మాయమవుతున్న ఇరానీ కేఫ్‌లు.. వాటి ప్లేస్‌లో వివిధ ప్రాంచైజీలు

by Mahesh |
మాయమవుతున్న ఇరానీ కేఫ్‌లు.. వాటి ప్లేస్‌లో వివిధ ప్రాంచైజీలు
X

దిశ, శేరిలింగంపల్లి : ఉరుకుల పరుగుల జీవితంలో అలిసిన మనసుకు, మొద్దుబారిన మెదళ్లకు చురుకుదనం తెచ్చేది చాయ్. దోస్తులు అయితే ఒక్క ఫుల్ చాయ్ తీసుకుని ఇరానీ కేఫ్ లో గంటల తరబడి కూర్చుని పాత జ్ఞాపకాలను నెమరేసుకుంటూ గుక్కెడు గుక్కెడు టీ తాగుతూ ఎంజాయ్ చేసేవారు. వ్యాపార విషయాలైనా, రాజకీయ ముచ్చట్లయినా, పిచ్చాపాటి కబుర్లయినా ఏదైనా సరే ఇరానీ చాయ్ హోటల్స్ అందరికీ అడ్డాగా ఉండేది. ఇరానీ ఛాయ్ లో ఉస్మానియా బిస్కెట్, హైదరాబాద్ డబల్ రొట్టె(బన్) ముంచుకు తింటూ తమను తాము మై మరిచిపోయేవారు. అంతలా ఇరానీ ఛాయ్ కు అలవాటు పడ్డారు మహానగర జనాలు.

మహా నగరం హైదరాబాద్‌కి చార్మినార్, గోల్కొండ, హుస్సేన్ సాగర్ మాత్రమే కాదు దమ్ బిర్యానీ, ఇరానీ చాయ్ సైతం సెంటర్ ఆఫ్ అట్రాక్షనే. నగరానికి వచ్చిన పర్యాటకులు ఎవరూ బిర్యానీ టేస్ట్ చేయకుండా, ఇరానీ చాయ్ తాగకుండా వెళ్లరంటే అతిశయోక్తి కాదు. ఇరానీ చాయ్ అంటే అంత ఫేమస్ మరి. అయితే కొద్ది కాలంగా ఈ చాయ్ బంధం మెల్లమెల్లగా పలుచబడుతుంది. కొంతకాలంగా ఇరానీ చాయ్ ప్లేస్ లో టీ టైమ్, టీ టాక్, టీ అడ్డా, అంటూ కొత్త కొత్త టీ రుచులు గ్రేటర్ జనాలకు పరిచయం చేస్తున్నారు ఔత్సాహికులు. ఇక్కడికి వచ్చిన కస్టమర్లు కమ్మని రుచుల్లో ఉండే టీ తాగుతూ గంటల తరబడి ముచ్చట్లు పెట్టుకునే ఫెసిలిటీ సైతం కల్పిస్తున్నారు.

వన్నె తగ్గిన ఇరానీ కేఫ్‌లు..

ఒకప్పుడు భాగ్యనగరంలో ఓ వెలుగు వెలిగిన ఇరానీ హోటల్స్ కొంత కాలంగా కనుమరుగవుతున్నాయి. వీధి కొకటి చొప్పున కనిపించిన హోటల్స్ ఇప్పుడు పాతబస్తీ, మెహదీపట్నం, సికింద్రాబాద్ ఇంకొన్ని చోట్ల మాత్రమే కనిపిస్తున్నాయి. ఇరానీ హోటల్స్ ప్లేస్ లో ఇప్పుడు టీ అడ్డాలు వెలుస్తున్నాయి. కాస్త భిన్నంగా, నేటి యూత్ టేస్ట్ కు అనుగుణంగా ఈ కొత్త టీ స్టాల్స్ ను రిక్రియేట్ చేస్తున్నారు నిర్వాకులు.

కేఫ్స్ రీప్లేస్..

