- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
జీఎస్టీ పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోండి.. కేంద్రమంత్రికి నారా లోకేష్ లేఖ

దిశ, ఏపీ బ్యూరో : చేనేత రంగానికి జీఎస్టీ పెంపు పెనుభారంగా మారిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. ఇప్పటికే చేనేత రంగం కుదేలవుతుందని ఇలాంటి తరుణంలో జీఎస్టీ పెంపు వారి జీవితాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందన్నారు. ఈ నేపథ్యంలో జీఎస్టీ పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని నారా లోకేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్రఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు శనివారం లోకేష్ లేఖ రాశారు. చేనేత ఉత్పత్తులపై 5 శాతం జీఎస్టీ విధించడమే తీవ్ర భారమైతే దాన్ని ఇప్పుడు ఏకంగా 12 శాతానికి పెంచాలనుకోవడం చేనేత రంగానికి మరణశాసనం అవుతుందని వ్యాఖ్యానించారు. జీఎస్టీ పెంపు నిర్ణయం వల్ల చేనేత రంగం నష్టపోవడంతో పాటు కార్మికులు రోడ్డున పడే ప్రమాదం ఉంటుందని నారా లోకేష్ ఆందోళన వ్యక్తం చేశారు.
జీఎస్టీ పెంపు నిర్ణయాన్ని వచ్చే జీఎస్టీ మండలి భేటీలో వెనక్కి తీసుకోవాలని లేఖలో కోరారు. కరోనా దెబ్బతో పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయిన చేనేత పరిశ్రమను తిరిగి గాడిన పెట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉదారంగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. చేనేత రంగానికి అండగా నిలబడాల్సిన అవసరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని చెప్పుకొచ్చారు. ఈ మేరకు సంక్షేమ కార్యక్రమాలు, సబ్సీడీలు, తక్కువ వడ్డీకే రుణాలు, ఆప్కో ద్వారా కొనుగోళ్లు, నేతన్నలకు ప్రోత్సాహకాలు లాంటి కార్యక్రమాలు చేపట్టాలని లేఖలో కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపైనా తీవ్ర విమర్శలు చేశారు. గత ప్రభుత్వాలు చేనేత కార్మికుల సంక్షేమానికి ఎన్నో పథకాలు ప్రవేశపెడితే వైసీపీ ప్రభుత్వం వాటన్నింటిని గాలికొదిలేసిందని ధ్వజమెత్తారు.
వైసీపీ ప్రభుత్వం అమలు చెయ్యకపోవడమే చేనేత రంగం గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోందని లోకేష్ ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వ చిన్నచూపు, కరోనా కారణంగా చేనేత రంగం పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయిందని విమర్శించారు. అసలే ఇబ్బందుల్లో ఉన్న నేతన్నలకు జీఎస్టీ పెంపు శరాఘాతంగా మారిందన్నారు. తమిళనాడు, తెలంగాణతో పాటు అనేక రాష్ట్రాలు చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ పెంపుని తీవ్రంగా వ్యతిరేకిస్తూ నిర్ణయాన్ని ఈ విషయంపై కేంద్రం పునరాలోచన చేయాలని లోకేష్ లేఖలో రిక్వెస్ట్ చేశారు.