ఫోర్జరీ కేసుపై సాగ‌దీత‌.. మూడు నెలలైన కొలిక్కిరాని ఫేక్ నాలా డాక్యుమెంట్స్ ద‌ర్యాప్తు..!

by Disha Web Desk 19 |
ఫోర్జరీ కేసుపై సాగ‌దీత‌.. మూడు నెలలైన కొలిక్కిరాని ఫేక్ నాలా డాక్యుమెంట్స్ ద‌ర్యాప్తు..!
X

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో: ఖిలా వ‌రంగ‌ల్ స‌బ్‌రిజిస్ట్రార్ కార్యాల‌య కేంద్రంగా ఫేక్‌నాలా డాక్యుమెంట్స్ త‌యారీ, త‌హ‌సీల్దార్ ఫ‌ణికుమార్ సంత‌కం ఫోర్జరీ కేసుపై మిల్స్‌కాల‌నీ పోలీసులు ద‌ర్యాప్తును జాప్యం చేస్తూ వ‌స్తున్నారు. స్వయంగా త‌హ‌సీల్దార్ ఫ‌ణికుమార్ పోలీస్ స్టేష‌న్‌లో ఈ సంఘ‌ట‌న‌పై ఫిర్యాదు చేసి మూడు నెల‌లు కావ‌స్తున్న నిందితులంద‌రినీ అదుపులోకి తీసుకోవ‌డంలో మాత్రం పోలీసులు వైఫ‌ల్యం చెందుతున్నార‌న్న విమ‌ర్శలు వినిపిస్తున్నాయి. ఖిలావ‌రంగ‌ల్‌ త‌హ‌సీల్దార్ ఫ‌ణికుమార్‌ సంత‌కం ఫోర్జరీ, ఫేక్‌ నాలా ప్రోసిడింగ్ డాక్యుమెంట్ల సృష్టి వ్యవ‌హారంతో సంబంధం ఉన్న 15 మంది నిందితులను పోలీసులు గుర్తించారు.

నిందితుల్లో ఖిలా వరంగల్ మండల ఇన్చార్జి సబ్ రిజిస్టర్ చిట్యాల ప్రవీణ్, రిజిస్ట్రేషన్ శాఖలో పనిచేసే సీనియర్ అసిస్టెంట్ దాసరి మునీందర్, డాక్యుమెంట్ రైటర్ గోనే రాంప్రసాద్, ప్రైవేట్ ఉద్యోగి ఇట్యాల సతీష్‌లను కొద్దిరోజుల క్రిత‌మే అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు త‌ర‌లించారు. మిగిలిన 11 మంది నిందితుల్లో తోట‌కూరి కొముర‌య్య, తోట‌కూరి న‌ర్సయ్య, తోట‌కూరి కుమార‌స్వామి, తోట‌కూరి కుమార‌స్వామి(మ‌రొక‌రు), తోట‌కూరి కుమార‌స్వామి(ఇంకోక‌రు) తోట‌కూరి రాము, తోట‌కూరి ల‌క్ష్మణ్‌, తోట‌కూరి స‌తీష్‌, కందుల విజ‌య‌, కందుల శ్రావ‌ణ్ కుమార్, నూర మాధ‌విలు ఉన్నారు. వీరంతా ప‌రారీలో ఉన్నట్లుగా ఈనెల 23న మిల్స్‌కాల‌నీ పోలీసులు విడుద‌ల చేసిన ప్రక‌ట‌న‌లో పేర్కొన్నారు.

కావాల‌నే జాప్యం చేస్తున్నారా..?

నిందితులంద‌రికి సంబంధించిన ప‌క్కా స‌మాచారం తెలిసి కూడా కావాల‌నే అదుపులోకి తీసుకోవ‌డం లేద‌న్న విమ‌ర్శలున్నాయి. ఈ మేర‌కు మిల్స్ కాల‌నీ సీఐ శ్రీనివాస్‌ను ''దిశ'' వివ‌ర‌ణ కోర‌గా మిగ‌తా 11 మందిని అదుపులోకి తీసుకుంటామ‌ని, కోర్టులో ప్రవేశపెడతామని మిల్స్ కాలనీ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్‌ దిశ‌కు వెల్లడించారు. ఇక ప్రస్తుతం రిమాండ్‌లో పోలీసుల అదుపులో ఉన్న చిట్యాల ప్రవీణ్, దాసరి మునీందర్, రాంప్రసాద్, సతీష్‌ల నుంచి ఫేక్ నాలా డాక్యుమెంట్స్ తయారీ, త‌హ‌సీల్దార్ సంత‌కం ఫోర్జరీ చేసిన విధానం, ఎన్ని డాక్యుమెంట్స్‌ను ఇలా త‌యారు చేశారు..? ఎవ‌రెవ‌రికి సంబంధించిన భూములపై ఫేక్ డాక్యుమెంట్స్ త‌యారైంది, బాధితులెంత‌మంది..? వంటి అంశాల‌పై విచార‌ణ జ‌రిపిన‌ట్లుగా తెలుస్తోంది. వాస్తవానికి మూడు నెల‌లుగా ద‌ర్యాప్తును కాస్త సాగ‌దీసిన మిల్స్ కాల‌నీ పోలీసులు.. సీపీ ఏవీ రంగ‌నాథ్‌ భూ వివాదాల కేసుల‌పై ప్రత్యేక శ్రద్ధ చూపుతుండ‌టంతో వెంట‌నే చ‌ర్యల‌కు ఉప‌క్రమించిన‌ట్లుగా తెలుస్తోంది.

అస‌లేం జ‌రిగిందంటే..!

ఖిలా వరంగల్ పడమర కోటకు చెందిన కొంత మంది రైతుల పేరు మీద ఉన్న సర్వే నెంబర్స్ 153,155లో 60 గుంటల భూమి ఉంది. భూ మాఫియా ఒక పథకం ప్రకారం 153, 155 సర్వే నెంబర్లు ఎంచుకొని తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేసి తోటకూరి నర్సయ్య అనే వ్యక్తి మీద దొంగ నాలా ఆర్డర్ సృష్టించి నలుగురు వ్యక్తుల మీద దాదాపు 7200 గజాలను డాక్యుమెంట్ నెంబర్స్ 7847/2022, 7848/2022, 7849/2022, 7850/2022 నెంబర్లతో ఖిలా వరంగల్ సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో రిజి స్ట్రేషన్ చేశారు. కానీ రెవెన్యూ రికార్డుల్లో ఇప్పటికీ రైతుల పేరు మీదనే భూమి ఉంది. ఆల‌స్యంగా గుర్తించిన రైతులు విష‌యాన్ని త‌హ‌సీల్దార్ ఫ‌ణికుమార్ దృష్టికి తీసుకెళ్లారు. రికార్డుల‌ను ప‌రిశీలించిన త‌హ‌సీల్దార్ ఫ‌ణికుమార్ త‌న సంత‌కాన్ని ఫోర్జరీ చేసిన‌ట్లుగా గుర్తించారు.

ఆ వెంట‌నే నాలా ఆర్డర్ ప్రొసీడింగ్ నెంబర్ 2200785786 సర్టిఫికేట్ తాము జారీ చేసింది కాదనీ, సంతకం ఫోర్జరీ చేసి దొంగ సర్టిఫికెట్ సృష్టించినట్లుగా పేర్కొంటూ మిల్స్ కాల‌నీ పోలీసు స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. నాలా ఆర్డర్లో ఉన్న వ్యక్తుల మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాల‌ని కూడా స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. మూడు నెల‌లుగా ద‌ర్యాప్తును సాగ‌దీసిన పోలీసులు ఎట్టకేల‌కు ఇటీవ‌ల ముందడుగు వేశారు. ఒక డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేయాలంటే సబ్ రిజిస్ట్రార్ త‌ప్పనిస‌రిగా రెవెన్యూ రికార్డులను పరిశీలించాల్సి ఉంటుంది. కానీ ఖిలా వరంగల్ సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్‌లో మామూళ్ల మత్తులో కనీసం అమ్మే వారి మీద భూమి ఏ సర్వే నెంబర్ల మీద ఉందో లేదో అని గుర్తించకుండా గుడ్డిగా రిజిస్ట్రేషన్లు చాలానే జ‌రిగిన‌ట్లుగా తెలుస్తోంది.


Next Story

Most Viewed