అది బయటపడితే కేసీఆర్ జైలుకెళ్లడం ఖాయం: బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 19 |
అది బయటపడితే కేసీఆర్ జైలుకెళ్లడం ఖాయం: బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు
X

దిశ, జనగామ: జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి డేరా బాబా అని, ప్రజా సంక్షేమం మరచి ప్రజల భూములు కబ్జా చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడ్డారు. గురువారం రాత్రి బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర జనగామ చౌరస్తాకు చేరుకున్న సందర్భంగా ఆయనకు స్వాగతం పలికారు. జనగామ బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల దశమంత్ రెడ్డి మాట్లాడుతూ.. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ల్యాండ్ గ్రాఫర్ అని, చెరువులు, కుంటలు, గిరిజన భూములను కబ్జా చేసి ప్రజాసంక్షేమం విస్మరించాడని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బండి సంజయ్ యాత్రను చూసి ఓర్వలేక ఫ్లెక్సీలను చించి వేయడం కాదని.. అసలు ఏ సందర్భం ఉందని ఇప్పుడు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని ముత్తిరెడ్డిని ఆయన ప్రశ్నించారు.

హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో ముత్తిరెడ్డిపై అనేక కేసులు ఉన్నాయని, హైకోర్టు ఛీటర్గా ధ్రువీకరించిందని, తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బండి సంజయ్ కమలం పువ్వు కాదని.. ప్రజల సంక్షేమం కోసం తేలే బాంబు అని అన్నారు. ముత్తిరెడ్డి చేసే కబ్జాలు, అఘాయిత్యాలు, హత్యలను ప్రజల్లోకి తీసుకెళ్తామని హెచ్చరించారు. బండి సంజయ్‌ని సవాల్ చేసే స్థాయి ముత్తిరెడ్డిది కాదని గుర్తుంచుకోవాలని సూచించారు. మీ ప్రశ్నలకు బండి సంజయ్ సమాధానం చెప్పడం కాదు.. నేను జనగామ సెంటర్‌కి వస్తా.. దమ్ముంటే నా సవాల్‌ను స్వీకరించి చర్చకు రావాలని సవాల్ విసిరారు.

కేసీఆర్ జైలుకు పోవడం ఖాయం.. కామర్సు బాలసుబ్రమణ్యం

ముఖ్యమంత్రి కేసీఆర్ అతి త్వరలోనే జైలుకు వెళ్లడం ఖాయమని బీజేపీ పార్లమెంటరీ పార్టీ కార్యాలయ కార్యదర్శి కామర్సు బాలసుబ్రమణ్యం పేర్కొన్నారు. కాళేశ్వరం, మిషన్ భగీరథలో జరిగిన అవినీతి త్వరలో బట్టబయలు కాబోతోందన్నారు. ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తూ తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిపోయిన బండి సంజయ్ ను విమర్శించే అర్హత కేసీఆర్‌కు ఉందా? అని ప్రశ్నించారు. గడప దాటడానికే చేతగాని కేసీఆర్ జాతీయ పార్టీ పెడతానంటూ ప్రగల్భాలు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ కాలిగోటికి కూడా పనికిరాని కేసీఆర్ ప్రపంచదేశాలన్నీ కీర్తిస్తున్న మోదీపై విమర్శలు చేయడం సిగ్గు చేటన్నారు. గత కొంత కాలంగా సీఎం కేసీఆర్ ఫ్రస్టేషన్ ఎక్కవై మానసిక రోగిలా మారాడని, ఒకవైపు కొడుకును సీఎంను చేయాలేకపోతున్నాననే అసమర్ధత, ఇచ్చిన హామీలను అమలు చేయలేక, అవినీతిని, భూ కబ్జాలను కట్టడి చేయలేని అసమర్థత వల్ల ఫ్రస్టేషన్ ఎక్కువైందని అన్నారు.

కర్కష, క్రూరమైన, కుటుంబ పాలన కొనసాగిస్తున్న కేసీఆర్ పాలనకు చరమ గీతం పలికేందుకే బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నారని తెలిపారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా మనం సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. బీహార్ లాలూ ప్రసాద్ మాదిరిగా కేసీఆర్ త్వరలో జైలుకు పోవడం ఖాయం అని, ఆయన అవినీతి త్వరలో బయటపడపోతోందని అన్నారు. కాళేశ్వరంలో, మిషన్ భగీరథలో జరిగిన అవినీతిలొ జైలుకు పోవడం తథ్యం అని జోస్యం చెప్పారు. అసమర్థతను, చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికే ప్రధాని నరేంద్రమోదీపై అవాకులు చవాకులు పేలుతూ సీఎం స్థాయిని తగ్గించుకునే స్థితికి కేసీఆర్ దిగజారాడని దుయ్యబట్టారు. కేసీఆర్ నరేంద్రమోదీ కాలి గోటికి కూడా సరిపోడని, చెన్నై, బెంగాల్ సహా కేసీఆర్ ఎక్కడికి వెళ్లినా పట్టించుకునే వారెవరూ లేరన్నారు.

ముత్తిరెడ్డి తీరు మార్చుకోవాలి.. ముక్కెర తిరుపతిరెడ్డి

జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తన తీరు మార్చుకోవాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు ముక్కెర తిరుపతిరెడ్డి అన్నారు. బండి సంజయ్ యాత్ర సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముత్తిరెడ్డి అక్రమాలపై ధ్వజమెత్తారు. అనంతరం కేసీఆర్‌ను టార్గెట్ చేస్తూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. జనగామ చౌరస్తాకు పట్టణంలోని పలు ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు.


Next Story

Most Viewed