'సర్పంచ్‌పై కేసు నమోదు చేయండి'.. ఏసీపీకి ఫిర్యాదు

by Vinod kumar |
సర్పంచ్‌పై కేసు నమోదు చేయండి.. ఏసీపీకి ఫిర్యాదు
X

దిశ, జనగామ: నిబంధనలు అతిక్రమించి స్థానికులపై దాడి చేసేందుకు ప్రయత్నించడమే కాకుండా కారుతో ఓ వృద్ధుడిని ఢీకొట్టిన ఘటనలో రఘునాథపల్లి సర్పంచ్ పోకల శివకుమార్ పై కేసు నమోదు చేయాలని స్టేషన్ ఘనపూరు ఏసీపీ శ్రీనివాసరావు శనివారం రఘునాథపల్లి ఎస్సై రఘుపతిని ఆదేశించారు. రఘునాథపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని సర్వేనెంబర్ (13/ఈ) లో అదే గ్రామానికి చెందిన పేర్న వీరస్వామి, పేర్న మల్లయ్య కుటుంబ సభ్యులకు 562 గజాల ఫ్లాట్ ఉంది. ఈ ప్లాటులో వారు కాంపౌండ్ వాల్ నిర్మిస్తుండగా.. సర్పంచ్ శివకుమార్, తన అనుచరులతో ప్లాట్ వద్దకు వచ్చి పేర్న మల్లయ్య, వీర స్వామిలతో పాటు పనిచేస్తున్న తాపీ మేస్త్రీలను దుర్భాషలాడటమే కాకుండా కారుతో పేర్న మల్లయ్యను కారుతో ఢీకొట్టి అందరిని జైల్లో పెడుతా అంటూ బెదిరించాడని బాధితులు శనివారం స్టేషన్ ఘనపూర్ ఏసీపీ ను కలిసి ఫిర్యాదు చేశారు.

అక్రమ నిర్మాణం చేపట్టినట్లయితే పంచాయతీ కార్యదర్శి ద్వారా నోటీస్‌లు ఇప్పించాలని, అంతేకానీ సర్పంచ్ నేరుగా అక్కడికి వచ్చి దౌర్జన్యానికి పాల్పడడం ఏంటని వారు వాపోయారు. కాగా, బాధితుల ఫిర్యాదు మేరకు సర్పంచ్ శివకుమార్ పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని, ఎస్సైని ఏసీపీ ఆదేశించారు. ఇటీవల కాలంలో సర్పంచ్‌పై అనేక ఫిర్యాదులు ఉన్నప్పటికీ అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని, ఇప్పటికైనా ఇతని ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని భాధితులు కోరారు.



Next Story

Most Viewed