త్వరలో మటన్ క్యాంటీన్లు ప్రారంభిస్తాం: బాలరాజు యాదవ్

by Disha Web Desk 2 |
త్వరలో మటన్ క్యాంటీన్లు ప్రారంభిస్తాం: బాలరాజు యాదవ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: గొర్రెల, మేకల అభివృద్ధి ఫెడరేషన్ ఆధ్వర్యంలో త్వరలో మటన్ క్యాంటీన్లను ప్రారంభిస్తామని గొర్రెల మరియు మేకల అభివృద్ధి సంస్థ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ తెలిపారు. మంగళవారం గొర్రెల మేకల ఫెడరేషన్ వార్షిక పురోగతి సంపుటిని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా బాలరాజుయాదవ్ మాట్లాడుతూ.. గొర్రెల పంపిణీ పథకం దేశవ్యాప్తంగా పేరు తెచ్చి పెట్టిందనీ, ఈ పథకం వివిధ రాష్ట్రాల ప్రశంసలు పొందిందని తెలిపారు. కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాల ప్రతినిధులు తెలంగాణను సందర్శించి ఈ పథకం అమలు తీరును పరిశీలించి ప్రశంసించారన్నారు. క్షేత్రస్థాయిలో గొర్రె పెంపకదారుల యొక్క సమస్యలను తెలుసుకోవడానికి పల్లెనిద్ర కార్యక్రమం చేపట్టామని, లబ్ధిదారుల అవగాహన సదస్సులు, గొర్రెలకు వ్యాక్సినేషన్, నట్టల నివారణ మొదలైన కార్యక్రమాలు ఫెడరేషన్ ఆధ్వర్యంలో వినూత్నంగా జరుగుతున్నాయని తెలిపారు.

సీఎం చొరవతో ప్రత్యేక అంబులెన్స్లను పశువుల కోసం ఏర్పాటు చేశామని, 1962 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా రాష్ట్రంలో మారుమూల ప్రాంతాలలో ఉన్న గ్రామాలకు సైతం ఇంటి వద్దనే పశువులకు అత్యవసర వైద్యం అందిస్తున్నమని వెల్లడించారు. గొర్రెలు ప్రమాదవశాత్తు చనిపోతే గొర్రెల మేకల ఫెడరేషన్ ద్వారా ఒక లక్ష రూపాయల ఎక్స్గ్రేషియా కూడా అందజేస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో గొర్రెల మేకల పెంపకదారులందరికీ పింఛన్ సౌకర్యం, జీవాల కు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించేందుకు కృషి చేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పశు సంవర్ధక శాఖ డైరెక్టర్, గొర్రెల మేకల ఫెడరేషన్ ఎండీ డాక్టర్ రామ్ చందర్, తెలంగాణ పశుగణాభివృద్ధి సంస్థ సీఈవో డాక్టర్ మంజువాణి, డాక్టర్ల సంఘం ప్రతినిధులు, ఫెడరేషన్ అధికారులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed