గృహా రుణాల్లో భారీ స్కాం.. ఎస్‌బిఐలో నకిలీ పత్రాలతో టోకరా..

by Vinod kumar |
గృహా రుణాల్లో భారీ స్కాం.. ఎస్‌బిఐలో నకిలీ పత్రాలతో టోకరా..
X

దిశ, అమీన్ పూర్: నకిలీ పత్రాలతో గృహ రుణాలు తీసుకుని ఎస్‌బిఐ బ్యాంక్ కి కోట్ల రూపాయల టోకరా పెట్టిన ఘటన సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో వెలుగు చూసింది. బీహెచ్ఈఎల్ టౌన్ షిప్ ఎస్‌బిఐ బ్యాంక్ లో గృహా రుణాల మంజూరులో అవకతవకలకు పాల్పడిన భారీ స్కాం బయటపడింది. రామచంద్రపురం సీఐ సంజయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. నిజాంపేట్ కు చెందిన వెంకటేశ్వరరావు బీహెచ్ఈఎల్ లో హౌసింగ్ లోన్ ఏజెన్సీ నడుపుతున్నారు.

ఇటీవల కొంతకాలంగా పని ఒత్తిడి వల్ల తన మేనల్లుడు వంశీకృష్ణకు సదరు లోన్ ఏజెన్సీ బాధ్యతలు అప్పగించాడు. ఈ క్రమంలోనే వంశీకృష్ణ భారీ కుంభకోణానికి తెర తీశాడు. సుమారు 22 మంది ఖాతాదారులకు ఆ ఏజెన్సీ ద్వారా రుణాలు మంజూరు కాగా, వారి అకౌంట్ లో నుండి నిందితులు వేరే అకౌంట్లోకి నిధులను మళ్లించారు. మాయ మాటలు చెప్పి బ్యాంక్ సిబ్బందికి దగ్గరైన వంశీకృష్ణ కొందరు బ్యాంక్ అధికారుల సహకారంతో మరో ముగ్గురి పేర్ల మీద ఫేక్ ఐడీ కార్డులు సృష్టించి దాదాపు రూ.2.25 కోట్ల రూపాయల రుణం మంజూరు చేయించాడు.

స్నేహితులు తమ ఏజెన్సీ ద్వారా సుమారు రూ.4.21 కోట్ల రుణాలలో అవకతవకలు జరిగినట్లు తమ దృష్టికి వచ్చిందని ఆయన వెల్లడించారు. ఈ నెల 4వ తేదీన బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ఆర్సీ పురం పోలీసులు విచారణ చేపట్టగా వీరు చేసిన పూర్తి కుంభకోణం వెలుగులోకి వచ్చిందన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వంశీకృష్ణ, కాశి రెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి, ఎస్‌బిఐ డిప్యూటీ మేనేజర్ వినీల్ రోహిత్, క్లర్క్ సుష్మా, ఎస్‌బిఐ అసిస్టెంట్ మేనేజర్ శిరీష ని అరెస్ట్ చేశామని, మరో ఇద్దరు నిందితులు భాగ్యలక్ష్మి, వెంకటేశ్వర్లను త్వరలోనే పట్టుకుంటామని ఆయన తెలిపారు.



Next Story

Most Viewed