- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఆదాయమే అంతంతా..ఆడంబరాలు అవసరమా?

దిశ, వరంగల్ టౌన్ :‘మింగ మెతుకు లేదు.. మీసాలకు సంపెంగ నూనె’ అంటే ఇదేనేమో వరంగల్ మహానగర పాలక సంస్థకు పరిపాలన భవనం లేదని అంతా అనుకుంటుంటే ఎప్పుడో మూడు, నాలుగు నెలలకోసారి జరిగే మీటింగ్ హాల్ దెబ్బతిన్నదనే సాకుతో కోట్లు ఖర్చు చేయడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మరోపక్క బల్దియాకు ప్రభుత్వం నుంచి నిధులు వస్తే తప్ప తట్టెడు మట్టి తీయలేని పరిస్థితుల్లో అంత భారీ మొత్తంలో నిధులు వెచ్చించి కౌన్సిల్ హాలుకు మెరుగులు దిద్దబోతుండడం విస్మయం కలిగిస్తోంది.
మేయర్కే దిక్కులేదు!
వరంగల్ మహానగర పాలక సంస్థను పాలించే మేయర్కే సరైన కార్యాలయం లేదు. అందుకోసం బల్దియా వెనుక భాగంలో కొత్త భవనం నిర్మాణానికి పెద్ద గుంత తీసి ఇప్పటికి రెండేళ్లు పూర్తి కావస్తోంది. అయినా ఆ గుంతను పట్టించుకునే వారే కరువయ్యారు. పరిపాలన భవనం నిర్మించి, ప్రజలకు చేరువ కావాల్సిన పాలనను విస్మరించి, ఉన్న భవనాలు దెబ్బతిన్నాయని కొత్తగా మెరుగులు దిద్దుతున్నారు.
కౌన్సిల్ హాలు మరమ్మతులకు రూ.2కోట్లు!
జీడబ్ల్యూఎంసీలో ప్రతీ మూడు నెలలకోసారి కౌన్సిల్ మీటింగ్ జరుగుతుంది. ప్రతీ సోమవారం గ్రీవెన్స్ సెల్ కూడా నిర్వహిస్తారు. అంతేకాదు, అప్పుడప్పుడు అధికారులతో సమీక్ష సమావేశాలు కూడా జరుగుతుంటాయి. ఇందుకు బల్దియా రెండు బిల్డింగ్ల మధ్య చిన్నపాటి భవనం నిర్మించారు. అందులో మీటింగ్కు అవసరమైన ఏర్పాట్లు చేశారు. నగరంలోని కార్పొరేటర్లు, పలువురు అధికారులు కూర్చునేలా సీట్లు, వాటికి మైకులు, ఏసీలు అమర్చారు. అయితే, ఆ బిల్డింగ్ పైకప్పు కురుస్తున్నదని అధికారులు గుర్తించారు. అయితే, సీలింగ్ ఒకటి మరమ్మతు చేయిస్తే సరిపోయే దానికి మొత్తం ఏర్పాట్లను తొలగించి మళ్లీ కొత్తవి బిగించాలని నిర్ణయించారు. ఇందుకు రూ.2కోట్లు కేటాయించినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే, సీట్లు, మైకులు, ఏసీలు సవ్యంగానే ఉన్నప్పటికీ వాటిని తొలగించి మళ్లీ మెరుగులు దిద్దాల్సిన అవసరం ఏమిటో అర్థం కావడం లేదు.
ఇప్పటికి నిధుల లేమీతో నగరంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులు మధ్యలోనే ఆగిపోయాయి. తమకు బిల్లులు రావడం లేదని కాంట్రాక్టర్లు కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఒకపక్క బల్దియాకు సర్కారు నిధులు ఇస్తే గానీ, ఏ అభివృద్ధి పనికి తట్టెడు మట్టి కూడా తీయలేని పరిస్థితి నెలకొనగా, ఏదో సాకుతో పనికొచ్చే పరికరాలను తొలగించి కొత్తగా తీర్చిదిద్దాలనుకోవడం, అందుకు రూ.2 కోట్ల మేర ఖర్చు చేయాలనుకోవడం వరంగల్ బల్దియా అధికారులకే చెల్లుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అంతేకాదు, బల్దియాలో రిపేరుకు వచ్చిన వాహనాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో రూ.200, రూ.500 పెడితే రిపేరయ్యే పరిస్థితులను కూడా పక్కన పెట్టి కొత్త వాహనాలకు అర్రులుచాచే బల్దియా అధికారులు, ఇలా కోట్లకు కోట్లు ప్రజాధనాన్ని అనవసరమైన ఆడంబరాలకు పోతోందని నగర ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కేవలం కమీషన్ల కోసం కక్కుర్తి పడి అవసరం లేని పనులు చేపడుతుండడంపై నగరవాసులు దుమ్మెత్తిపోస్తున్నారు.