సూసైడ్ చేసుకున్న ప్రవళిక కుటుంబానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి : రాకేష్ రెడ్డి

by Disha Web Desk 23 |
సూసైడ్ చేసుకున్న ప్రవళిక కుటుంబానికి  ప్రభుత్వమే బాధ్యత వహించాలి : రాకేష్ రెడ్డి
X

దిశ, వరంగల్ కలెక్టరేట్ : జిల్లాకు చెందిన దుగ్గొండి మండలం, బిక్కాజిపల్లి గ్రామానికి చెందిన మర్రి ప్రవళిక ఆత్మహత్య పై బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేష్ రెడ్డి స్పందించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ సమైక్య రాష్ట్రం లో విద్యార్థి, నిరుద్యోగుల కొలువుల కోసం కొట్లాడుతూ ఉద్యమ కాలంలో సుమారు విలువైన 10 ఏళ్ల కాలం ఉద్యమంలో పోయిందన్నారు. కెసిఆర్ విద్యార్థుల, నిరుద్యోగులకు ఒక శనిలా దాపురించాడన్నారు. నూతన రాష్ట్రం తెలంగాణ వచ్చాక నైనా నిరుద్యోగుల కల సాకారం అవుతుందనుకుంటే కేసీఆర్ పాలనలో కన్నవారికి కడుపుకోత మిగిల్చి ఆత్మబలిదానాలు చెయ్యడమే శరణ్యం అవుతుందని ఆవేదన వ్యక్తంచేశారు. గడిచిన పదేళ్ళలో కెసిఆర్ మాయ మాటలు నమ్మిన నిరుద్యోగ యువత, తెలంగాణ అమరవీరుల కుటుంబాలు, రాష్ట్ర ప్రజానీకం తీవ్రంగా మోసపోయారన్నారు. గతంలో ఎందరో నిరుద్యోగులు కన్నవారి కలను నిజం చెయ్యలేక, ఉద్యోగాలు రాక, కోచింగ్ ల కోసం చేసిన అప్పులు తీర్చలేక అనుక్షణం మానసికంగా వేదన వ్యక్తం చేయలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. సూసైడ్ చేసుకున్న బాధిత కుటుంబ సభ్యులపరామర్శకు వెళ్ళే ప్రజా సంఘాల నాయకులను, రాజకీయ పార్టీల ప్రతినిధులను కూడా వెళ్లనివ్వకపోవడం దారుణం మన్నారు. కేసీఆర్ పాలనలో చావు, పరామర్శ కూడా నిర్బంధాలు నడుమ నడుస్తున్నాయి, ఇంతకంటే దారుణం ఇంకొకటి ఉంటుందా అని ప్రశ్నించారు.

ఇటీవల ఇదే ఉమ్మడి వరంగల్ కు చెందిన సునీల్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పుడు కూడా ఇదే ప్రాంతానికి చెందిన ప్రవళిక ఆత్మహత్య చేసుకుంది. ఒకనాడు ఉద్యమానికి ఊపిరూదిన ఈ నేల నుండే తిరుగుబాటు బావుటా ఎగురవేయాలి. ప్రత్యేక తెలంగాణ కోసం అమరులైన అమరవీరుల కలలు నెరవేరాలన్నా, నిరుద్యోగ అమరుల ఆత్మ శాంతించాలన్నా కేసీఆర్ పాలనకు చరమగీతం పాడాలని అన్నారు. మళ్ళీ కేసీఆర్ కనుక సీఎం అయితే కోచింగ్ సెంటర్లు మార్చురీ గదుల్లా మారిపోతాయని వ్యాఖ్యానించారు. ఉద్యోగాల కోసం ఇన్నాళ్లు చదువుకున్న యువత దుబాయ్, మస్కట్ లో వలస కూలీలు అవ్వక తప్పదు. యువత ఏ మాత్రం ధైర్యం కోల్పోకుండా ప్రాణాలు తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రజలు ఇకపై ఏమాత్రం ఏమరుపాటు ప్రదర్శించకుండా కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించాలన్నారు. ఈ నిరుద్యోగ ఉద్యమానికి, తిరుగుబాటుకు ఓరుగల్లే నాయకత్వం వహించాలి అని జిల్లా యువతకు పిలుపునిచ్చారు.

Next Story

Most Viewed