- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
వ్యవసాయ పంపుసెట్లకు స్మార్ట్ మీటర్లు.. నెల రోజుల్లో అమర్చేందుకు సన్నాహాలు

దిశ, రాయలసీమ : వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్ స్మార్ట్ మీటర్లు అమర్చే ప్రక్రియకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఇందుకు అవసరమైన సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. రాష్ట్ర దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ( ఏపీ ఎస్పీడీసీఎల్ ) పరిధిలోని చిత్తూరు, నెల్లూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో 11 లక్షలకు పైగా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వ్యవసాయ పంపుసెట్లకు త్రీఫేజ్ విద్యుత్ స్మార్ట్ మీటర్లు ఏర్పాటుపై ఇప్పటికే విద్యుత్ అధికారులు జిల్లా స్థాయి సమావేశాలు నిర్వహించారు.
డిస్కం పరిధిలో 97 శాతానికి పైగా రైతులు అంగీకార పత్రాలు ఇచ్చారు. మిగిలినవి వివాదాలు, సాంకేతిక కారణాల వల్ల పెండింగ్లో Iఉన్నాయి. పంపు సెట్లకు స్మార్ట్ మీటర్ల పంపిణీకి, కనెక్షన్ సేఫ్టీ మెటీరియల్ సరఫరాకు వేర్వేరుగా టెండర్లు పిలిచారు. వీటిలో మీటర్లు, కనెక్షన్ సేఫ్టీ సామగ్రి సరఫరా టెండరును షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ దక్కించుకుంది. డిస్కం అధికారులు సంబంధిత సంస్థ అమర్చనున్న మీటర్ల పనితీరు, నాణ్యత పరిశీలనకు గుజరాత్ రాష్ట్రంలోని వడోదరలోని ల్యాబ్కు పంపించారు. అక్కడ నుంచి ప్రాథమిక క్లియరెన్స్ కూడా వచ్చింది. ఏపీ ఎస్పీడీసీఎల్ పరిధిలో స్మార్ట్ మీటర్ల స్కీం కోసం దాదాపుగా రూ .4 వేల కోట్లను వెచ్చిస్తోంది.
టీబీటీ లక్ష్యం ఇది..!
వ్యవసాయానికి పగటి పూట తొమ్మిది గంటలు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా లక్ష్యంతో ప్రభుత్వం పంపుసెట్లకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ( డీబీటీ ) కింద రైతు వాడిన విద్యుత్కు ప్రభుత్వమే నెల నెల బిల్లు చెల్లిస్తుంది. మీటర్లకు గానీ, నెల నెల బిల్లుకు గానీ రైతులు ఒక్క రూపాయి కూడా చెల్లించనక్కర్లేదు. కాంట్రాక్టు సంస్థ ఈ మీటర్లకు ఐదేళ్ల పాటు వారంటీ ఇస్తుంది. మీటరు రీడింగ్, నిర్వాహణ కూడా ఆ సంస్థ చూస్తుంది. మీటరు రీడింగ్ను ప్రతి నెల బిల్లు తీసి రైతుకు ఎస్ఎంఎస్ ద్వారా పంపుతారు. అసలు బిల్లును స్థానిక లైన్మెన్ల ద్వారా అందజేస్తారు. విద్యుత్ బిల్లు సొమ్మును ప్రభుత్వం రైతు బ్యాంక్ ఖాతాలోకి జమ చేస్తుంది. ఆ సొమ్ము డిస్కంలకు 15 రోజుల్లోగా జమ అవుతుంది.
రైతులకు ఎంతో ఉపయోగం ...
వ్యవసాయ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు అమర్చే పని త్వరలో మొదలు పెడతాం. ఇందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. తొమ్మిది నెలల్లో అన్ని మీటర్లను అమర్చుతాం. ఇవి అందుబాటులోకి వస్తే రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. స్మార్ట్ మీటర్, సేఫ్టీ సామాగ్రిలకు గానీ ఒక్క రూపాయి కూడా రైతు చెల్లించాల్సిన అవసరం లేదు. చేతిలోని ఫోన్లోని సమాచారాని కంట్రోల్ చేసే రిమోట్గా పని చేస్తుంది. ఇంటి వద్ద నుంచే పొలంలోని మోటర్ను ఆన్, ఆఫ్ చేసుకోవచ్చు. కరెంటు ఎన్ని గంటలు వచ్చింది, ఎప్పుడు పోయింది స్వయంగా చూసుకోవచ్చు. అధికారులను సైతం ప్రశ్నించే హక్కు కలుగుతుంది.
- హరనాథరావు.. సీఎండీ (ఏపీ ఎస్పీడీసీఎల్)
సర్కిల్ పేరు | ప్రస్తుతం ఉన్న వ్యవసాయ కనెక్షన్లు |
1. తిరుపతి | 2,91,544 |
2. నెల్లూరు | 1,94,925 |
3. కడప | 1,62,129 |
4. అనంతపురం | 2,72,607 |
5. కర్నూలు | 1,79,263 |
మొత్తం | 11,00,468 |