మునుగోడు ఎమ్మెల్యేగా బరిలోకి దిగుతా .. పున్నా కైలాష్ నేత సంచలన ప్రకటన

by Dishafeatures2 |
మునుగోడు ఎమ్మెల్యేగా బరిలోకి దిగుతా .. పున్నా కైలాష్ నేత సంచలన ప్రకటన
X

దిశ, చౌటుప్పల్ : పార్టీ అధిష్టానం ఆదేశిస్తే మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా బరిలోకి దిగుతానని టీపీసీసీ అధికార ప్రతినిధి పున్న కైలాష్ నేత ప్రకటించారు. తనకు ఎమ్మెల్యేగా అవకాశం కల్పిస్తే మునుగోడులో కాంగ్రెస్ జెండా ఎగరవేసి తీరుతానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చీరిక అంజిరెడ్డి ఇటీవల కాలుకు శస్త్ర చికిత్స చేయించుకోవడంతో ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. అదేవిధంగా ఇటీవల టీఆర్​ఎస్​ కౌన్సిలర్ బంధువు దాడిలో గాయపడ్డ 99 టీవీ రిపోర్టర్ రఫీని పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడానికి కృషి చేస్తానని తెలిపారు. అంతేకాకుండా రాహుల్ గాంధీని దేశ ప్రధానిగా చేసేందుకు కాంగ్రెస్ కార్యకర్తలంతా కంకణబద్ధులై ఉన్నామన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకు టికెట్ కేటాయిస్తే గెలిచి వస్తానని, లేదంటే కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం తాను కృషి చేస్తానని అన్నారు.

ఎమ్మార్పీఎస్ నాయకులపై బీజేపీ కార్యకర్తల దాడి హేయమైన చర్య అని పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చి మోసం చేసిందని విమర్శించారు. ఇటీవల హైదరాబాదులో జరిగిన విజయ సంకల్ప సభలో ప్రధాని మోడీ హాజరు కావడంతో ఎస్సీ వర్గీకరణపై స్పష్టమైన విధానాన్ని తెలపాలని పలువురు ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు నిరసన తెలిపే ప్రయత్నం చేస్తే, దీన్ని జీర్ణించుకోలేని పలువురు బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు వారిపై విచక్షణారహితంగా దాడి చేశారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో ఐఎన్టియూసీ జిల్లా అధ్యక్షుడు బోయ రాంచందర్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బోయ వెంకట్, యూత్ కాంగ్రెస్ నాయకులు ఎర్రోజు సాయి, బోయ రాజు, బోయ శేఖర్, రొడ్డ గణేష్, బోయ ఆకాష్, బర్రె సైదులు, పృథ్వీ, భరత్ తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed