అధికారుల వింత నిర్ణయాలు: కలెక్టర్ సస్పెండ్ ఆర్డర్.. డైరక్టర్ డిప్యూటేషన్ ఆర్డర్

by S Gopi |
అధికారుల వింత నిర్ణయాలు: కలెక్టర్ సస్పెండ్ ఆర్డర్.. డైరక్టర్ డిప్యూటేషన్ ఆర్డర్
X

దిశ, హుజురాబాద్ రూరల్: వారం రోజుల క్రితం ఆ అధికారిని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేస్తే... అదే అధికారిని డిప్యూటేషన్ పై ఏడాదిపాటు ఫారిన్ సర్వీస్ కు బదిలీ చేస్తూ పంచాయితీరాజ్ డైరక్టర్ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేయడం సంచలనంగా మారింది. జిల్లా కలెక్టర్ తీసుకున్న నిర్ణయాన్ని కాదని పంచాయతీరాజ్, రూరల్ డెవలప్ మెంట్ ఆఫీసు విడుదల చేసిన లేఖ జిల్లాలో చర్చకు దారి తీసింది.

కలెక్టర్ ఆదేశాలు ఇలా...

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఎంపీడీఓ బి. రమేష్ మండలంలోని రంగాపూర్ లో శ్మశాన వాటిక నిర్మాణంలో అలసత్వంగా వ్యవహరించారని, లీగల్ అంశాల గురించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకరావడంలో విఫలం అయ్యారన్న ఆరోపణలపై మార్చి 25న కలెక్టర్ ఆర్. వి. కర్ణన్ సస్పెన్షన్ వేటు వేశారు. ప్రొసిడింట్ నెంబర్ ఏ1/432/2022 ద్వారా సస్పెన్షన్ ఉత్తర్వులు విడుదల చేశారు. రమేష్ కు షోకాజ్ నోటీసు కూడా ఇచ్చినట్టు కూడా ఆ లేఖలో కలెక్టర్ వివరించారు.

డైరక్టరేట్ ఉత్తర్వులు ఇలా..

పంచాయితీ రాజ్ కమిషనర్, డైరక్టర్ కార్యాలయంలో పని చేసేందుకు హుజురాబాద్ ఎంపీడీఓ రమేష్ దరఖాస్తు చేసుకున్నారని ఏడాదిపాటు ఫారిన్ సర్విసెస్ కింద రాష్ట్ర కార్యాలయానికి డిప్యూటేషన్ పై బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ప్రొసిడింగ్ నెంబర్ 177/SSBM(G)/2022/A1, తేది 31.03.2022న ప్రాజెక్ట్ డైరక్టర్ ఎ. శరత్ పేరిట ఉత్తర్వులు వెలువడ్డాయి.

కో-ఆర్డినేషన్ లేదా..?

జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేసిన అధికారిని ఫారిన్ సర్వీసులో డిప్యూటేషన్ వేస్తూ పంచాయితీ రాజ్ డైరక్టర్ అండ్ కమిషనర్ కార్యాలయం ఉత్తర్వులు వెలువడడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి సస్పెన్షన్ ఉత్తర్వులు వెలువడ్డాయన్న విషయం కేంద్ర కార్యాలయానికి సమాచారం లేదా లేక కావాలనే డిప్యూటేషన్ పై రప్పించుకున్నారా అన్న విషయంపై అధికార వర్గాల్లో చర్చ సాగుతోంది. సస్పెండ్ కు గురైన అధికారిని వారం రోజులు తిరగకముందే డిప్యూటేషన్ వేయడం ఏంటి అన్నదే అంతుచిక్కకుండా తయారైంది. సాధారణంగా జిల్లా కలెక్టర్లు తీసుకునే నిర్ణయాల గురించి సంబంధి శాఖలకు చెందిన కమిషనర్, డైరక్టర్, కమిషనరే కార్యాలయాలకు కూడా చేరవేస్తుంటారు. అయితే హుజురాబాద్ ఎంపీడీఓ విషయంలో హెడ్ క్వార్టర్ లో ఉన్న యంత్రాంగం సస్పెన్షన్ విషయాన్ని దాచి పెట్టి, డిప్యూటేషన్ ఉత్తర్వులు జారీ చేసి ఉంటుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. జిల్లా కలెక్టర్ ఇచ్చిన ఉత్తర్వులను కాదని రాష్ట్ర స్థాయి అధికారులు డిప్యూటేషన్ ఆర్డర్ పంపించడం వెనక ఆంతర్యం ఏంటోనన్న తర్జన భర్జనలూ సాగుతున్నాయి. ఎంపీడీఓ సస్పెన్షన్ గురించి కమిషనర్ కార్యాలయంలో తెలియక చేశారా లేక తెలిసినా ఈ విషయాన్ని మరుగున పెట్టి డిప్యూటేషన్ లో పంపిస్తూ ఉత్తర్వులు జారీ చేశారా అన్నదే మిస్టరీగా మారింది. ఏది ఏమైనా జిల్లా కలెక్టర్ సస్పెన్షన్ ఉత్తర్వులను పక్కనపెట్టి మరీ డిప్యూటేషన్ వేయడం మాత్రం అధికార వర్గాల్లోనూ చర్చ సాగుతోంది.

అనుమానాలకు ఊతం...

అయితే మార్చి 25న ఎంపీడీఓ రమేష్ ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినా ఆయన మాత్రం 31 వరకూ విధుల్లోనే కొనసాగినట్టు ప్రచారం జరుగుతోంది. కలెక్టర్ ఇచ్చిన ప్రొసిండింగ్ తో విధులకు హాజరు కాకండా హెడ్ క్వార్టర్ లో మాత్రం ఉండాల్సి ఉంది. కానీ ఆయన మాత్రం సస్పెన్షన్ ఉత్తర్వులనే అమలు చేయకుండా రోజూ విధులకు హాజరు కావడం, ఈ క్రమంలోనే డిప్యూటేషన్ ఆర్డర్స్ రావడంతో దీని వెనక మర్మమేదో ఉండి ఉంటుందని హుజురాబాద్ వాసులు అంటున్నారు.



Next Story

Most Viewed