దేశంలో మెదటిసారిగా భరోసా కేంద్రం ఏర్పాటు

by Dishanational1 |
దేశంలో మెదటిసారిగా భరోసా కేంద్రం ఏర్పాటు
X

దిశ, గద్వాల క్రైమ్: జిల్లాలోని ప్రతిపల్లెలో భరోసా సెంటర్ పై అవగాహన కల్పించాలని అదనపు డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ ఉమెన్ సేఫ్టీ విభాగం అధికారిణి స్వాతి లక్రా అన్నారు. శుక్రవారం ఆమె జిల్లా కేంద్రంలో జెడ్పీ చైర్మన్ సరిత, జిల్లా కలెక్టర్ శ్రీహర్ష, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ఆలంపూర్ ఎమ్మెల్యే అబ్రహంలతో కలిసి భరోసా కేంద్రం, స్త్రీ బాలల సహాయ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళల రక్షణపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టాలను తీసుకొచ్చిందని అన్నారు.

భరోసా కేంద్రాలతో బాధిత మహిళలకు తక్షణ సాయం అందుతుందని, మహిళల జోలికొస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. మహిళల రక్షణకు సీఎం కేసీఆర్‌ అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారని, షీ టీమ్స్‌, సఖీ, వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతున్నాయన్నారు. భరోసా కేంద్రాలు బాధిత మహిళలకు సత్వర న్యాయం, వైద్యం, పరిహారం అందించేందుకు కృషి చేస్తాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో 11 సెంటర్లు ఏర్పాటు చేశామని, మరో 10 సెంటర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో భరోసా సెంటర్ల ఏర్పాటుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. మహిళలు, బాలికల రక్షణ కోసం కాలేజీల్లో 30 మందిని వాలంటీర్లుగా నియమించి శిక్షణ ఇప్పించి లైంగిక దాడులను అరికడతామని వెల్లడించారు.

జెడ్పీ చైర్మన్ సరిత మాట్లాడుతూ... దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో మహిళ రక్షణ కోసం సీఎం కేసీఆర్‌ అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. చట్టాలపై మహిళలు అవగాహన కలిగి ఉండాలన్నారు. ఎవరైనా మహిళల జోలికొస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. వేధింపులు ఎదుర్కొంటున్న బాధిత మహిళలకు అండగా పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోక్సో, లైంగిక దాడి కేసుల్లో బాధితులకు ఇక్కడ సేవలతోపాటు అన్ని రకాల కేసుల్లో సత్వర న్యాయం అందించేందుకు భరోసా కేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సఖీ, షీ టీమ్స్‌ ఏర్పాటు చేసి మహిళల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించిందన్నారు. మానసిక, శారీరక వేధింపులకు గురయ్యేవారికి భరోసా కేంద్రం తక్షణ సహాయం అందిస్తుందన్నారు. ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అబ్రహం మాట్లాడుతూ.. బాధిత మహిళలకు కౌన్సిలింగ్‌ ఇచ్చి మనోధైర్యం నింపడం, ప్రభుత్వం నుంచి అందే పరిహారం కోసం కృషి చేయడం, న్యాయ, వైద్య సహాయం ఈ కేంద్రం ద్వారా అందుతాయన్నారు. జిల్లా కలెక్టర్‌ శ్రీహర్ష, జిల్లా ఎస్పీ రంజన్ రతన్ కుమార్ మాట్లాడుతూ.. గద్వాలలో నేడు చారిత్రాత్మకమైన రోజు అన్నారు. ఇప్పటి వరకు 305 ఫోక్సో కేసులు నమోదు కాగా నలుగురికి శిక్ష పడిందాన్నారు. 121 కేసులు సరైన ఆధారాలు లేక కోర్టులో కొట్టి వేయడం జరిగిందన్నారు. 154 కేసులు ఉన్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ రంగస్వామి, జెడ్పి వైస్ చైర్ పర్సన్ సరోజమ్మ, మార్కెట్ యార్డ్ చైర్ పర్సన్ రామేశ్వరమ్మ, గట్టు ఎంపీపీ విజయ్, ముషాహిదా బేగం, సఖీ కేంద్రం హేమలత, వార్డ్ కౌన్సిలర్ నాగలత, సీఐ, ఆయా మండలాల ఎస్ఐలు, పోలీసులు పాల్గొన్నారు.


Next Story