కరోనా ఎఫెక్ట్ తో చాలా టీ స్టాల్స్ మూతబడ్డాయి. చిన్నాచితకా హోటల్స్ యజమానులు పెట్టా బేడా సర్దేశారు. దీంతో కొందరు ఔత్సాహికులు టీ వ్యాపారంలోకి అడుగు పెట్టారు. ఒకప్పుడు టీ వ్యాపారమా అనుకునే వారే ఇప్పుడు లక్షల రూపాయలు వెచ్చించి మరీ ఫ్రాంచైజీలు కొనుక్కునేందుకు ముందుకు వస్తున్నారు. ఖర్చుకు ఏ మాత్రం వెనకాడకుండా కొత్త కొత్త థీమ్స్ తో టీ హోటల్స్ పెడుతున్నారు. కస్టమర్లు కూర్చుని గంటల తరబడి ముచ్చట్లు పెట్టుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అన్ని సౌకర్యాలు ఉండేలా కొత్త హోటల్స్ ఏర్పాటు కావడంతో కస్టమర్లు ఆసక్తి కనబరుస్తున్నారు.

బ్రాండెడ్ నేమ్స్..

కొత్తగా ఏర్పాటు అవుతున్న టీ స్టాల్స్‌కు కొత్తకొత్త పేర్లు పెట్టేస్తున్నారు. వీటిలో చాలా వరకు రిజిస్టర్ అయినవి, బ్రాండ్ పేర్లు కావడం గమనార్హం. టీ టైమ్, టీ టాక్, చాయ్ అడ్డా, టీ ప్యాలెస్ పేర్లతో ఉన్న వాటికి నగరంలో చాలా చోట్ల ఫ్రాంచైజీలు ఉన్నాయి. టీ టాక్ అనే బ్రాండ్ ను చెన్నై కంపెనీ ప్రమోట్ చేస్తోంది. ఈ కంపెనీ బ్రాండ్ కోసం ముందుగా రూ.4 లక్షలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అలా డబ్బులు కడితే కావాల్సిన సామాగ్రిని వారే సప్లై చేస్తారు. అలాగే ముగ్గురు ఎంప్లాయీస్ ను నియమించి జీతాలు కూడా వారే ఇస్తున్నారు. వచ్చిన లాభాల్లో పర్సంటేజ్ తీసుకుంటున్నారు. వీరికి మరో ప్రత్యేకత కూడా ఉంది. ఈ ప్రాంచైజీ లో లభించే రకరకాల టీలలో చక్కెర అసలే వాడకపోవడం వీరి ప్రత్యేకత. కేవలం బెల్లంతోనే తయారు చేసిన టీ నే కస్టమర్లకు అందిస్తారు.

ఇక మరో బ్రాండ్ టీ టైమ్. వీరికి నగరంలో చాలా చోట్ల ప్రాంఛైజీ లు ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్‌లో బాగా రన్నింగ్‌లో ఉన్నది ఈ టీ టైమ్ ప్రాంఛైజీలకే. ఇక్కడ పలు రకాల టీ లతో పాటు, జ్యూస్ లు, మిల్క్ షేక్స్ కూడా లభ్యమవుతున్నాయి. గతంలో ఒకటి అరా ఉన్న టీ టైమ్ పాయింట్స్ ఇప్పుడు ఏ గల్లీలో చూసినా కనిపిస్తున్నాయి. ఒక్కో ఫ్రాంచైజీ కోసం రూ.4.50లక్షలు వెచ్చించాల్సి ఉంటుందని చెబుతున్నారు నిర్వాహకులు. ఇవేగాక నగరంలో చాలా రకాల టీ పాయింట్స్ వెలుస్తున్నాయి. ఇందులో వేటి ప్రత్యేకత వాటిదే. రుచులు వేరైనా సిట్టింగ్ విషయంలో మాత్రం గతంలో ఉన్న ఇరానీ కేఫ్ లను మురిపిస్తున్నాయి. ఇప్పుడు భాగ్యనగర జనాలు ఇరానీ ఛాయ్ ప్లేస్ లో కొత్త టీ రుచులను ఆస్వాదిస్తున్నారు.



Next Story