దేశవ్యాప్తంగా మార్చిలో 10 శాతం పెరిగిన సిమెంట్ ధరలు!

by Disha Web Desk 17 |
దేశవ్యాప్తంగా మార్చిలో 10 శాతం పెరిగిన సిమెంట్ ధరలు!
X

చెన్నై: ఇప్పటికే పెట్రోల్, డీజిల్ మొదలుకొని కాఫీ, టీ ధరలు కూడా పెరిగిపోయాయి. రానున్న రోజుల్లో ద్రవ్యోల్బణ ప్రభావం మరింత ఉండనుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో గత నెలతో పోలిస్తే మార్చిలో దేశవ్యాప్తంగా సిమెంట్ ధరలు పెరిగాయని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. ఫిబ్రవరి వరకు స్థిరంగా ఉన్న సిమెంట్ ధరలు మార్చిలో గతేడాది నవంబర్ స్థాయికి చేరుకున్నాయి. వివిధ బ్రోకరేజీ నివేదికల ప్రకారం.. ఈ నెల 22 నాటికి దేశవ్యాప్తంగా సగటు సిమెంట్ ధర 10 శాతం పెరిగి రూ. 395 కి చేరుకుంది. ఇది గతేడాదితో పోలిస్తే 11 శాతం ఎక్కువ. గత 12 నెలల కాలంలో నవంబర్‌లో సగటు 50 కిలోల సిమెంట్ ధర గరిష్ఠంగా రూ. 385 కి పెరిగింది. ఆ తర్వాత ప్రాజెక్టుల మంజూరు, అమలు, ఇసుక లభ్యత వంటి సమస్యల కారణంగా సిమెంట్ తయారీ కంపెనీలు ధరలను పెంచలేదు.

మార్చిలో నిర్మాణ కార్యకలాపాల సీజన్ కావడంతో పాటు ప్రభుత్వం అందించే రోడ్డు ప్రాజెక్టుల పనుల్లో వేగం అందుకోవడంతో సిమెంట్ ధరలు పెరిగినట్టు పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. ఈ క్రమంలోనే సిమెంట్ తయారీలో కీలకమైన దిగుమతి చేసుకునే బొగ్గు, పెట్‌కోక్ లాంటి ముడి పదార్థాల ధరలు గత మూడు నెలల్లో 24-50 శాతం మధ్య పెరిగాయి. తాజా ధరల పెంపు ద్వారా ముడిసరుకుల భారాన్ని తగ్గించుకోవచ్చని కంపెనీలు భావిస్తున్నాయి. అలాగే, గత త్రైమాసికంతో పోలిస్తే మార్చి త్రైమాసికంలో సిమెంట్ వినియోగం మెరుగ్గా ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.


Next Story

Most Viewed