జాతీయ లోక్ అదాలత్‌కు భారీ స్పందన

by S Gopi |
జాతీయ లోక్ అదాలత్‌కు భారీ స్పందన
X

దిశ, అదిలాబాద్: జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమానికి జిల్లా ప్రజల నుంచి భారీ స్పందన వచ్చిందని జిల్లా ఎస్పీ డి. ఉదయ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం పోలీసు ముఖ్య కార్యాలయం నుండి ఓ ప్రకటన విడుదల చేస్తూ లోక్ అదాలత్ లో పరిష్కరించిన కేసుల వివరాలను వెల్లడించారు. జిల్లాలోని ఉట్నూర్, బోథ్ అదిలాబాద్ న్యాయస్థానాల్లో వివిధ స్థాయిలో పెండింగ్ లో ఉన్న 2827 పోలీస్ కేసులు పరిష్కరించబడ్డాయి అని పేర్కొన్నారు. ఇందులో ఐపీసీ కేసులు- 346, ఈ-పెట్టి కేసులు- 1864, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు-290 ఉన్నట్లు తెలిపారు. ఈ- పెట్టి కేసులు, డ్రంక్ అండ్ డ్రైవ్, ఎక్సైజ్ కేసుల్లో నేరారోపణలు ఉన్న నిందితులు స్వయంగా న్యాయస్థానాలకు హాజరై తప్పులను ఒప్పుకోవడంతో రూ.14 లక్షల 26 వేల 20 జరిమానా విధించి కేసులను పరిష్కరించినట్లు తెలిపారు. పోలీస్ స్టేషన్ లో నమోదైన కొట్లాట, భార్యాభర్తల మధ్య గల వివాహ సంబంధమైన వివాదములు, అత్తింటివారి వేధింపులు, అన్ని రకాల క్రిమినల్ కేసుల్లోని నిందితులు, బాధితులు కలిసి హాజరై రాజమార్గంలో రాజీ పడడంతో కేసులను కొట్టి వేసినట్లు తెలిపారు.

గత నెల రోజుల నుండి సంబంధిత అధికారులు పోలీసులతో వివిధ సమావేశాలు ఏర్పాటు చేసి విశేష కృషి చేసిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి మంత్రి రామకృష్ణ సునీత, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థకు జిల్లా పోలీసు శాఖ తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు జిల్లా ఎస్పీ డి. ఉదయ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ప్రతి పోలీస్ స్టేషన్ నుండి ప్రత్యేక సిబ్బంది గత 15 రోజులుగా శ్రమిస్తూ అందరికీ సమాచారం అందించి కోర్టుకు వచ్చే విధంగా కృషి చేసిన పోలీస్ అధికారులు, కోర్టు విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులకు అభినందనలు తెలిపారు. ప్రతిరోజూ కేసుల వివరాలను వెల్లడిస్తూ, లోక్ అదాలత్ విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులను మరింత ఉత్సాహ పరుస్తూ భారీ సంఖ్యలో కేసులు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకున్న డీసీఆర్పీ సీఐ గుణవంత్ రావు, ఎస్ఐ ఎంఏ హకీంకు ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నట్లు ప్రకటించారు. అందరు కలిసి టీం వర్క్ బాగా కృషి చేయడంతోనే ఇంతటి భారీ స్పందన వచ్చిందన్నారు, అధిక సంఖ్యలో కేసులు పరిష్కరించడంతో రోజువారీ పోలీస్ విధులకు కాస్త ఊరట కలిగిస్తుందని పేర్కొన్నారు.



Next Story

Most Viewed