సర్కార్‌పై నిరుద్యోగులు సీరియస్.. ఎన్నికల వేళ భారీ డ్యామేజ్ తప్పదా?

by Disha Web Desk 2 |
సర్కార్‌పై నిరుద్యోగులు సీరియస్.. ఎన్నికల వేళ భారీ డ్యామేజ్ తప్పదా?
X

దిశ, డైనమిక్ బ్యూరో: నిరుద్యోగుల విషయంలో బీఆర్ఎస్ పార్టీది 'గోరుచుట్టు మీదే రోకలి పోటు' అన్న చందంగా మారింది. ఉద్యోగాల భర్తీ విషయంలో ఇప్పపటికే తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న కేసీఆర్ సర్కార్‌కు గ్రూప్ -2 అభ్యర్థి ప్రవళిక ఆత్మహత్య బిక్ షాక్‌గా మారింది. ఇన్నాళ్లు నోటిఫికేషన్లు ఇవ్వకుండా సరిగ్గా ఎన్నికల నోటిఫికేషన్ గడువు వేళ హడావుడి నోటిఫికేషన్లు ఇవ్వడం ఆ తర్వాత వాటిని వాయిదా వేయడంతో నిరుద్యోగులు తీవ్ర స్థాయిలో రగిలిపోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రవళిక ఆత్మహత్య ఘటన రాష్ట్రంలో తీవ్ర సంచలనంగా మారింది. ప్రవళిక ఆత్మహత్యకు ప్రభుత్వానిదే భాధ్యత అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నెటిజన్లు వేలాది పోస్టులు చేస్తున్నారు. బై బై కేసీఆర్, కేసీఆర్ నెవ్వర్ ఎగైన్ అంటూ యాష్ ట్యాగ్ లతో తమ ఆవేదన తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఇవి సామాజిక మాద్యమాల్లో ట్రెండింగ్‌గా మారాయి.

ఎన్నికల వేళ భారీ డ్యామేజ్ తప్పదా?:

ఉద్యోగాల భర్తీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై యువత తీవ్ర ఆవేదనతో ఉంది. పేపర్ లీక్స్ కారణంగా గ్రూప్-1 పరీక్ష మూడోసారి రాయాల్సిన పరిస్థితి ఏర్పడగా.. ఎన్నికల కోడ్ కారణంగా గ్రూప్-2 వాయిదా పడింది. ఇదే క్రమంలో డీఎస్సీ కూడా పోస్ట్ పోన్ కావడంతో ఆయా పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న అభ్యర్థులు ఇదంతా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే చేస్తూ తమ జీవితాలతో ఆటలాడుతోందని మండిపడుతున్నారు. సొంత ఊరికి, కన్నవారికి దూరంగా ఉంటూ చాలిచాలని భోజనంతో కాలాన్ని వెళ్లదీస్తూ పరీక్షలకు సన్నద్ధం అవుతుంటే ప్రభుత్వం మాత్రం ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆవేదనతో ఉన్నారు. ఈ విషయంలో నిరుద్యోగుల కుటుంబాలు సైతం ఆలోచనలో పడ్డాయి. ఇటువంటి తరుణంలో నిరుద్యోగుల నుంచి వ్యతిరేకతను ఎలా తగ్గించుకోవాలని భావిస్తోంది. ఇంతలో ప్రవళిక ఆత్మహత్య ఘటన నిరుద్యోగుల ఆగ్రహాన్ని కట్టలు తెంచుకునేలా చేసింది. ప్రవళిక ఆత్మహత్య ఘటనతో అర్థరాత్రి వేళ రోడ్లపైకి నిరుద్యోగులు రావడం, సోషల్ మీడియాలో పెద్దఎత్తున తమ గళాన్ని ఎత్తడంతో ఈ పరిణామాలు రాబోయే ఎన్నికల్లో గులాబీ పార్టీకి డ్యామేజ్ తప్పదా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇంకెంతమందిని బలితీసుకుంటావ్:

నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో కొట్లాడి సాధించుకున్న స్వరాష్ట్రంలో నిరుద్యోగుల ఆత్మహత్యలు ఆవేదన భరితంగా మారాయి. అయితే ప్రభుత్వం మాత్రం ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఇదిగో ఉద్యోగాలు అవిగో ఉద్యోగాలు అంటూ సంకేతాలు ఇవ్వడమే తప్ప సరైన రీతిలో నియామకాల భర్తీ చేపట్టలేదనే నిరుద్యోగులు, ప్రతిపక్షాలు మండిపడుతున్నారు. నీ రాజకీయ జీవితం కోసం ఇంకా ఎంతమంది తెలంగాణ పిల్లలను బలితీసుకుంటావ్ కేసీఆర్? అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు.

కన్నీరు పెట్టిస్తున్న ప్రవళిక సూసైడ్ నోట్:

వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం దుగ్గొండి మండలంలోని బిక్కాజిపల్లి గ్రామానికి చెందిన మర్రి లింగయ్య, విజయ దంపతుల కూతురు ప్రవళిక. ఈమెకు ఓ సోదురుడు ఉన్నాడు. ఒక్కగానొక్క కూతురు కావడంతో ప్రవళికను అల్లారుముద్దుగా పెంచుకున్నారు. డిగ్రీ పూర్తి చేసిన అనంతరం ప్రవళిక రెండేళ్ల కిందట హైదరాబాద్ కు వచ్చింది. అశోక్ నగర్ లోని ఓ హాస్టల్ లో ఉంటూ పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతోంది. ఈక్రమంలో శుక్రవారం రాత్రి హాస్టల్ లోనే ప్రవళిక ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోస్ట్ మార్టం అనంతరం ఆమె మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చారు. జీవితంలో ఏదో సాధిస్తానని హైదరాబాద్ కు వెళ్లిన ప్రవళిక ఇలా విగతా జీవిగా తిరిగి రావడంతో గ్రామంలో విషాధ ఛాయలు అలుముకున్నాయి. ప్రవళిక రాసిన సూసైడ్ నోట్ ఇప్పుడు అందరిని కన్నీళ్లు పెట్టిస్తోంది. 'నన్ను క్షమించండి అమ్మా ! నేను చాలా నష్ట జాతకురాలిని నా వల్ల మీరు ఎప్పుడూ బాధపడుతూనే ఉన్నారు. ఏడ్వకండి అమ్మా జాగ్రత్తగా ఉండండి. మీకు పుట్టడం నా అదృష్టం అమ్మ.. నన్ను కాళ్లు కింద పెట్టకుండా చూసుకున్నారు. మీకు నేను చాలా అన్యాయం చేస్తున్న నన్ను ఎవరు క్షమించరు. మీకోసం నేను ఏం చేయలేక పోతున్నా అమ్మా' అంటూ ప్రవళిక రాసిన లెటర్ అందరి హృదయాలను కలిచివేసేలా చేస్తోంది.



Next Story

Most Viewed