- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
పార్టిషన్ రిజిస్ట్రేషన్లకు పాట్లు...! తలెత్తుతున్న గొడవలు

దిశ, లక్షెట్టిపేట: పార్టిషన్ భూములకు రిజిస్ట్రేషన్ లపై ప్రభుత్వం నిషేధం విధించడంతో సామాన్య, మధ్యతరగతివారు నష్టపోతున్నారు. ఉన్న భూముల్లో కొద్దిపాటి ఇంటి స్థలాలకు అమ్మితే రిజిస్ట్రేషన్లు కాకపోవడంతో భూ యజమానులు ఇబ్బందులు పడుతున్నారు. పార్టిషన్ స్థలాలకు హైకోర్టును ఆశ్రయించి ఆర్డర్ తెచ్చుకున్న వారికి మాత్రమే రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి. కోర్టును ఆశ్రయించి ఆర్డర్ కోసం ఆర్థిక స్థామత లేక వెళ్లలేని సామాన్య, మధ్యతరగతి ప్రజలు పార్టిషన్ భూములపై రిజిస్ట్రేషన్ అయ్యేందుకు ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వకపోతే ఉందా అని ఎదురుచూస్తున్నారు.
తలెత్తుతున్న తగాదాలు...
పార్టిషన్ భూములు, స్థలాలకు రిజిస్ట్రేషన్లు కాకపోవడంతో కొనుగోలుదారులు, అమ్మకందారులకు మధ్య తగాదాలు తలెత్తుతున్నాయి. గతంలో అన్ని రకాల భూములు, ఇంటి స్థలాల అమ్మకాలు, కొనుగోళ్లపై రిజిస్ట్రేషన్లు చేసేవారు. వ్యవసాయ భూమిలో కొంత భాగం ఫ్లాట్లుగా చేసి అమ్మదలిస్తే నాలా కన్వర్షన్ చేస్తే సరిపోయేది. నాల కన్వర్షన్ ఉన్నా రిజిస్ట్రేషన్లు చేయడం లేదు. వాటికి లింకు డాక్యుమెంట్లు లేవని, ఎల్. ఆర్. ఎస్ చెల్లించి తీసుకు రావాలని రిజిస్టర్ అధికారులు తేల్చి చెబుతుండడంతో అయోమయానికి గురవుతున్నారు. ఇంతకుముందు ఉన్న చాలా వ్యవసాయ భూములోని సర్వే నెంబర్లకు పాస్ బుక్కులు రాలేదు. ఇలాంటి భూ యజమానులకు నాలా కన్వర్షన్ చేసుకునేందుకు వీలు లేకుండా ఉంది. ఇప్పుడు డాక్యుమెంట్ టూ డాక్యుమెంట్ దస్తావేజులు ఉన్నవాటికి మాత్రమే రిజిస్ట్రేషన్ అవుతున్నాయి. యేడాదిన్నర కాలంగా పార్టిషన్ చేసి తమ స్థలాల్లోని కొంత భాగాన్ని విడగొట్టి తమ అవసరాలకు అమ్ముకునేందుకు స్థల యజమానులకు అవకాశం లేకుండా పోయింది. ఎల్.ఆర్.ఎస్ విధానం రాకముందే చాలామంది భూ యజమానులు తమ భూముల్లో కొంత భాగాన్ని విడగొట్టి అమ్ముకున్నారు. వాటికి రిజిస్ట్రేషన్లు చేసే సమయంలో ప్రభుత్వం పార్టిషన్ భూములకు నిషేధం విధించడంతో ఆందోళనలో పడ్డారు. కూతురు పెళ్లికనో, కొడుకు చదువు కోసమనో తమ స్థలాల్లో కొంత విడగొట్టి స్థలాన్ని అమ్మినవారి పరిస్థితి దారుణంగా ఉంది. రిజిస్ట్రేషన్ లు ఆగిపోవడంతో తాము అమ్ముకున్న స్థలాలకు కొనుగోలుదారులు పూర్తిగా డబ్బులు చెల్లించడం లేదు. అవసరానికి అమ్ముకుంటే కొనుగోలుదారుల నుంచి పూర్తిస్థాయిలో డబ్బులు అందక ఇతరుల వద్ద అప్పులు చేయాల్సి వస్తోందని వాపోతున్నారు. అప్పులకు వడ్డీలు కడుతూ ఇంకా నష్టపోవాల్సి వస్తుందంటున్నారు.
