కాకతీయవారసుడికి ఓరుగల్లు ఘన స్వాగతం.. వైభ‌వంగా కాకతీయ సప్తాహం

by Dishanational2 |
కాకతీయవారసుడికి ఓరుగల్లు ఘన స్వాగతం.. వైభ‌వంగా కాకతీయ సప్తాహం
X

దిశ ప్రతినిధి, వ‌రంగ‌ల్‌/ ఖిలా వ‌రంగ‌ల్ : కాకతీయ వైభవ సప్తాహ వేడుక‌లు గురువారం వ‌రంగ‌ల్‌, హ‌న్మకొండ న‌గ‌రాల్లో వైభ‌వంగా ప్రారంభ‌మ‌య్యాయి. వేడుకల్లో భాగంగా మొదటి రోజు కాకతీయుల వారసుడు కమల్ చంద్ర భంజ్ దేవ్ ముఖ్యఅతిథిగా హాజరుకాగా ఆయనకు మంత్రులు శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ విప్ వినయభాస్కర్

ఘనస్వాగతం పలికారు. హ‌రిత‌హోట‌ల్‌కు చేరుకున్న ఆయ‌న్ను మంత్రులు సాద‌రంగా భ‌ద్రకాళి ఆల‌యానికి తీసుకెళ్లారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ కళారూపాల ద్వారా ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం పోచమ్మమైదన్‌లో రాణి రుద్రమదేవి విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం అక్కడి నుంచి వరంగల్ కోటకు చేరుకొన్నారు. పోచ‌మ్మమైదాన్ నుంచి వ‌రంగ‌ల్ కోట‌కు గుర్రాల బండి పై ఊరేగింపు తీసుకెళ్లడం గ‌మ‌నార్హం. కాకతీయుల చరిత్రను తెలుసుకోవడంతో పాటు కళా సంపదను వీక్షిస్తూ క‌మ‌ల్ చంద్రభంజ్ ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం వేయిస్తంభాల దేవాలయం, అగ్గలయ్య గుట్ట దేవాలయాలను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. చివరిగా కాకతీయ హరిత హోటల్‌లో తెలంగాణ సంప్రదాయ వంటకాలతో ఏర్పాటు చేసిన విందులో పాల్గొన్నారు.




అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశలో ఆయన మాట్లాడుతూ కాకతీయుల వంశంలో పుట్టడం నా అదృష్టంగా, గర్వంగా ఉందని అన్నారు. త‌మ‌ పూర్వీకుల కళా సంపద అద్వితీయం, అపూర్వమని అన్నారు. ఓరుగల్లు ప్రజలు కలకాలం సుఖ, సంతోషాలతో ఉండాలని అన్నారు. కాకతీయుల గొప్పతనాన్ని గుర్తుంచుకొని వేడుకలు నిర్వహిస్తునందుకు, ఈ వేడుకల్లో తనను భాగస్వామిని చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో కాకతీయ వైభవం వేడుకలను కాకతీయుల కళా వైభవం, ఆచార సంప్రదాయాలు ప్రతిబింభించే విధంగా నిర్వహిస్తున్నామన్నారు. వారం రోజులపాటు వేడుకలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు భాగస్వాములై వేడుకలను విజయవంతం చేయాలని అన్నారు. మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం కళలకు, కళాకారులకు పెద్దపీట వేయడం జరుగుతుందన్నారు. అందులో భాగంగా నే ఈ కాకతీయ వైభవ సప్తాహం నిర్వహిండం జరుగుతుందని అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాకతీయులు సాధించిన విజయాలు, వారి చరిత్ర గొప్పదని వారి గురించి అందరికీ తెలిసేలా ఈ వేడుకలు నిర్వహించడం జరుగుతుందని అందుకు సహకరించిన ముఖ్య మంత్రి కేసిఆర్ మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్, గార్లు జిల్లా ప్రజలు రుణపడి ఉంటారని అన్నారు.





చీఫ్ విప్ వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో రెండవ అతి పెద్ద జిల్లాగా గుర్తింపు ఉందన్నారు. కాకతీయుల వైభవం వారి చరిత్ర గురించి అందరికీ తెలిసేలా ఈ వేడుకలు నిర్వహించేందుకు ముఖ్య మంత్రి కేసిఆర్, మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్ ప్రత్యేక చర్యలు తీసుకున్నారని చెప్పారు. ఈనెల 7 నుంచి 13వ తేదీ వ‌ర‌కు వేడుకలు జరుగుతాయని తెలిపారు. ప్రజలందరూ వేడుకల్లో పాల్గొనాలన్నారు. కాకతీయుల వైభవం సప్తాహం వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన రాజు కమల్ చంద్రభంజ్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మేయర్ గుండు సుధారాణి, ఎంపీ పసునూరి దయాకర్, డైరక్టర్ ఆఫ్ కల్చర్ మామిడి హరి కృష్ణ, రెండూ జిల్లాల కలెక్టర్లు రాజీవ్ గాంధీ హనుమంతు, డా. గోపి, సీపీ డా. తరుణ్ జోషి, నగర పాలక సంస్థ కమిషనర్ ప్రావీణ్య, అధికారులు సంబంధిత శాఖల సిబ్బంది పాల్గొన్నారు.



Next Story