తీవ్ర విషాదం.. పీనుగు ఉన్న ఇంట్లోనే పిడుగు

by Disha Web Desk 12 |
తీవ్ర విషాదం.. పీనుగు ఉన్న ఇంట్లోనే పిడుగు
X

దిశ, చింతలమానేపల్లి: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతల మానేపల్లి మండలంలోని కర్జవెళ్లి గ్రామంలో గుండ్ల శ్యామ్ రావు ఇంటిపై శుక్రవారం సాయంత్రం పిడుగు పడటం జరిగింది. గుండ్ల శ్యామ్ రావు (50) భార్య రత్నక్క(45) యొక్క తండ్రి నాయిని హనుమంతు (95) ఆరోగ్యం క్షీణించి శుక్రవారం మధ్యాహ్నం మరణించారు. అయితే సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో కర్జవెల్లి గ్రామంలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం మొదలు కాగా ఎస్టీ వాడలోని శ్యామ్ రావు పీనుగు ఉన్న ఇంటి పై పిడుగు పడడంతో భయాందోళనకు గురయ్యారు. ఆరోగ్యం బాగోలేక మరణించిన నాయిని హనుమంతు‌కు ఇద్దరు కుమార్తెలు పిడుగు పడే సమయంలో దగ్గరలో ఉన్నందున ఒక్కసారిగా కింద పడి సొమ్మసిల్లి పోయారు.

వెంటనే కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇంట్లో ఉన్న వంట సామాగ్రి, టీవీ , ఎలక్ట్రానిక్ వస్తువులు తదితర వస్తువులు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. అలాగే ఇంట్లో ఉన్న బట్టలు పూర్తిగా కాలిపోవడంతో కుటుంబ సభ్యులు ఏం చేయాలో తెలియక అయోమయంలో పడి తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. ఒకపక్క శ్యామ్ రావు యొక్క మామ నాయిని హనుమంతు మరణించడం, తన ఇంటి పై పిడుగు పడి రేకులు, సామాను మొత్తం ధ్వంసం కావడం రెండు ఒకే రోజు జరగడంతో గ్రామస్తులు తరలివెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చడం జరిగింది. అధికారులు స్పందించి పిడుగుపాటుకు గురైన ఇంటికి నష్టపరిహారం ఇప్పించవలసిందిగా కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని కోరారు.


Next Story

Most Viewed