వీరి పరిస్థితి ఇలా ఉంటే కొనుగోలు చేసినవారు అక్కడక్కడ అమ్మినవారి నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం భూముల ధరలకు రెక్కలు రావడంతో కొందరు స్థల యజమానులు కొన్నవారికి మొండిచేయి చూపిస్తున్నారు. అక్కడక్కడ కొన్నవారికి, అమ్మినవారికి మధ్య గొడవలు తలెత్తి పంచాయతీ పోలీస్ స్టేషన్ ల వరకు వెళుతున్నాయి. ఇప్పుడు ఇళ్ల స్థలాలకు పెరిగిన ధర ప్రకారం డబ్బు చెల్లిస్తేనే రిజిస్ట్రేషన్ చేస్తామని కొనుగోలుదారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. పార్టిషన్ స్థలాలకు రిజిస్ట్రేషన్లు అయ్యేందుకు ఆదేశాలు వస్తే గానీ ఇలాంటి గొడవలు సద్దుమణిగేలా లేవు.
పాత నివాసగృహాలదీ అదే పరిస్థితి...
గ్రామ, పట్టణాల్లో గతంలో స్థానిక అధికారులు జారీ చేసిన ప్రొసిడింగ్, ఇంటి పన్ను రశీదు, యాజమాన్య ధ్రువీకరణ పత్రం ఇస్తే రిజిస్ట్రేషన్ చేసేందుకు వీలు ఉండేది. ఇప్పుడు కొత్తగా వచ్చిన సర్క్యులర్ ప్రకారం ఆ విధంగా చేయడం సాధ్యం కాదని రిజిస్టర్లు తిరస్కరిస్తున్నారు. ఇప్పుడు పాత నివాస గృహాలకు లింకు డాక్యుమెంట్లు, అప్రూవ్డ్ ప్లాన్, పర్మిషన్ కావాలని అడుగుతున్నారు. వారసత్వంగా వచ్చిన నివాస గృహాలకు లింక్ డాక్యుమెంట్లు ఎలా ఉంటాయని ఆ గ్రహాల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ అవసరాలకు అమ్ముకోలేక, కొన్నవారు రిజిస్ట్రేషన్ చేసుకోలేక ఇబ్బంది పడుతున్నారు
తగ్గిన ఆదాయం...
లక్షెట్టిపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో గతంలో ప్రతిరోజు 15 నుంచి 25 వరకు ఇంటి స్థలాలకు రిజిస్ట్రేషన్ లు జరుగుతుండేవి. గతంలో ఈసబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో యేడాదికి సుమారు రూ. 2 కోట్ల వరకు రిజిస్ట్రేషన్ ద్వారా ఆదాయం వచ్చేది. యేడాదిన్నర కాలంగా ప్రతిరోజూ ఇక్కడ రెండు నుంచి మూడుకు మించి రిజిస్ట్రేషన్ లు కావడం లేదు. దీంతో ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ లతో వచ్చే భారీ ఆదాయానికి గండి పడింది. దీనికితోడు రిజిస్ట్రేషన్లపై పరోక్షంగా ఆధారపడి ఉన్న డాక్యుమెంట్ రైటర్లు, భూమి కొలతల సర్వేయర్లు, జిరాక్స్ సెంటర్ ల నిర్వాహకులు ఆదాయం లేక ఇక్కట్లు పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం సామాన్య, మధ్యతరగతి ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని పార్ట్ రిజిస్ట్రేషన్లు అయ్యేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతున్నారు.
నిబంధనల మేరకు చేస్తున్నాం: అనిల్, ఇన్ చార్జి సబ్ రిజిస్ట్రార్, లక్షెట్టిపేట
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నిబంధనల ప్రకారమే పార్టిషన్ భూములకు రిజిస్ట్రేషన్ చేయడం లేదు. పాత దస్తావేజుల్లో ఎంత ఉన్నా, అంత మేరకు స్థలాలు, భూములకు మాత్రమే రిజిస్ట్రేషన్లు చేస్తున్నాం. పార్టిషన్ స్థలాలు, పాత నివాస గృహాల రిజిస్ట్రేషన్ లపై మా అధికారుల పాత్ర ఏమీ లేదు.