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. దీంతో అమృత తండ్రి మారుతీరావు సుఫారీ గ్యాంగ్ ద్వారా ప్రణయ్ ని ఎలాగైనా అంతమొందించాలని కక్ష పెంచుకున్నాడు. అప్పటికే అమృత గర్భవతి కావడంతో 2018 సెప్టెంబర్‌లో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లి వస్తున్నారు. ఇదే అదునుగా భావించిన మారుతీరావు ఏర్పరిచిన సుఫారీ గ్యాంగ్ ఒక్కసారిగా ప్రణయ్ పై కత్తులతో దాడి చేసి విచక్షణా రహితంగా నరికి చంపారు.

ఈ కేసులోని ఓ నిందితుడు అబ్దుల్ బారీ నల్లగొండ జిల్లా జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. కాగా, అంతకుముందే బారీ గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ వస్తున్నాడు. కొన్ని దఫాలుగా జైలు అధికారులు అతడిని నల్లగొండ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించినట్లు తెలుస్తోంది. 2020 మార్చిలో హైదరాబాద్‌లోని ఓ లాడ్జిలో అమృత తండ్రి మారుతీరావు ఆత్మహత్య చేసుకోవడంతో క్రైమ్ స్టోరీస్ తలపించిన ప్రణయ్ హత్య కేసు చర్చ కొంతమేర సద్దుమనిగింది. అబ్దుల్ బారీ గుండెపోటుతో మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా చర్చ మొదలైంది.

నిమ్స్‌లో అధికారుల గోప్యంగా చికిత్స

15 రోజుల క్రితమే అబ్దుల్ బారీ కి గుండెపోటు రావడంతో హైదరాబాద్ కు తరలించారు. ముందుగా బారీని ఉస్మానియా ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడి వైద్యులు గాంధీ కి రెఫర్ చేయగా, అటునుంచి నిమ్స్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అబ్దుల్ బారీ ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు సమాచారం. ఈ విషయాన్ని జిల్లా జైలు అధికారులు గోప్యంగా ఉంచారు. ఇప్పటి వరకూ ఈ విషయం మీడియాకు తెలియదు. శనివారం తెల్లవారు జామునే బారీ కి గుండెపోటు వచ్చిందంటూ వాట్సాప్ లో ఓ మెసేజ్ షికార్లు కొట్టింది. దీంతో ఈ విషయం మరోసారి చర్చనీయాంశమైంది.


Next Story

Most Viewed