ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బు పంపిణీ.. అక్కడి నుంచి ఓటర్ల ఖాతాల్లోకి సెండింగ్..!

by GSrikanth |
ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బు పంపిణీ.. అక్కడి నుంచి ఓటర్ల ఖాతాల్లోకి సెండింగ్..!
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్దీ ఎమ్మెల్యే అభ్యర్థులు విజయమే లక్ష్యంగా సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు డబ్బు పంపిణీకి పూనుకున్నారు. ఎన్నికల అధికారులకు దొరకకుండా డబ్బు పంపిణీ కోసం ఎక్కువగా పే యాప్లను ఉపయోగించుకుంటున్నారు. కొన్ని చోట్ల ఓటర్లకు డబ్బు పంచేందుకు అనుచరుల ఒక్కొక్కరి చేతికి రూ.40వేలు మాత్రమే ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈసారి డబ్బు పంపిణీ చేస్తూ ప్రత్యక్షంగా పట్టుబడిన వారి ఉదంతాలు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయని పోలీసు వర్గాలే పేర్కొంటున్నాయి.

యాప్ ల ద్వారా పేమెంట్స్

పార్టీల అభ్యర్థులు పేమెంట్ యాప్లను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ఒక్కో అభ్యర్థికి మినిమం 50 మంది అనుచరులుంటారని అందరికీ తెలిసిందే. వీరిలో చాలామంది ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన వెంటనే వేర్వేరు పేర్లమీద 20 నుంచి 30 సిమ్కార్డులు సమకూర్చుకున్నట్టు సమాచారం. వారివారి పేర్లతో వివిధ బ్యాంకుల్లో అకౌంట్లు తెరిచి డిపాజిట్లు కూడా చేసినట్టుగా సమాచారం. ఈ అకౌంట్ల నుంచే పోలింగ్ బూత్స్థాయిలో ఉండే తమ కార్యకర్తలకు పేయాప్ ద్వరా డబ్బులు పంపిణీ చేస్తున్నారు. చాలా బ్యాంకులు ప్రతీరోజూ లావాదేవీలు జరపటానికి రూ.25వేల వరకు అనుమతి ఇస్తున్నాయి. కరెంట్ ఖాతాలకు కొన్ని బ్యాంకులు రూ.లక్ష వరకు అనుమతి ఇస్తున్నాయి. ఈ విధంగా ఖాతాల్లోకి వచ్చి చేరుతున్న డబ్బును యాప్ ల ద్వారా ఓటర్ల ఖాతాల్లోకి వేస్తున్నట్టు సమాచారం. దీనిపై పోలీసువర్గాలతో మాట్లాడగా పే యాప్లు అందుబాటులోకి వచ్చాకా డబ్బు పంచిపెట్టటం సులువైందని చెప్పారు. రూ.20-25వేల వరకు జరిగే లావాదేవీలపై పెద్దగా ఎవరి దృష్టి ఉండదన్నారు. ఇదే అభ్యర్థులకు కలిసి వస్తోందని తెలిపారు.

రూ.50 వేలు దాటకుండా..

కార్యకర్తల చేతికి నగదు ఇస్తున్నా ఆ మొత్తం రూ.50వేలు దాటకుండా అభ్యర్థులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రూ.50వేలకు మించితే అధికారులు సీజ్చేసే అవకాశాలు ఉన్న నేపథ్యంలో రూ.40-45వేలు అభ్యర్థులు తమ అస్మదీయులకు ఇచ్చి పంపిణీ చేపిస్తున్నట్లు తెలిసింది. ఇలా తీసుకెళుతున్న నగదును కార్యకర్తలు ఓటర్ల ఇళ్లకు వెళ్లి డబ్బు పంపిణీ చేస్తున్నట్లు తెలిసింది.

Advertisement

Next Story

Most Viewed