- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఆ రోజున రామప్పలో పర్యాటకులకు అనుమతి లేదు : కలెక్టర్

దిశ, ములుగు ప్రతినిధి : ఈ నెల 14వ తేదీన యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన రామప్ప దేవాలయాన్ని మిస్ వరల్డ్ పోటీలో పాల్గొనే అందాల భామలు సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో ఆ రోజు పర్యాటకులకు రామప్ప సందర్శనకు అనుమతి లేదని జిల్లా కలెక్టర్ దివాకర స్పష్టం చేశారు. శుక్రవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కలెక్టర్ ఈ విషయాన్ని వెల్లడించారు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో 30 నుంచి 35 మంది వరకు మిస్ వరల్డ్ పోటీదారులు రామప్పకు చేరుకుని దాదాపు మూడు గంటల పాటు అక్కడ ఉంటారని ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా పర్యాటకులకు ఎలాంటి అనుమతి ఉండదని, వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామం వద్ద ఉన్న ఆర్చి లోపలికి మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఎవరినీ అనుమతించబోమని కలెక్టర్ తేల్చి చెప్పారు. పర్యాటకులను అక్కడి నుంచి నిలిపివేస్తామని ఆయన వివరించారు. భద్రతా చర్యల్లో భాగంగా రామప్ప దేవాలయం చుట్టూ దాదాపు 5 కిలోమీటర్ల పరిధిలో డ్రోన్ కెమెరాల వినియోగాన్ని నిషేధించినట్లు తెలిపారు. దేవాలయం లోపల పాత్రికేయులు సైతం ఎలాంటి ఫోటోలు లేదా వీడియోలు తీయడానికి అనుమతి లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. మీడియా కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెంటర్లోనే వారికి అనుమతి ఉంటుందని, ఇతర ప్రాంతాలకు వెళ్లడానికి అవకాశం ఉండదని ఆయన తేల్చి చెప్పారు. మిస్ వరల్డ్ పోటీదారులకు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను పరిచయం చేసేలా ఏర్పాట్లు చేస్తున్నామని, వారి పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ దివాకర్ తెలిపారు.
జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ మాట్లాడుతూ మిస్ వరల్డ్ పోటీదారులు రామప్పను సందర్శించ నున్నందున భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. ఆ రోజు పర్యాటకులకు అనుమతి లేదని ఆయన మరోసారి స్పష్టం చేశారు. పలు దేశాలకు చెందిన అందాల భామలు పర్యటిస్తున్నందున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసి విజయవంతంగా పూర్తి చేయడానికి కృషి చేస్తున్నామని ఆయన అన్నారు. జిల్లా పోలీసు యంత్రాంగం తీసుకుంటున్న ఈ ముందస్తు చర్యలకు ప్రజలు, పాత్రికేయులు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ విలేకరుల సమావేశంలో జిల్లా పౌర సంబంధాల అధికారి యండి.రఫిక్, సిబ్బంది, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.