స‌ప్లిమెంట‌రీ సేత్వార్ ఏదీ?

by Kalyani |
స‌ప్లిమెంట‌రీ సేత్వార్ ఏదీ?
X

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో : హ‌న్మ‌కొండ జిల్లా ధ‌ర్మ‌సాగ‌ర్ మండ‌లం ఉనికిచర్ల గ్రామ రెవెన్యూ ప‌రిధిలోని స‌ర్వే నెంబ‌ర్ 325లోని 140 ఎక‌రాల 13 గుంట‌ల ప్ర‌భుత్వ భూమికి రికార్డులు క‌ల్పించ‌డంలో అధికారులు ఉదాసీన‌త ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ఈ స‌ర్వే నెంబ‌ర్‌లో 118 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమి ఉంద‌ని పేర్కొంటూ గ‌తంలో సేత్వార్‌, రెవెన్యూ రికార్డుల్లో అధికారులు పేర్కొన్నారు. అయితే కుడా ఆధ్వ‌ర్యంలో ఉనికిచ‌ర్ల‌లో యూని సిటీ ఏర్పాటు చేసే క్ర‌మంలో ఈ స‌ర్వే నెంబ‌ర్‌లో ధ‌ర్మ‌సాగ‌ర్ మండ‌ల రెవెన్యూ అధికారులు నిర్వ‌హించిన స‌ర్వేలో మోఖా మీద రికార్డుల్లో పేర్కొన‌బ‌డిన దాని క‌న్నా సుమారు 24 ఎక‌రాల భూమి అద‌నంగా ఉన్న‌ట్లుగా గుర్తించారు. అయితే రికార్డుల‌కు మాత్రం ఎక్కించ‌కుండా ఉద్దేశ పూర్వ‌క‌మైన జాప్యాన్ని కొన‌సాగించిన‌ట్లుగా ఆరోప‌ణ‌లున్నాయి. ఇదులో భూమి కొల‌త‌ల‌శాఖకు చెందిన కీల‌క అధికారి పాత్ర ఎక్కువ‌గా ఉన్న‌ట్లుగా తెలుస్తోంది. 325 స‌ర్వే నెంబ‌ర్‌లో మోఖా మీద పెద్ద మొత్తంలో ప్ర‌భుత్వ భూమి ఉంద‌ని అత్యంత విశ్వ‌స‌నీయ వ‌ర్గాల ద్వారా తెలిసిన స‌మాచారంతో దిశ వ‌రుస క‌థ‌నాలను ప్ర‌చురించింది.

అక్ష‌ర స‌త్య‌మైన దిశ క‌థ‌నాలు..


ప్ర‌భుత్వ భూముల లెక్క రీస‌ర్వేతో తేలిపోయింది. దిశ త‌న క‌థ‌నాల్లో చెప్పిన‌ట్లుగా నే ఈ స‌ర్వే నెంబ‌ర్‌లో రికార్డుల్లో పేర్కొన‌బ‌డిన దానికంటే మించి 23ఎక‌రాల అద‌నపు భూమిని అధికారుల బృందం గుర్తించ‌డం గ‌మ‌నార్హం. గ‌తంలో సేత్వార్‌, రెవెన్యూ రికార్డుల ప్ర‌కారం.. ఈ స‌ర్వే నెంబ‌ర్ 118 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమి మాత్ర‌మే న‌మోదు కాగా.. వాస్త‌వానికి మోఖామీద 140 ఎక‌రాల‌కు మించి ఉంటుంద‌ని దిశ అత్యంత విశ్వ‌స‌నీయంగా తెలిసిన స‌మాచారంతో వ‌రుస క‌థ‌నాలు ప్ర‌చురించిన విష‌యం పాఠ‌కుల‌కు విదిత‌మే. దిశ వ‌రుస క‌థ‌నాల‌కు హ‌న్మ‌కొండ క‌లెక్ట‌ర్ సిక్తాప‌ట్నాయ‌క్ రీస‌ర్వేకు ఆదేశించారు.

