147 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాం.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

by Kema Shiva Kumar |

తెలంగాణలో ఖరీఫ్, రబీ సీజన్లలో రికార్డు స్థాయిలో ధాన్యం సేకరించామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.

147 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాం.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 147 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఇవాళ సచివాలయంలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో ఇన్ని టన్నుల ధాన్యం సేకరణ దేశంలోనే సరికొత్త రికార్డు అని పేర్కొన్నారు. ఇప్పటి వరకు రూ.35,077 వేల కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. మొత్తం 8,575 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని, రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా స్థానికంగ ధాన్యం కొనుగోళ్లు జరిగాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో 65.91 లక్షల ఎకరాల్లో 141 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పడిందన్నారు. అయితే, 52 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేయాలని కేంద్రం చెప్పిందని. తాము 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని వెల్లడించారు. మరో లక్ష మెట్రిక్ టన్నులు వారంలో వస్తాయని అన్నారు. దేశంలో ఉత్పత్తి అయ్యే వరిలో 61 శాతం తెలంగాణ నుంచే అని తెలిపారు. ఇక ప్రక్క రాష్ట్రం ఏపీ 25 లక్షల మెట్రిక్ టన్నుల వరి మాత్రమే కొనుగోలు చేసిందని వివరించారు. యాసంగి పంటలో పక్క రాష్ట్రాలు అన్ని తమ కన్నా తక్కువ పంటలను కొనగోలు చేశాయని తెలిపారు.

మా కంటే బీఆర్ఎస్, బీజేపీ తక్కువే..

ధాన్యం కొనుగోలు ద్వారా మహిళా సంఘాలు, పీఏసీఎస్‌లను బలపరుస్తున్నామని మంత్రి ఉత్తమ్ అన్నారు. మహిళా సంఘాల ద్వారా 53 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయించి వారికి రూ.171 కోట్లు ఇచ్చామని తెలిపారు. పీఏసీల ద్వారా 90 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోల్లు జరగాయని అన్నారు. ధాన్యం కొనుగోళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం తమ కన్నా తక్కువ ధాన్యం కొనుగోలు సేకరించిందని, బీజేపీ పాలిత రాష్ట్రంలో కూడా ఇంత వరి సేకరణ చేయలేదని అన్నారు. పదేళ్లలో ధాన్యం కొనగోళ్లలో బీఆర్ఎస్ రైతలకు రూ.1.35 లక్షల కోట్లు ఇస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లలో రూ.లక్ష కోట్లు ఇచ్చిందని, మళ్లీ తమపైనే అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Next Story