100కు చేరిన ఎబోలా మృతులు

by Muthe.Rajitha |

ఆఫ్రికాలో ఎబోలా పాజిటివ్ కేసుల సంఖ్య 550కి చేరగా, ఇప్పటివరకు 101 మంది మరణించారు.

100కు చేరిన ఎబోలా మృతులు
X

దిశ, వెబ్ డెస్క్ : ఆఫ్రికాలో ఎబోలా మరణాలు 100 కు చేరాయి. ఆఫ్రికా దేశమైన డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో(DRC)లో ఎబోలా వైరస్ మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. అధికారిక గణాంకాల ప్రకార.. జూన్ 8 నాటికి అక్కడ ఎబోలా పాజిటివ్ కేసుల సంఖ్య 550కి చేరగా, ఇప్పటివరకు 101 మంది మరణించారు. కేవలం గత 24 గంటల్లోనే కొత్తగా 35 పాజిటివ్ కేసులు, 10 మరణాలు నమోదు కావడం వ్యాధి తీవ్రతను తెలియజేస్తోంది. ఈ కొత్త కేసులు అత్యధికంగా 'ఇటురి'(Ituri) ప్రావిన్స్‌లోనే వెలుగుచూస్తున్నాయి. కాంగోలో నెలకొన్న రాజకీయ అస్థిరత, స్థానిక సాయుధ గ్రూపుల ఘర్షణల వల్ల వైద్య సహాయం అందించడం, వ్యాధిని నియంత్రించడం అంతర్జాతీయ ఆరోగ్య సంస్థలకు పెద్ద సవాలుగా మారింది. కాంగో సరిహద్దులు దాటి పొరుగు దేశమైన ఉగాండాలోనూ కొన్ని ఎబోలా కేసులు నమోదయ్యాయి.

కాంగో నుంచి ఉగాండాకు ప్రయాణించిన వారిలోనే ఈ ఇన్ఫెక్షన్ లక్షణాలు బయటపడటంతో వైరస్ ఇతర దేశాలకు వ్యాపించే ప్రమాదం పొంచివుంది. ఈ తీవ్ర పరిణామాలను పరిగణనలోకి తీసుకున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO), ఈ ఎబోలా వ్యాప్తిని 'అంతర్జాతీయ ఆరోగ్య అత్యవసర పరిస్థితి' (Public Health Emergency of International Concern)గా ప్రకటించింది. ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్న 'బుందిబుగ్యో' (Bundibugyo) స్ట్రెయిన్‌కు మార్కెట్‌లో నిర్దిష్టమైన వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవడం శాస్త్రవేత్తలను మరింత కలవరపెడుతోంది.

Next Story