ఈ మేరకు ఆర్డీవో ర‌మేష్‌, డీఐస‌ర్వేయ‌ర్ సారంగ‌పాణి, ధ‌ర్మ‌సాగ‌ర్ త‌హ‌సీల్దార్ స‌దానందంల‌తో అద‌న‌పు క‌లెక్ట‌ర్ మ‌హేంద‌ర్ జీ ఆ రీస‌ర్వేకు క‌మిటీని ఏర్పాటు చేశారు. ఈ క‌మిటీ ఐదురోజులుగా 325 స‌ర్వే నెంబ‌ర్‌లో రెవెన్యూ రికార్డుల‌ను ప‌రిశీలిస్తూ స‌ర్వేను పూర్తి చేసింది. రీస‌ర్వేలో 325 స‌ర్వే నెంబ‌ర్‌లో 140 ఎక‌రాల 37గుంట‌లు ప్ర‌భుత్వ భూమి ఉన్న‌ట్లుగా తేల్చ‌డం గ‌మ‌నార్హం. ఉనికిచ‌ర్ల ప్ర‌భుత్వ భూములపై దిశ ప్ర‌చురించిన క‌థ‌నాలు అక్ష‌ర స‌త్య‌మని రుజువైంది. రికార్డుల్లో న‌మోదైన 118 ఎక‌రాల కంటే అద‌నంగా 23 ఎక‌రాల ప్ర‌భుత్వ‌ భూమి ఈ స‌ర్వే నెంబ‌ర్‌లో ఉంద‌ని గుర్తించడం జ‌రిగింది. ఈమేర‌కు రీస‌ర్వేపై నివేదిక త‌యారు చేసిన అధికారులు క‌లెక్ట‌ర్ సిక్తాప‌ట్నాయ‌క్ అంద‌జేశారు.


ఏదీ సంప్ల‌మెంట‌రీ సేత్వార్‌..!

ఉనికిచ‌ర్ల రెవెన్యూ స‌ర్వే నెంబ‌ర్ 325లో మొత్తం 140.37 ఎక‌రాల భూమి ఉంద‌ని రీస‌ర్వేలో గుర్తించామ‌ని, రెవెన్యూ రికార్డుల‌ను ప‌రిశీలిస్తూ డీఐ సారంగ‌పాణి ఆధ్వ‌ర్యంలో భూ కొల‌త‌లు నిర్వ‌హించాం, ప్ర‌స్తుతం 325లో 118 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమి ఉన్న‌ట్లుగా రికార్డుల్లో ఉంది. తాజాగా రీస‌ర్వేలో గుర్తించిన 140 ఎక‌రాల‌37గుంట‌ల భూ వివ‌రాల‌ను సేత్వార్ స‌ప్లిమెంట‌రీలో పొందుప‌ర్చుతాం. తాజాగా గుర్తించిన భూమిని కూడా కాక‌తీయ ప‌ట్ట‌ణాభివృద్ధి సంస్థ‌కు అప్ప‌గిస్తామంటూ అప్ప‌టి హ‌న్మ‌కొండ‌ ఆర్డీవో ర‌మేష్ దిశ‌కు స‌మ‌గ్ర‌మైన వివ‌రాల‌ను వెల్ల‌డించారు. అయితే స‌ర్వే పూర్త‌యి.. మ్యాపులు సిద్ధం చేసి.. క‌లెక్ట‌ర్‌కు నివేదిక‌లు అంద‌జేసి నెల‌లు గ‌డుస్తున్నా స‌ప్ల‌మెంట‌రీ సేత్వార్ వేయ‌క‌పోవ‌డం వెనుక అధికారుల నిర్ల‌క్ష్య‌మా..? ఇంకా ఏద‌యినా ఉద్దేశ‌పూర్వ‌క‌మైన జాప్యం కొన‌సాగుతోందా..? అన్న అనుమానాలు క‌ల‌గక మాన‌డం లేదు.

ఇదీ 325లో ప్ర‌భుత్వ భూమి లెక్కా..!

స‌ర్వే నెంబ‌ర్ 325లో మొత్తం 140ఎక‌రాల 37 గుంట‌లు ఉంది. 4 ఎక‌రాల 26 గుంట‌ల్లో ఎస్సారెస్పీ కెనాల్ విస్త‌రించి ఉంది. అలాగే 10 ఎక‌రాల‌ను ఫ్రీడం ఫైట‌ర్స్‌కు కేటాయింపు చేశారు. వ‌డ్డెప‌ల్లి నుంచి ఉనికిచ‌ర్ల గ్రామానికి వెళ్లే రోడ్డు కింద‌ 2 ఎక‌రాల 32గుంట‌లు, ఎన్‌హెచ్ 163కింద ఎక‌రం 26 గుంట‌ల ప్ర‌భుత్వ భూమి ఉంది. మొత్తంగా 19 ఎక‌రాల 04గుంట‌ల భూమి ప్ర‌భుత్వ వినియోగం, పంపిణీకి పోగా, నెట్‌ల్యాండ్ 121 ఎ క‌రాల 33 గుంట‌ల భూమి మిగిలి ఉంటుంది. అలాగే ఈ స‌ర్వే నెంబ‌ర్‌లోనే ప్రైవేటు ప‌ట్టాదారుల‌తో వివాదం క‌లిగిన భూమి 2 ఎక‌రాల 30గుంట‌ల వ‌ర‌కు ఉంది. ఈ వివాదం తేలితే నెట్‌ల్యాండ్ విస్తీర్ణం పెరిగే అవ‌కాశం కూడా ఉంటుంద‌ని అధికారులు వెల్ల‌డించారు.



Next Story

Most Viewed