- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
నిమ్మకాయ స్థానంలో ఉల్లిపాయ.. బయటపడ్డ మంత్రగాళ్ల గుట్టు

దిశ, అశ్వారావుపేట: ప్రస్తుతం నిమ్మకాయ రేటు భారీగా పెరిగింది. కేజీ 200పై మాటే.. దీంతో వంటల్లో నిమ్మకాయ పులుపు చాలావరకు తగ్గించేశారు. చాలా చోట్ల రెస్టారెంట్లు, హోటళ్లలో ఉల్లిపాయతో పాటు నిమ్మకాయ ఇవ్వడం మానేశారు. అదేదో సినిమాలో వరంగల్ లో నిమ్మకాయను ఏమంటారంటే.. నిమ్మకాయనే అంటారు అనే కామెడీ డైలాగ్ లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రంలో ఉల్లిపాయని నిమ్మకాయ అనాల్సి వస్తుంది. అసలు ఏంటా నిమ్మ, ఉల్లి కథాకమామిషు అనుకుంటున్నారా..?
వివరాల్లోకి వెళితే... ప్రతి శుక్రవారం అశ్వారావుపేట పట్టణంలో దుకాణాలకు కొందరు ప్రత్యేకించిన వ్యక్తులు సాంబ్రాణి వేసి ఎర్రటి గుడ్డలో ముడి వేసిన నిమ్మకాయను కడుతుంటారు. ఇలా చేస్తే ఆ దుకాణంలో జరిగే వ్యాపారానికి నరగోష, దిష్టి తగలదని వ్యాపారులు అనాదిగా పాటిస్తూ వస్తున్న నమ్మకం. ఇదంతా చేసినందుకు ఒక్కో దుకాణదారుడు 20 రూపాయలు వీరికి ఇస్తుంటారు. అయితే ఇప్పుడు నిమ్మకాయ ధరలు మండిపోతున్నాయి. చిన్న సైజు కాయలే ఒక్కొక్కటి రూ.10 ధర పలుకతున్నాయి. దీంతో ఆ రేటుకు నిమ్మకాయల కొనుగోలు చేసి దుకాణాలకు కట్టలేక, దుకాణదారులు వద్ద ఎక్కువ డబ్బులు డిమాండ్ చేయలేక మదన పడుతున్న సదరు వ్యక్తులకు బుర్రలో ఈ ఐడియా వచ్చినట్లుంది. అదేంటంటే దుకాణం ముందు కట్టే నిమ్మకాయను ముందుగానే ఎర్రటి గుడ్డలో చుట్టి తీసుకువస్తారు. కాబట్టి అదే ఎర్రటి గుడ్డలో నిమ్మకాయకి బదులు ఉల్లిపాయను పెట్టుకుని వస్తే పోలే అనుకున్నారేమో కానీ... ప్రస్తుతం అశ్వారావుపేట లోని దుకాణాల ముందు దిష్టి నివారణకు కట్టే ఎర్ర గుడ్డ తాయత్తులలో వేలాడుతున్నది నిమ్మకాయ కాదు ఉల్లిపాయనే. ఎందుకంటే ఇప్పుడు ఉల్లిపాయ కేజీ వచ్చి 20 రూపాయలు ఉండటమే ఇందుకు కారణం..
ఈ విషయం ఎలా వెలుగులోకి వచ్చిందంటే... నిమ్మకాయల రేటు చూస్తే భారీగా ఉండడంతో అసలు వీరికి ఎట్లా గిట్టుబాటు అవుతుందని అనుమానం వచ్చిన ఓ దుకాణదారుడు.. తాయత్తుని విప్పి చూడడంతో ఉల్లిపాయ బయటపడింది. ఇదేమీ పెద్ద మోసం కాదనే చెప్పుకోవాలి. ఎందుకంటే చిన్నతనం నుండి ఏంతో కఠోర సాధన చేసి నేర్చుకున్న మంత్రాలను జపిస్తూ సాంబ్రాణి వేసి తాయత్తులు కడితే వీరికి ఇచ్చేది చిల్లరే కదా..! పాపం ఆ చిల్లర కోసమే వారి ప్రయాసంతా... తమ్మిని బిమ్మి.. బిమ్మిని తమ్మి చేసి ఎలాగోలా బ్రతుకు సాగించడం వృత్తి వ్యాపారాలలో సర్వసాధారణం. అయితే గతేడాది అశ్వారావుపేట పరిసర ప్రాంతాల్లో నిమ్మ పంటకు రేటు లేకపోవడంతో... కాయలను కోసి మార్కెట్ కు తరలించడానికి కనీసం కూలీ, రవాణా చార్జీలు మందం కూడా మిగిలే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో ఎంతోమంది రైతులు కాయలను కోయకుండానే వదిలి పెట్టేశారు. దీంతో నిమ్మ తోటల్లో కాయలు నేలరాలి వృధా అయ్యాయి. ఇప్పుడేమో బహు ప్రియం అయ్యి నిమ్మనే ఆధారంగా చేసుకుని జీవించేవారిని ముప్పు తిప్పలు పెడుతుంది. ఈ నిమ్మ పాట్లు ఒక్క అశ్వారావుపేట కే పరిమితం కాదు తెలుగు రాష్ట్రాల్లో అన్నిచోట్లా ఇదే తంతు నడుస్తుంది.