ముట్టుకుంటే కూలిపోతున్నాయి.. ప‌ర్వ‌త‌గిరి పెద్ద చెరువు పున‌ర్నిర్మాణ ప‌నులపై షాకింగ్ నిజాలు

by Disha Web Desk 4 |
ముట్టుకుంటే కూలిపోతున్నాయి..  ప‌ర్వ‌త‌గిరి పెద్ద చెరువు పున‌ర్నిర్మాణ ప‌నులపై షాకింగ్ నిజాలు
X

దిశ ప్ర‌తినిధి, వ‌రంగ‌ల్‌/ ప‌ర్వ‌త‌గిరి: వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలోని పెద్ద చెరువు నిర్మాణ పనులు నాణ్య‌త‌ లేమిగా సాగుతున్నాయి. ఎంతలా అంటే సిమెంట్‌కు బదులు డ‌స్ట్‌ను వినియోగించి ప‌నులు పూర్తి చేస్తుండ‌టంతో నిర్మాణాలు ముట్టుకుంటే కూలిపోతున్నాయి. ఇంత అధ్వానంగా సాగుతున్న ప‌నుల‌కు ఇరిగేష‌న్ అధికారులు ద‌గ్గ‌రుండి వీక్షిస్తున్నా.. ఇదేంట‌ని ప్ర‌శ్నించాల్సింది పోయి కాంట్రాక్ట‌ర్‌కు వ‌త్తాసు ప‌లుకుతుండ‌టం గ‌మ‌నార్హం. నాలుగేళ్లుగా న‌త్త‌న‌డ‌క‌న శీర్షిక‌తో ఇటీవ‌ల దిశ దిన‌ప‌త్రిక‌లో ప‌ర్వ‌త‌గిరి పెద్ద చెరువు రిజ‌ర్వాయ‌ర్ ప‌నుల‌పై స‌మ‌గ్ర‌మైన క‌థ‌నాన్ని ప్ర‌చురించిన విష‌యం పాఠ‌కుల‌కు విదిత‌మే. ఈ విష‌యంపై కొంత‌మంది రైతులు దిశ‌కు మ‌రింత సమాచారం అందించ‌డంతో దిశ రిపోర్ట‌ర్ క్షేత్ర‌స్థాయిలో ప‌రిశీల‌న చేయ‌డం జ‌రిగింది. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన కొన్ని నిర్మాణాలు పూర్తిగా ప‌గుళ్లు చూపి క‌నిపిస్తుండ‌టం గ‌మ‌నార్హం. అంతేకాకుండా ఫోర్‌షోర్‌ను ప‌క‌డ్బందీగా నిర్మాణం చేప‌ట్టాల్సి ఉన్నా.. కేవ‌లం రాళ్ల‌ను డంపు చేసి వ‌దిలేస్తున్నారు. ఇక చెరువు క‌ట్ట‌పై నిర్మించిన గోడ‌ల‌ను ముట్టుకుంటే కూలిపోయే విధంగా ఉండ‌టం గ‌మ‌నార్హం. ఇదే చెరువు క‌ట్ట నిర్మాణానికి గాను 2006లో రూన‌.8కోట్ల‌తో చేప‌ట్టిన ప‌నులు స‌ర్వ‌నాశ‌న‌మ‌య్యాయి. క‌ట్ట కుంగిపోవ‌డంతో 2018లో పెద్ద చెరువు క‌ర‌క‌ట్ట పున‌ర్నిర్మాణం, ఆధునీక‌ర‌ణ‌, రిజ‌ర్వాయ‌ర్‌గా నీటి నిల్వ సామ‌ర్థ్యం పెంపు వంటి ఉన్న‌త ల‌క్ష్యాల‌తో చేప‌ట్టిన ప‌నులు నాణ్య‌త లేకుండా..న‌వ్విపోదురుగాక మాకేంటి అన్న విధంగా సాగ‌డం విశేషం.

నాణ్య‌త లేమి... న‌వ్విపోవును గాక‌..మాకేమి..!

రూ.30కోట్ల‌తో చేప‌డుతున్న రిజ‌ర్వాయ‌ర్ నిర్మాణ ప‌నులు ముగ్గురి చేతుల్లోకి ద‌శ‌ల వారీగా వెళ్ల‌డం గ‌మ‌నార్హం. మొద‌ట కాంట్రాక్ట్ ద‌క్కించుకున్న‌ది ఒక‌రైతే.. ఆ త‌ర్వాత స‌బ్ కాంట్రాక్ట్ మ‌రోక‌రికి చేరింది. అత‌ని నుంచి ఇంకోక‌రికి.. ఇలా ముగ్గురు సార‌థ్యంలో సాగిన‌.. సాగుతున్న ప‌నులు నాణ్య‌త లేకుండా, అధ్వానంగా పూర్తి చేసేందుకు రంగం సిద్ధ‌మైంది. ఇప్ప‌టికే 90శాతం ప‌నులు పూర్త‌య్యాయ‌ని చెబుతున్న ఇరిగేష‌న్ అధికారులు మిగిలిన ప‌నులు నెల‌లోపు పూర్తయ్యేలా చేస్తామ‌ని దిశ‌కు వెల్ల‌డించారు. రిజర్వాయ‌ర్ ప‌నులు జ‌రుగుతున్న, జ‌రిగిన తీరును ప‌రిశీలిస్తే ఏదో ప‌ని పూర్తి చేశామ‌ని అనిపించేలా వ్య‌వ‌హారం కనిపిస్తోంది. నిర్మాణాల నాణ్య‌త‌ను ఇరిగేష‌న్ ఇంజ‌నీరింగ్ క్వాలీటి కంట్రోల్ అధికారులు రిజ‌ర్వాయ‌ర్ ప‌నుల‌ను క్షేత్ర‌స్థాయిలో ప‌రిశీలిస్తే అనేక లోపాలు బ‌హిర్గ‌తం కానున్నాయి.

నాసిర‌కం ప‌నుల‌ను మ‌ళ్లీ నిర్మిస్తాం:శ్రీదేవి, ఇరిగేష‌న్ ఏఈ

కొన్ని నాసిర‌కం పనులు జ‌రిగిన మాట వాస్త‌వమే. వాటిని మ‌ళ్లీ పున‌ర్నిర్మాణం చేప‌ట్టేలా చ‌ర్య‌లు తీసుకుంటాం. వ‌ర్షాల కారణంగా ఇసుక రాకపోకలు నిలిపివేయడంతో కాంట్రాక్టర్లు డస్ట్ తో నిర్మాణం పూర్తి చేశారు. ఆ క‌ట్ట‌డాలు కూల్చేసి మళ్ళీ కట్టవలసిందిగా కాంట్రాక్టర్లు కు ఆదేశాలు జారీ చేసాము. రిజ‌ర్వాయ‌ర్ నిర్మాణ ప‌నులు 90 శాతం పూర్తయ్యాయి...10 పనులు చేయవలసింది ఉన్నాయి.


Next Story

Most Viewed