పదో తరగతి వార్షిక ఫలితాల్లో విద్యార్థులు ఉత్తమంగా రాణించేలా తీర్చిదిద్దాలి : కలెక్టర్ ప్రావీణ్య

by Aamani |
పదో తరగతి వార్షిక ఫలితాల్లో విద్యార్థులు ఉత్తమంగా రాణించేలా తీర్చిదిద్దాలి : కలెక్టర్ ప్రావీణ్య
X

దిశ,హనుమకొండ : పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించే విధంగా తీర్చిదిద్దాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అన్నారు. సోమవారం హనుమకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ) ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కేజీబీవీ నిర్వహణకు సంబంధించిన పలు రికార్డులను కలెక్టర్ తనిఖీ చేశారు. వంట సామగ్రిని భద్రపరిచిన స్టోర్ రూమ్ ను పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. కేజీబీవీలో వసతి సదుపాయాలతో పాటు చదువుల గురించి కలెక్టర్ విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు.

ఏమైనా సమస్యలు ఉన్నాయా అని విద్యార్థినులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థినులతో కలిసి కలెక్టర్ భోజనం చేశారు. మధ్యాహ్న భోజనం బాగుందని కలెక్టర్ పేర్కొన్నారు. కేజీబీవీ విద్యార్థులకు నోట్ బుక్స్ ను కలెక్టర్ అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ పదో తరగతి విద్యార్థుల కోసం ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఉత్తమ ఫలితాలు సాధించేందుకు గాను ప్రత్యేక తరగతులను కొనసాగించాలన్నారు. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంత వాతావరణంలో వార్షిక పరీక్షలకు సిద్ధం చేయాలని ఉపాధ్యాయులకు కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో పరకాల ఆర్డీఓ డాక్టర్ కె.నారాయణ, జిల్లా సంక్షేమ అధికారి జయంతి, తహసీల్దార్ సత్యనారాయణ, ఇతర అధికారులు, శాయంపేట కేజీబీవీ స్పెషలాఫీసర్ మాధవి, ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు.

Advertisement

Next Story