కాంగ్రెస్‌లోకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. ముహూర్తం ఖరారు

by Disha Web Desk 2 |
కాంగ్రెస్‌లోకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. ముహూర్తం ఖరారు
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికలు సమీపిస్తోన్న వేళ రాష్ట్రంలో రాజకీయాలు రంజుగా మారాయి. కీలక నేతలు పార్టీలు మారుతూ పొలిటికల్ హీట్ పెంచుతున్నారు. ఉన్న పార్టీలో అసంతృప్తి, టికెట్లు కేటాయించకపోవటం తదితర కారణాలతో పక్కపార్టీల వైపు చూస్తున్నారు. తాజాగా.. మునుగోడు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరిగి సొంతగూటికి వెళ్లేందుకు సిద్ధమయ్యారనే టాక్ పొలిటికల్ సర్కిల్‌లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఇదే విషయమై తన అనుచరులు, ముఖ్య కార్యకర్తలతో సమాలోచనలు చేస్తున్నారని సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే రేపు(24-10-2023) హస్తం తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది.

ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో చేరనున్నట్లు సమాచారం. కాగా, గతేడాది కాంగ్రెస్ పార్టీకి, మునుగోడు ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారు. ఆ తర్వాత బీజేపీలో చేరి మునుగోడు ఉప ఎన్నికల బరిలో నిలిచారు. ఈ బైపోల్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. అనంతరం బీజేపీలోనే కొనసాగినా.. పార్టీ కార్యక్రమాలకు మాత్రం కాస్త దూరంగానే ఉన్నారు. అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తూ.. అప్పుడప్పుడు మాత్రమే బీజేపీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్ గూటికి చేరుతారని ఎప్పట్నుంచో ప్రచారం జరుగుతున్నా.. ఎప్పటికప్పడు ఆ వార్తలను ఖండిస్తూ క్లారిటీ ఇస్తూ వచ్చారు. నిన్న ప్రకటించిన బీజేపీ ఫస్ట్ లిస్ట్‌లోనూ ఆయన పేరు లేకపోవడంతో కోమటిరెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారన్న వార్తలకు ఆజ్యం పోస్తోంది. అయితే ప్రస్తుతం తిరిగి కాంగ్రెస్ గూటికి చేరి, మునుగోడు నుంచి పోటీకి సిద్ధమైనట్లు తెలుస్తోంది.

Next Story