AP News: ముఖ్యమంత్రిగా ఉండి బజారు భాష మాట్లాడతారా?: టీడీపీ

by Dishafeatures2 |
AP News: ముఖ్యమంత్రిగా ఉండి బజారు భాష మాట్లాడతారా?: టీడీపీ
X

దిశ, ఏపీ బ్యూరో : "ప్రతిపక్షాలు నా వెంట్రుక కూడా పీకలేరు" అంటూ నంద్యాలలో బహిరంగ వేదికపై నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. పత్రికలు, ప్రతిపక్షాలనుద్దేశించి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఘాటుగా స్పందించారు. జగన్ వ్యాఖ్యలు చూస్తుంటే గత కొంతకాలంగా రాష్ట్రంలో నెలకొన్న పరిణామాలతో ఆయన తీవ్రమైన ఫ్రస్టేషన్‌కు లోనై అదుపుతప్పి మాట్లాడినట్లు స్పష్టమవుతోంది. 'ఉన్నత పదవిలో ఉన్న ముఖ్యమంత్రి వెంట్రుక పీకలేరు అని మాట్లాడటం ఏం సంస్కారం? రాజకీయాల్లో ఇటువంటి భాష ఏ విధంగా సమర్థనీయం? నంద్యాలలో సీఎం చేసిన వ్యాఖ్యలు గమనించాక ముఖ్యమంత్రి మానసిక వైకల్యంతో బాధపడుతున్నట్లు కన్పిస్తోంది.

ముఖ్య మంత్రిని నువ్వు అని ఏకవచనంతో సంభోదిస్తున్నారని గతంలో ప్రత్యర్థులపై కేసులు పెట్టించిన సీఎం దీనికి ఏం సమాధానం చెబుతారు? రాష్ట్ర ప్రజానీకమంతా అసహ్యించుకునే బూతుల మంత్రి కొడాలి నాని భాషనే ముఖ్యమంత్రి మాట్లాడటం హేయం. ప్రజా సమస్యలపై గళమెత్తుతున్న ప్రతిపక్షాలు, పత్రికలనుద్దేశించి ఇటువంటి బజారు భాష ఉపయోగించడం శోచనీయం. గతంలో బూతుల మంత్రి కొడాలి నాని, జోగి రమేష్ వాడిన భాష, నేటి ముఖ్యమంత్రి వాడిన పదజాలం పరిశీలించాక సీఎం ఆశీస్సులతోనే వారు ఆ విధంగా మాట్లాడినట్లు తేటతెల్లమైంది. గతంలో ఏ ముఖ్యమంత్రి ఇటువంటి భాష మాట్లాడలేదు.

ప్రజలు అధికారమిచ్చారు కాబట్టి రాష్ట్రాన్ని చీకటిమయం చేసినా, అడ్డగోలుగా దోచుకున్నా ఎవరూ నన్ను ఏంచేయలేరన్నది ముఖ్యమంత్రి మనోగతంగా కనిపిస్తోంది. గతంలో ప్రజాగ్రహానికి గురైన మీకంటే కొమ్ములు తిరిగిన నియంతలే కాలగర్భంలో కలిసిపోయారు. రాష్ట్రంలో తీవ్రమైన విద్యుత్ కోతలతో ప్రజలు అత్యంత దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. మీ ఏలుబడిలో సెల్ ఫోన్ ఫ్లాష్ లైట్ల వెలుగులో గర్భిణీలకు ప్రసవాలు చేయాల్సిన దుస్థితి కల్పించారు. ఇటువంటి భయానకమైన పరిస్థితులకు సిగ్గుతో తలదించుకోవాల్సింది పోయి వెంట్రుక పీకలేరంటూ అత్యంత జుగుప్సాకరమైన బజారు భాష మాట్లాడటం మీలో నెలకొన్న అసహనానికి, దిగజారుడుతనానికి నిదర్శనం. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందో, లేదోనన్న అనుమానం కలిగే విధంగా మీ పాలన సాగుతోంది.

బాధ్యతాయుతమైన పదవిలో ఉండి పరిస్థితులను చక్కదిద్దాల్సింది పోయి ప్రతిపక్షాలపై బూతులు లంకించుకోవడం మీ చేతగానితనానికి, అసమర్థతకు అద్దం పడుతోంది. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు.. గత మూడేళ్లుగా మీ అడ్డగోలు, దోపిడీ పాలనను చూశాక మీ వెంట్రుక పీకడం కాదు... రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు' అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య హెచ్చరించారు.



Next Story