రజత్‌కుమార్‌పై దర్యాప్తు చేస్తున్నాం.. ఢిల్లీ హైకోర్టుకు తెలంగాణ వివరణ

by Disha Web Desk 12 |
రజత్‌కుమార్‌పై దర్యాప్తు చేస్తున్నాం.. ఢిల్లీ హైకోర్టుకు తెలంగాణ వివరణ
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ కుమార్తె వివాహ రిసెప్షన్ ఖర్చును ఒక కాంట్రాక్టు సంస్థ భరించిన వివాదానికి సంబంధించి దర్యాప్తు ప్రారంభమైందని, ఆరు వారాల్లో నివేదిక సమర్పిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీ హైకోర్టుకు స్పష్టత ఇచ్చింది. సాగునీటి ప్రాజెక్టును నిర్మించిన ఒక కాంట్రాక్టు సంస్థ ఈ వివాహ ఖర్చులకు సంబంధించిన బిల్లులు చెల్లించడం రాష్ట్రంలో సంచలనం రేకెత్తించింది. దీనిపై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నారాయణపేట జిల్లాకు చెందిన గవినోళ్ళ శ్రీనివాస్ సమగ్ర దర్యాప్తు జరిపి అధికార దుర్వినియోగానికి పాల్పడిన ఐఏఎస్ అధికారి పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఈ పిటిషన్‌పై సెప్టెంబరు 12న విచారించిన హైకోర్టు డీవోపీటీ తీరును తప్పుపట్టింది. అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు వస్తే శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సిన డీవోపీటీ (డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రెయినింగ్) తన బాధ్యతల నుంచి తప్పుకుని తిరిగి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికే ఆ ఫిర్యాదును పంపడం సరైన తీరు కాదని ఆగ్రహం వ్యక్తం చేసింది. స్పెషల్ సీఎస్‌గా ఉన్న అధికారిపై సీఎస్ ఎలా చర్యలు తీసుకోగలుగుతారని ప్రశ్నించింది. ఇకపైన ఎలాంటి చర్యలు తీసుకోనున్నారో నివేదిక సమర్పించాల్సిందిగా రెండు వారాల గడువు ఇచ్చింది. ఆ పిటిషన్‌పై తిరిగి బుధవారం విచారణ ప్రారంభమైంది.

తెలంగాణ ప్రభుత్వం తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ మాధవి దివాన్ వాదిస్తూ, వివాహ ఖర్చు పై విచారణ జరిపించాలని పిటిషనర్ కోరారని, దానిపై ఇప్పటికే దర్యాప్తును మొదలు పెట్టామని వివరించారు. ఈ దర్యాప్తు ఏ దశలో ఉందని హైకోర్టు జడ్జి జస్టిస్ యశ్వంత్ వర్మ ప్రశ్నించారు. విచారణ జరుగుతూ ఉన్నందున పూర్తి వివరాలను ఆరు వారాల్లో నివేదిక రూపంలో కోర్టుకు అందజేస్తామని వివరించారు. పిటిషనర్ తరఫు న్యాయవాది మోహిత్ జోక్యం చేసుకుని, రాష్ట్ర ప్రభుత్వంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్న అధికారిపై ఆరోపణలు వచ్చినందున, సీనియర్ ఐఏఎస్ అధికారి అయినందున దీన్ని కేంద్ర ప్రభుత్వం విచారించవచ్చని, ఆ అధికారం కేంద్రానికి ఉన్నదని తెలిపారు.

అఖిల భారత సర్వీసు అధికారి అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరుపుతూ ఉన్నందున కేంద్ర ప్రభుత్వమే దర్యాప్తు చేయాలని కోరడంలో అర్థం లేదని పిటిషనర్ తరఫు న్యాయవాదిపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఇరు పక్షాల వాదనలు పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు తదుపరి విచారణను డిసెంబర్ 23 కు వాయిదా వేసింది.

Next Story