మొన్న వాళ్లు మమ్మల్ని దారుణంగా అవమానించారు: హరీష్‌రావు

by S Gopi |   ( Updated:2022-03-27 09:04:24.0  )
మొన్న వాళ్లు మమ్మల్ని దారుణంగా అవమానించారు: హరీష్‌రావు
X

దిశ ప్రతినిధి, సంగారెడ్డి/ప్రజ్ఞాపూర్: వడ్లు కొనమని అడిగితే నూకలు తినమని తెలంగాణ ప్రజలను అవమానపరచిన కేంద్ర ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో నూకలు చెల్లెలా తీర్పు ఇవ్వాలని ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం శ్రీగిరిపల్లి, గజ్వెల్ మున్సిపాలిటీ, రంగంపేట గ్రామాల్లో మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన కేంద్ర సర్కారు తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వడ్లు కొనమంటే నూకలు తినమని కేంద్రంలోని బీజేపీ నేతలు తెలంగాణ ప్రజలను ఎద్దేవా చేస్తున్నారన్నారు. నూకలు తినమనడం యావత్తు తెలంగాణ ప్రజలను అవమాన పరచడమేనని మండి పడ్డారు. ఢిల్లీ ప్రభుత్వాన్ని గద్దె దించింతేనె పెరిగిన ధరలు తగ్గుతాయని, నూకలు తినమని అవమాన పరిచిన ఢిల్లీ ప్రభుత్వానికి నూకలు చెల్లెలా తీర్పు ఇవ్వాలని హరీష్ రావు పిలుపునిచ్చారు.

పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ పై పెంచిన ధరలను చేతనైతే తగ్గించి బీజీపీ మాట్లాడాలని, తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే లక్షా 30 వేల పోస్టులను భర్తీ చేసిందని పునరుద్ఘాటించారు. ప్రభుత్వం మళ్ళీ 90 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వనుందని, రక్షణ శాఖతో సహా దేశంలోని కేంద్ర ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న 15 లక్షల ఉద్యోగాలను ఎందుకు భర్తీ చేయడం లేదని ప్రశ్నించారు. దమ్ముంటే వెంటనే 15 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని హరీష్ రావు సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ రోజా శర్మ, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, లైబ్రరీ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు అన్నపూర్ణ శ్రీనివాస్, ఆర్పీఎస్ స్టేట్ సభ్యులు దేవి రవీందర్, ఎంపీపీ అమరావతి, మండల పార్టీ అధ్యక్షుడు బెండే మధు, ప్యాక్స్ చైర్మన్ జె. వెంకటేష్ గౌడ్, వైస్ ఎంపీపీ కృష్ణ గౌడ్, ఆత్మ కమిటీ చైర్మన్లు చిన్న మల్లయ్య, గుండా రంగారెడ్డి, ఆర్బీఎస్ మండల ప్రెసిడెంట్ మద్ది రాజిరెడ్డి, టీఆర్ఎస్ నేతలు తదితరులు పాల్గొన్నారు.



Next Story