దేవాదుల ప్రాజెక్టు‌కు సహకరించండి.. భూసేకరణలో ఇళ్లు పోతే ఇల్లు ఇస్తాను : మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

by Disha Web Desk 13 |
దేవాదుల ప్రాజెక్టు‌కు సహకరించండి.. భూసేకరణలో ఇళ్లు పోతే ఇల్లు ఇస్తాను : మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
X

దిశ, వరంగల్ బ్యూరో: వరంగల్ జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గం లోని గ్రామాలను సస్యశ్యామలం చేసేందుకు జె చొక్కారావు దేవాదుల ప్రాజెక్టు మూడో పేజ్ పనులను పూర్తి చేసేందుకు రైతులు సహకరించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కోరారు. పాలకుర్తి లోని రాయపర్తి మండలం కొలన్ పల్లిలో, పాలకుర్తి మండలంలోని మల్లంపల్లి లో ఏర్పాటు చేసిన జెసీఆర్ దేవాదుల ప్రాజెక్టు పనుల పురోగతి సమీక్ష సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొని రైతులతో మాట్లాడారు.

జెసీఆర్ దేవాదుల ప్రాజెక్టు 15 ఏళ్ల కింద ప్రారంభించినప్పటికీ కాంగ్రెస్ పాలనలో ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా దాన్ని పట్టించుకోలేదన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక పనులు ప్రారంభించినప్పటి.. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల మూడేళ్లు ఆలస్యం అయిందన్నారు. ఇప్పటికైనా ప్రాజెక్టు పనులు వేగంగా జరగాలంటే భూసేకరణకు రైతులు సహకరించాలన్నారు. పాలకుర్తి నియోజకవర్గంలో ఈ ప్రాజెక్టు కింద 9,780 ఎకరాలకు సాగునీరు అందుతుండగా.. 142 ఎకరాలు మాత్రమే భూసేకరణ కింద పోతుందని, 247 మంది రైతులు భూమి కోల్పోతున్నారు. మిగతా ప్రాంతాల్లో పోల్చితే భూసేకరణ ఇక్కడ చాలా తక్కువగా ఉందని మంత్రి వివరించారు.

రైతులకు ఇబ్బంది జరగకుండా ఉండేందుకు వీలైనంతవరకు ఎక్కువ డబ్బులు వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నామని మంత్రి హామీ ఇచ్చారు. ఒక్కో ఎకరానికి 4.5 లక్షల రూపాయలు వస్తుండగా.. సీఎం కేసీఆర్ తో మాట్లాడి 9 లక్షలకు పెంచానని చెప్పారు. అదేవిధంగా భూసేకరణలో ఇల్లు పోయిన వాళ్లకు కచ్చితంగా ఇల్లు ఇస్తానని మాట ఇచ్చారు. భూమికి పరిహారం తో పాటు ఆ భూమిలో చెట్లు, భూములు, కట్టడాలు ఉంటే వాటికి అదనపు పరిహారం లభిస్తుంది అన్నారు. కాబట్టి రైతులు ప్రాజెక్టు పనులు త్వరగా పూర్తయ్యేందుకు సహకరించాలని ఈ ప్రాంతానికి దేవాదుల నీరు రావడం ద్వారా సస్యశ్యామలం కావడానికి తోడ్పడాలని మంత్రి ఆకాంక్షించారు.

గతంలో రైతుకు ఏ నాయకుడు చేయని మేలు కేసీఆర్ మాత్రమే చేస్తున్నారని చెప్పారు. రైతుకు ఉచిత కరెంట్, నీళ్ళు, రైతు బంధు ఇవ్వడం, వడ్లు కొనడం వల్ల రైతుల జీవితాలు చాలా బాగుపడ్డారని, భూముల ధరలు బాగా పెరిగాయని అన్నారు. పాలకుర్తి లో నేడు ఎకరం కోటి రూపాయలు నడుస్తుంది అంటే అది సీఎం కేసీఆర్ వల్లే అన్నారు. ఈ సమావేశంలో కలెక్టర్లు గోపి, శివ లింగయ్య, అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, ఆర్డీవోలు కృష్ణవేణి, రమేష్ చీఫ్ ఇంజనీర్ సుధాకర్ రెడ్డి, అధికారులు, పాక్స్ చైర్మన్లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, కాంట్రాక్టర్లు, రైతులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed