- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
మన్యంలో మాయగాడు..! రాజులు రాసిచ్చారంటూ కలరింగ్

దిశ ప్రతినిధి, ఖమ్మం: మన్యంలో మాయగాళ్లు రెచ్చిపోతున్నారు. అవినీతి, అక్రమాలకు పాల్పడుతూ రూ. కోట్లకు పడగలెత్తుతున్నారు. ఏజెన్నీ చట్టాలను తుంగలో తొక్కడమే కాకుండా.. ప్రభుత్వ భూములను యథేచ్ఛగా కబ్జా చేస్తూ గిరిజనులకే అమ్మేస్తున్నారు. రెవెన్యూ అధికారులను అడ్డు పెట్టుకుని ఎకరాలకు ఎకరాల సర్కార్ స్థలాలను అమాయకులు అంటగట్టి రూ. లక్షలు పోగేసుకుంటున్నారు. మణుగూరులో ఓ మాయగాడు రెండున్నర ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి రెవెన్యూ ఉద్యోగుల ప్రోద్బలంతో అమాయకులకు అంటగట్టాడు. ఏజెన్సీ ఏరియాలో ఈ గిరిజనేతలరుడి హవా అంతా ఇంతా కాదండోయ్.. ఈయన చేసే భూదందాల్లో గిరిజనులనే ముందుంచి అంతా నడిపించడం గమనార్హం. అయితే తాను అమ్మిన భూమి అసైన్డ్ ల్యాండని, అది తనకు స్వయంగా అప్పటి రాజులు రాసిచ్చారంటూ చెప్పుకోవడం విశేషం. ఏజెన్సీలో గిరిజనేతరుడికి రెండున్నర ఎకరాల భూమిని ఏ రాజులు రాసిచ్చారో..? ఏ ప్రభుత్వాలు ఇచ్చాయో ఉన్నతాధికారులు దృష్టి పెడితేకాని బయటపడేట్లు లేదు.
కబ్జా చేసి.. 38 మందికి అమ్మి..!
మణుగూరు నియోజకవర్గం పూర్తిగా ఏజెన్సీ ఏరియా. అయినా అక్కడ కొందరు గిరిజనేతరులు ఆడిందే ఆట పాడిందేపాటగా నడుస్తోంది. అక్కడి గిరిజనుల అమాయకత్వమే కొందరికి రూ. కోట్లు కురిపిస్తోంది. శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థల అధినేత నూకారపు రమేష్ గిరిజనేతరుడైనా మణుగూరులో ఆయన హవా నడుస్తోంది. స్థానిక మణికంఠ నగర్ లో ఏకంగా రెండున్నర ఎకరాల ప్రభుత్వ స్థలాన్నే కబ్జా చేసి సుమారు 38 మంది అమాయకులకు రెండుమూడేళ్ల క్రితం అంటగట్టడం గమనార్హం. ఇలా ప్రభుత్వ కబ్జా చేసి అమ్మడం ద్వారా లక్షలు సంపాదించారు.
ఓ వీఆర్వో హస్తం..
రెండున్నర ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాలో రిటైర్డ్ వీఆర్వో సత్యనారాయణ హస్తం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు.. కొంతమంది రెవెన్యూ అధికారులు కూడా సహకరించినట్లు సమాచారం. అసైన్డ్ ల్యాండ్ గా చెప్పబడుతున్న ఆ భూమిని కొన్నేళ్లుగా నూకారపు రమేష్ తన అధినంలో ఉంచుకోవడమే కాకుండా.. దానిని కొన్ని సంవత్సరాలు గిరిజనులకు కౌలుకి ఇచ్చి డబ్బు పోగుచేసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. గిరిజన ప్రాంతంలో ప్రభుత్వ భూమిని కబ్జా చేయడమే కాకుండా, దానిని కౌలుకు ఇవ్వడం చట్టరీత్యా నేరమైనా అధికారులు ఎవరూ పట్టించుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. రమేష్ రెవెన్యూ అధికారులను సైతం తన పలుకుబడితో మేనేజ్ చేసినట్లుగా కూడా తెలుస్తోంది.
రాజులు రాసిచ్చారట..!!
గిరిజన ప్రాంతాల్లో చట్టాలు చాలా పకడ్బందీగా అమలవుతాయి.. అయినా నూకారపు రమేష్ ఏజెన్సీ ఏరియాలోని రెండున్నర ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేయడం మామూలు విషయం కాదంటున్నారు స్థానికులు. అంతేకాదు.. ఆ భూమిని రాజులే తనకు స్వయంగా రాసిచ్చారని, ఆ రాజు పేరు కూడా చెప్పుకోవడం గమనార్హం. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే..? ఏజెన్సీ ఏరియా కాబట్టి.. రాజు రాసిచ్చిన స్థలాన్ని తన పేరుమీద కాకుండా.. ఓ గిరిజన మహిళ పేరుమీద పట్టా చేయించామని.. ఆ తర్వాతే ఆ భూమిని అమ్మామని రమేష్ చెప్పడం విడ్డూరంగా ఉంది.
తన భూమిని వీఆర్వో అమ్మాడట..
రెండున్నర ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసి అమ్మడంలో నూకారపు రమేష్ తో పాటు రిటైర్డ్ వీఆర్వో సత్యనారాయణ ప్రధాన పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు వీరికి మరో డీటీ సహకారం అందించినట్లు కూడా సమాచారం. అయితే ఈ కబ్జా విషయమై దిశ ప్రతినిధి నూకారపు రమేష్ ను వివరణ కోరగా.. రెండున్నర ఎకరాలను తనకు రాజులు రాసిచ్చినా.. వీఆర్వో మాత్రం రెండెకరాలే అంటూ చెప్పాడని చెప్పడం గమనార్హం. ఆ భూమి విషయమై తాను పెద్దగా పట్టించుకోకపోవడంతో వీఆర్వో మిగతా అర ఎకరాన్ని అమ్మి రూ9లక్షలు తీసుకున్నాడని, ఆ విషయం ఈ మధ్యే తెలిసిందని చెప్పడం గమనార్హం.