రాష్ట్రంలో అధికార మార్పిడి.. పదేండ్ల తర్వాత పవర్‌లోకి కాంగ్రెస్

by GSrikanth |
రాష్ట్రంలో అధికార మార్పిడి.. పదేండ్ల తర్వాత పవర్‌లోకి కాంగ్రెస్
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య జరిగిన ఎన్నికల హోరాహోరి పోరులో అధికార పార్టీ ఇంటిబాట పట్టింది. ప్రజలు మార్పునే కోరుకున్నారని తేలిపోయింది. పదేండ్ల పాలన వద్దని ఓటర్లు తీర్పు ఇచ్చారు. ఇప్పటివరకు (మధ్యాహ్నం 12.30 గంటలు) జరిగిన ఓట్ల లెక్కింపులో దాదాపు 70 స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉన్న కాంగ్రెస్ స్పష్టమైన మెజారిటీ సాధించింది. పదేండ్ల తర్వాత పవర్‌లోకి వస్తున్నది. రాష్ట్రంలో అధికార మార్పిడి తథ్యమనే సంకేతాలు వెలువడ్డాయి. కౌంటింగ్ ప్రాసెస్ కంప్లీట్ కాకముందే ట్రెండ్‌లను దృష్టిలో పెట్టుకున్న డీజీపీ అంజనీకుమార్ జూబ్లీహిల్స్‌లో రేవంత్ నివాసానికి వెళ్ళి విషెస్ తెలిపారు. ఆయన వెంట పలువురు అదనపు డీజీపీలు కూడా ఉన్నారు.

పదేండ్ల పాలన సాగించిన బీఆర్ఎస్ ఇంటి దారి పడుతున్నదని అధికారుల విషెస్‌తో స్పష్టమైంది. ఆరుగురు మంత్రులు మినహా మిగిలినవారంతా ఓటమి అంచున ఉన్నారు. సిటీలో ఏడు స్థానాల్లో గట్టి పట్టు ఉన్న మజ్లిస్ పార్టీ తాజా ట్రెండ్స్ ప్రకారం మూడు స్థానాలకే పరిమితమైంది. ఊహకు అందని విధంగా మజ్లిస్‌కు పట్టు ఉన్న స్థానాల్లో బీజేపీ పాగా వేసే సూచనలు కనిపిస్తున్నాయి. యాకుత్‌పుర, కార్వాన్ స్థానాల్లో బీజేపీ గాలి వీస్తుండగా నాంపల్లిలో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉన్నది. ఈ మూడు స్థానాలూ దీర్ఘకాలంగా మజ్లిస్ చేతిలో ఉన్నాయి. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేతలంతా వెనుకంజలో ఉన్నా ఊహించని స్థానాల్లో పుంజుకోవడంతో వారే ఆశ్చర్యానికి గురవుతున్నారు.



Next Story

Most Viewed