కేసీఆర్.. నీ మనవడిని ప్రభుత్వ హాస్టల్‌కు పంపు ఇబ్బందులు తెలుస్తాయి: ఈటల

by Dishafeatures2 |
కేసీఆర్.. నీ మనవడిని ప్రభుత్వ హాస్టల్‌కు పంపు ఇబ్బందులు తెలుస్తాయి: ఈటల
X

దిశ, తెలంగాణ బ్యూరో : ముఖ్యమంత్రి కేసీఆర్.. తన మనవడు ఏ బువ్వ తింటే ఆ బువ్వ.. అతడికి అందే సదుపాయాలే పేదల పిల్లలకు అందుతుందని చెప్పారని, ఒక్కసారి కేసీఆర్ తన మనువడిని ప్రభుత్వ హాస్టల్‌లో నాలుగు రోజులు పంపిస్తే విద్యార్థుల ఇబ్బందులు తెలుస్తాయని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ఇది తాను వ్యంగ్యంగా మాట్లాడటం లేదని, ఆవేదనతో మాట్లాడుతున్నానని చెప్పారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అనేక మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ప్రభుత్వ, గురుకుల, సంక్షేమ పాఠశాలల నుంచి వచ్చారని కేసీఆర్ చెప్పారని గుర్తు చేశారు.

అయితే సంక్షేమ పాఠశాలల్లో, హాస్టళ్లలో ఎక్కడ చూసినా ఇబ్బందులే దర్శనమిస్తున్నాయని తెలిపారు. ప్రైవేట్ స్కూళ్లలో చదివించే స్తోమత లేక విద్యార్థులు తల్లిదండ్రులు పిల్లలను ప్రభుత్వ బడులకు పంపుతున్నారన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల నుంచి ఫోన్ వస్తే చాలు పేరెంట్స్ వణికిపోతున్నారన్నారు. తమ పిల్లలకు హెల్త్ బాలేదని చెబుతారో.. చనిపోయారని చెబుతారోనని భయాందోళనలో పేరెంట్స్ ఉన్నారన్నారు. బాసర ట్రిపుల్ ఐటీలో అన్నం, కూర బాగోలేక ఎన్నోసార్లు విద్యార్థులు ఇబ్బందులు పడ్డారని, ఇది ఇంకా కొనసాగుతోందన్నారు. విద్యార్థులు ఫుల్ టైం వీసీ, అధ్యాపకులు కావాలని అడగడం తప్పా అని ప్రశ్నించారు.

తాను చదువుకునే సమయంలో హాస్టళ్లలో మాంసాహారం పెట్టేవారని, కానీ రాకెట్, ఆధునిక యుగంలో క్వాలిటీ ఫుడ్ ఎందుకు ఇవ్వడం లేదని ప్రభుత్వంపై మండిపడ్డారు. తెలంగాణలో ఇంకా ప్రభుత్వ స్కూళ్ళు, కాలేజీలు అద్దె భవనాల్లో నడుస్తున్న దుస్థితి నెలకొందని ఆగ్రహం వ్యక్తంచేశారు. సంక్షేమ గురుకులాల్లో తిండి, వసతులు కల్పించకుండా 6 లక్షల మంది విద్యార్థుల కుటుంబీకులను ఇబ్బందులకు గురి చేయవద్దని ఈటల మండిపడ్డారు. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూడటంతో పాటు డైట్ ఛార్జీలు పెంచాలని, ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేయాలని రాజేందర్ డిమాండ్ చేశారు.

ఇంత తక్కువ కాలంలో ప్రజల చేత ఛీ కొట్టించుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమేనని ఈటల విమర్శలు చేశారు. టీఆర్ఎస్ పార్టీ ప్రజల్లో పూర్తి విశ్వాసాన్ని కోల్పోయిందన్నారు. ఇక కాంగ్రెస్ దేశవ్యాప్తంగా అంతరించిపోయిందని వెల్లడించారు. దాసోజు శ్రవణ్ పీసీసీ చీఫ్ నిర్ణయాలు నచ్చక బయటకు పార్టీ వీడారని తెలిపారు. రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ లతో పాటు ఇతర పార్టీల నేతలు కూడా బీజేపీ వైపే చూస్తున్నారన్నారు. కన్నెబోయిన రాజయ్య యాదవ్, ఎర్రబెల్లి ప్రదీప్ రావు, దాసోజు శ్రవణ్‌తోపాటు చాలా మంది నేతలు ఈనెల 21వ తేదీన అమిత్ షా సమక్షంలో చేరుతున్నారని స్పష్టంచేశారు. బీజేపీలో జాయినింగ్స్ రొటీన్ అయిపోయాయని, అంతా తమకు కామన్‌గా అయిపోయిందని వ్యాఖ్యానించారు.


Next Story

Most Viewed