- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
మిథాలీ సేనకు అగ్నిపరీక్ష.. ఒక్కటి ఓడినా ఇంటికే..

హామిల్టన్: ఐసీసీ మహిళల ప్రపంచకప్లో టీమిండియా చావో రేవో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. టోర్నీ ప్రారంభం నుంచి ఐదు మ్యాచులు ఆడిన భారత్ ఇప్పటివరకు రెండు గెలిచి మూడు ఓడిపోయింది. భారత మహిళల జట్టు సెమీస్ చేరాలంటే రానున్న రెండు మ్యాచుల్లో గెలుపు అనివార్యం కానుంది. వీటిలో ఏ ఒక్క మ్యాచులో ఓడినా టీమిండియా ఇంటికి పయనం కావాల్సిందే. అందుకే మిలిగిన రెండు మ్యాచులు మిథాలీ సేనకు అగ్నిపరీక్ష కానున్నాయి.
బంగ్లా, సౌతాఫ్రికాపై గెలుపు తప్పనిసరి..
భారత మహిళల జట్టు మంగళవారం బంగ్లాదేశ్ జట్టుతో తలపడనుంది. ఈ మ్యాచ్ నెగ్గినా సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే మరో జట్టు సౌతాఫ్రికాపై కూడా మిథాలీ సేన విజయం సాధించాలి. టోర్నీ ప్రారంభంలో పాకిస్థాన్, వెస్టిండీస్ జట్లపై ఘన విజయం సాధించిన టీమిండియా న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్ల చేతిలో ఓటమి పాలైంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా వరుసగా 5 విజయాలు, సౌతాఫ్రికా 4 విజయాలతో ఇప్పటికే సెమీస్కు చేరుకున్నాయి. ఇక వెస్టిండీస్ 6 మ్యాచులు ఆడి 3 నెగ్గగా, భారత్ 5 మ్యాచులు ఆడి 2 నెగ్గి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. భారత్ తర్వాత ఇంగ్లాండ్ కూడా 5 మ్యాచుల్లో 2 నెగ్గి ఐదో స్థానంలో నిలిచింది. ఇదిలా ఉండగా టీమిండియా, ఇంగ్లాండ్ జట్లు తదుపరి రెండు మ్యాచుల్లో తప్పనిసరిగా విజయం సాధించాలి. ఏ జట్టు రెండు మ్యాచులు గెలుస్తుందో అది సెమీస్కు వెళ్లనుంది. ఒకవేళ రెండు జట్లు విడివిడిగా రెండు మ్యాచుల్లో గెలుపొందితే నెట్ రన్ రేట్ ప్రకారం ఏది మెరుగ్గా ఉంటే ఆ జట్టు సెమీస్కు వెళ్లే అవకాశం ఉంది. అందుకే టీమిండియా బంగ్లాదేశ్, సౌతాఫ్రికాతో మెరుగైన రన్ రేట్తో విజయం సాధిస్తే కానీ మిథాలీ సేనకు సెమీస్కు రూట్ క్లియర్ కాదు.